haaram logo

Monday, December 26, 2016

"పెద్దనోట్ల రద్దు వ్యవహారం"......5

ఆర్బీఐ పారదర్శకత.....

(మొన్నటి టపా తరువాయి)

మొన్న ఓ పెద్దాయన--అదే....నిపుణుడు, టీవీలో, "బ్యాంకులవాళ్లని ఏటీఎం లలో ఎందుకు నగదు ఉంచటం లేదు? అని అడిగితే, ఏటీఎం లలో పెడితే, అన్ని బ్యాంకుల ఖాతదారులూ తీసుకుంటారు, మా శాఖ అయితే, మా ఖాతాదారులకే ఇవ్వచ్చు. మాకు ఆ బాధ్యత ఉంటుంది కదా? అన్నారు" అని చెప్పాడు. మరి అలాంటి ఆదేశాలు ఎవరు ఇచ్చారు? అని ఆయన అడగాలేదు, వాళ్లు చెప్పాలేదు....అని ఓ దురభిప్రాయం కలగాలి చూసేవాళ్లకి!

ఇప్పుడు కావలసింది, వీలైనంత ఎక్కువ నగదు చెలామణీ లోకి రావాలి. పరిమిత మొత్తాల్లో, ఎక్కువమంది ద్వారా నగదు చెలామణీ లోకి రావాలి అంటే, ఏటీఎం ల వల్లే సాధ్యం.....అనే చిన్న నిజాన్ని ఎందుకు మరిచిపోతున్నారు? అలా ఎందుకు ఒప్పుకోరు?

20-12-2016 నాటికి పరిస్థితిలో గణనీయమైన మార్పు వచ్చింది. ఉన్నతాధికారుల్లో ఎవరికి ఙ్ఞానోదయమయ్యిందో గానీ, ఆంధ్రా బ్యాంకు లో వారానికి 24,000 చొప్పున, అంతకు లోబడి, అడిగినవారికి అడిగినంత వితరణ చేశారు! ఏటీఎం లో కూడా నగదు వుంచారు.....2 గంటల్లో ఖాళీ అయ్యింది. 

పూర్వం నేను పనిచేసిన శాఖలో ఆ రోజు, ఒక 60 మంది రూ.24,000/-; దాదాపు 200 మంది అంతకు లోపు నగదు తీసుకోగలిగారు! 

స్టేట్ బ్యాంకులో ఆ రోజుకూడా నగదు లేకపోయినా, ఊళ్లో నగదుకొరత లేకుండా పూర్తిగా చెలామణీ జరిగింది!

21 వ తేదీ నుంచి, దాదాపు మా ఊళ్లో అన్ని బ్యాంకుల్లోనూ, అధిక శాతం ఏటీఎం లలోనూ నగదు వితరణ బాగానే జరుగుతోంది!

"50 రోజులు" కన్నా ముందే, ఎవరు ఎంత అరిచిగీపెట్టినా, నగదు కష్టాలు తీరిపోతున్నట్టే! 

ఇంక, ఆర్బీఐ పారదర్శకత.....సంగతి.....!

ఆర్బీఐ గత 90 యేళ్లనుంచీ చేస్తున్న పనే--నగదు ముద్రణా, పంపిణీ--ఇప్పుడూ చేస్తోంది! ఆ విషయం మన సోకాల్డ్ నిపుణులు వారికి నేర్పఖ్ఖర్లేదు.....సలహాలు ఇవ్వ వలసిన అవసరం లేదు. 

ఆర్బీఐ కి ఈ విషయం లో "పారదర్శకత" (అంటే, మీడియావాళ్లకి ప్రతిరోజూ బులెటిన్లు విడుదల చేయడం) పాటించవలసిన అవసరం లేదు!

స్థూలంగా, గత వారాల్లోనూ, నెలల్లోనూ ఏ బ్యాంకు నుంచి ఎంత నగదు చెలామణిలోకి వచ్చింది, ప్రస్తుతం ఎంత అవసరం వుంటుంది అనే లెఖ్ఖల మీద ఆథారపడి, బ్యాంకులకి నగదు పంపిణీ జరుగుతుంది. (ముఖ్యంగా....యే రాష్ట్రానికి ఎంత? అనే ప్రశ్నే రాదు! ఆ బాధ్యత ఆ బ్యాంకు యాజమాన్యాలదే! యూపీ ఎలక్షన్లొస్తున్నాయి కాబట్టి, అక్కడ ఎక్కువ నగదు పంపిణీ చేస్తున్నారు.....లాంటి ఆరోపణలు పూర్తిగా హాస్యాస్పదం!)

ఇప్పుడు, ఇదివరకు కన్నా చాలా వేగంగా ఆర్బీఐ నుంచి బ్యాంకులకి నగదు వితరణ జరుగుతూంది. కొన్ని నిబంధనలు కూడా సడలించి మరీ చేస్తున్నారు. 

(వివరంగా వ్రాయమంటే ఇంకోసారి వ్రాస్తాను.)

ఇలాంటి పరిస్థితుల్లో, ఆర్బీఐ మీద ఆరోపణలు చేస్తున్నవాళ్లు......మూర్ఖులు!

4) సరైన ప్రత్యామ్నాయాలు చూపించకుండా......!

(......మరోసారి)

Sunday, December 18, 2016

"పెద్దనోట్ల రద్దు వ్యవహారం"......4

నగదు వితరణ సమస్య.....

(మొన్నటి టపా తరువాయి)

రాష్ట్ర ప్రభుత్వం వారు, 9000 కోట్లు వస్తున్నాయి అనీ, అందులో సింహభాగం 500 నోట్లూ, చిన్న నోట్లే అనీ, క్రితం శనివారం (10-12-2016) నాటికి అన్ని బ్యాంకులకీ చేరుతాయి అనీ ప్రకటించారు. పించన్లు బ్యాంకులలో జమచేయడం పొరపాటే అనీ, బ్యాంకుల్లో జమ కాని వారికి, పాత పధ్ధతిలో, ఇంటి వద్దే చెల్లిస్తాము అని కూడా ప్రకటించారు.

ఆర్బీఐ వారు, ప్రతిరోజూ ఉదయం 9-00 కల్లా బ్యాంకుల శాఖలలో నగదు అందజేయవలసిందే--అని నగదు భాండాగారాలు నిర్వహిస్తున్న బ్యాంకులని ఆదేశించారు!

అయినా, ఈ టపా వ్రాస్తున్న రోజు--19-12-2016 వరకూ--పరిస్థితి లో మార్పు లేదు! మొన్న శనివారం అయితే, మా వూళ్లో అన్ని బ్యాంకులలోనూ, నగదు వితరణ అసలు జరగలేదు.....నగదు లేదు అనే బోర్డులనే ప్రదర్శించారు.....అంటున్నారు!

మరి......బాధ్యులు ఎవరు?

బ్యాంకుల సిబ్బంది, సెలవులు వాడుకోకుండా, రోజూ దాదాపు 10 గంటలకి పైగా పనిచేస్తున్నారు......! అని చెప్పడం--అతిశయోక్తి మాత్రమే. 

సెలవు రోజులు నవంబర్ 12, 13 న మాత్రమే పనిచేశారు. తరువాత ఆర్బీఐ గానీ, ప్రభుత్వం గానీ, సెలవుల్లో పనిచేయమని చెప్పలేదు.....నగదు సరఫరా పరిస్థితుల వల్ల. సిబ్బంది, సెలవు రోజులు పాటిస్తూనే ఉన్నారు, ఒత్తిడి ఎక్కువ అని భావించిన వాళ్లు, పనిదినాల్లో కూడా సెలవులు పెట్టుకుంటూనే ఉన్నారు!

శాఖలలో సిబ్బంది, ఏమి చెయ్యాలో తోచక, నగదు కోసం ఎదురు చూడడం, తెచ్చుకోవడం, 'అందరికీ' ఎంతో కొంత సరిపెట్టడం, ఆ రోజుకి మూసెయ్యడం తప్ప ఇంకేమి చేశారు?

మరి ఉన్నతాధికారులు ఏమి చేస్తున్నారు? శాఖల నియంత్రణాధికారం ఉన్న ప్రాంతీయ కార్యాలయాల్లో ఉండే ఉన్నతాధికారులు.....'సమీక్ష ' ల తోనే గడుపుతున్నారు!

ఎవరైనా, శాఖల్లో "నగదు నిల్వల పరిమితి" ని దాటి ఉంచుకుంటున్నారా? నిల్వల్లో పాత 100 అంతకన్నా తక్కువ విలువగల నోట్లు ఎన్ని ఉన్నాయి? అని ఆరా తీశారా? (శాఖల్లో, కొత్తనోట్లు వచ్చినవి వచ్చినట్లు వితరణ మాత్రమే చేస్తున్నారు. ఎందుకంటే, అవి లెఖ్ఖపెట్టవలసిన అవసరం లేకుండా, నెంబర్లు చూసి వితరణ చేసెయ్యవచ్చు! పాతనోట్లు అయితే, లెఖ్ఖపెట్టి ఇవ్వాలి, ఎక్కువ తక్కువలు వస్తే, భరించాలి!)

అసలు, వచ్చిన నగదులో ఏటీఎం లలో పట్టగలిగినన్ని 100 నోట్లు (2000 నోట్లు స్వీకరించని మిషన్లలో) పెట్టండి, అనీ, వారానికి 24000 కు లోబడి, అడిగినంత నగదు వితరణ చేయండి.....అని ఎందుకు ఆదేశించరు?

నా ప్రశ్న ఒకటే.....ఉన్నతాధికారులు, "నగదు లేదు అని బోర్డులు పెట్టెయ్యండి" అని శాఖలకి చెప్పవచ్చా? రేపు, "మేమే ఆ ఆదేశాలు ఇచ్చాము" అని నిజాయితీగా ఒప్పుకునేవాళ్లు ఎంతమంది?

(ఇప్పుడు నిబంధనలు పాటించలేదు అనే ఆరోపణలపై చర్యలని ఎదుర్కుంటున్నవాళ్లు చాలా మంది ఉన్నతాధికారులే!)

ఇంక, 3. ఆర్బీఐ పారదర్శకత పాటించడం లేదు--అన్నది చర్చల్లో పాల్గొంటున్న "నిపుణులు" చెప్తున్నది.

(......మరోసారి)

Saturday, December 17, 2016

"పెద్దనోట్ల రద్దు వ్యవహారం"......3

"....క్యూలలో సామాన్యులు కష్టాలు పడుతున్నారు!"

(నిన్నటి టపా తరువాయి)

అదికూడా బ్యాంకు పై అధికారుల తప్పిదమే. వాళ్లు జవాబు చెప్పాల్సి వస్తుంది.

తరువాత, బ్యాంకులకి 2000 నోట్లు వచ్చినా, వాటిని నోట్ల బదిలీ కి మాత్రమే వాడుకున్నారు ....నాలుగైదు రోజులదాకా. 100 నోట్లు రాగానే, కొన్ని బ్యాంకులు ఏటీఎం లలో పెట్టాయి. కానీ, అందరూ....2000 నోట్లకి చిల్లర దొరకడం లేదు అంటూ, 1900 చొప్పున తీసుకోవడం మొదలెట్టారు. చాలా తక్కువ సమయం లోనే, అవన్నీ ఖాళీ!

తరువాత, మళ్లీ కొత్త నోట్లు వచ్చినా, బ్యాంకుల వద్ద క్యూలు తగ్గలేదు. 

బ్యాంకు అధికారులు, స్వంత నిర్ణయాలు తీసుకొని, "వారానికి ఒక్కొక్కళ్లూ 24 వేలు తీసుకోవచ్చు" అన్నా, 'అందరికీ సమానంగా పంచుతాం' అంటూ, ఒక్కొక్కళ్లకీ 6000 చొప్పునో, 4000 చొప్పునో, 2000 చొప్పునో సరిపెట్టడం మొదలెట్టారు. అలా కాకుండా, ఖాతా లోంచి నగదు ఉపసంహరించే వాళ్లు  ఒక్కొక్కళ్లకీ 24 వేల వరకూ, వాళ్లు అడిగినంత ఇచ్చేసి ఉంటే, ఎక్కువ నగదు--తక్కువ సమయంలో చెలామణీ లోకి వచ్చేది! 

నగదు లేదు కాబట్టి, క్యూలు ఉండేవి కాదు! అదీ తప్పిదం.

19 వ తేదీ నాటికి అదీ పరిస్థితి. 

అప్పటికి కూడా, అదే పధ్ధతి అనుసరిస్తూ, క్యూలలో ఉన్నవాళ్లకి ఒక్కొక్క 2000 నోటు ఇస్తుంటే, కుటుంబం లో అందరూ క్యూలలో నుచొని, ఒక్కొక్కళ్లూ రెండేసి వేలు తీసుకొని, ఇంట్లో దాచుకోవడం మొదలెట్టారు!

20 న సెలవు తరవాత, 21 నుంచి ఇంకా క్యూలు పెరిగాయి! 

కొన్నిచోట్ల బ్యాంకుల వాళ్లతో గొడవ పెట్టుకోవడం మొదలయ్యింది. అయినా, అధికారులు.....అదే పధ్ధతి లో వచ్చిన కొత్తనోట్లు పంచిపెట్టేసి, "నగదు లేదు" అని బోర్డులు పెట్టెయ్యమని "ఆదేశాలు" ఇచ్చారు. 

ఓ జిల్లాలో బ్యాంకు శాఖలన్నింటికీ అధికారి (జోనల్ మేనేజరు)..... "నగదు లేదు అని బోర్డులు పెట్టెయ్యండి. బందోబస్తు అవసరమైతే, నాకు ఫోను చెయ్యండి. నేను డీ ఎస్ పీ తో మాట్లాడి, పోలీసులని ఏర్పాటు చేస్తాను" అని శాఖాధికారులకి చెప్పాడంటే, అది సబబేనా?

కొన్ని బ్యాంకుల ఏటీఎం లు 2000 నోట్లు వితరణ చేసేలా మార్చబడ్డాయి. వాటిలో, వచ్చిన నగదులోనే కొంత పెట్టగానే, అక్కడ క్యూలు ఏర్పడి, నగదు ఖాళీ అవగానే, ఇంకో ఏటీఎం వెతుక్కునేవాళ్లు వెళ్లిపోతే, ఇంకొంతమంది, మళ్లీ పెట్టకపోతారా అనే ఆశతో అక్కడే క్యూల్లో నిలబడేవారు! 

25 వ తేదీ వరకూ అదే పరిస్థితి.....బ్యాంకులముందు క్యూలు, ఏటీఎం ల ముందు క్యూలు. (కొన్ని బ్యాంకులనుంచి--ముఖ్యంగా ప్రైవేటు బ్యాంకులలోంచి, పెద్ద సంఖ్యలో 2000 నోట్లు ప్రక్కదారి పట్టడం మొదలయ్యింది.)

26, 27 సెలవులు రాగానే, "అలసిన బ్యాంకు సిబ్బంది విశ్రాంతి తీసుకుంటున్నారు" అని ప్రకటించేశాయి పత్రికలూ, టీవీలూ. 

28 న మళ్లీ నగదు వచ్చినా, బ్యాంకుల్లో 4 వేలు చొప్పునో, 2 వేలు చొప్పునో సరిపెట్టడం మానలేదు! మళ్లీ క్యూలు. 

1వ తేదీకి, అల్లకల్లోలం మొదలయ్యింది. అటు జీతాలూ, ఇటు పించన్లూ, మామూలుగా బ్యాంకుల్లో ఇస్తున్నవి కాకుండా, సామాజిక పించన్లు కూడా బ్యాంకుల్లో వేయించారు! నగదు సరఫరా యేమీ పెరగలేదు.

ఈ సామాజిక పించన్లు అసలు వచ్చాయో లేదో అనీ, వస్తే ఏ బ్యాంకులో జమయ్యాయో అనీ, ఎప్పుడు-ఎంత ఇస్తారు అనీ, వృధ్ధులూ, వికలాంగులూ సైతం ఎండల్లో, ఉదయం నుంచీ సాయంత్రం వరకూ అష్టకష్టాలు పడినా, చాలామందికి నిరాశే ఎదురయ్యింది. 

మళ్లీ బ్యాంకులు "పించన్ దారులకి 6 వేలు మాత్రమే ఇస్తాము" అని బోర్డులు పెట్టారు. అలా చెయ్యకుండా, ఉన్న నగదుని, 24 వేల లోపు, అడిగినవాళ్లకి అడిగినంత ఇచ్చేసి చేతులు దులుపుకుంటే, మళ్లీ చెలామణి లో నగదు పెరిగేది!

(......మరోసారి)

(మిత్రుల ఆదేశం పై నా టపాలు బ్లాగ్ లో కూడా ప్రచురిస్తున్నాను. ఇంతకు ముందు వ్రాసిన 2 భాగాలు ఈ క్రింది లింకు లో చదవచ్చు) 

https://www.facebook.com/groups/1311091748908538/


Monday, September 5, 2016

"వినాయక చవితి"

వినాయక ప్రార్థన

సాధారణంగా ఏ పని అయినా వినాయక ప్రార్థనతో ప్రారంభించడం మన భారతీయుల అలవాటు.

"వినాయక చవితి" చిత్రం లో ఘంటసాలవారు పాడిన ఆ ప్రార్థన, అదే ఒరవడిలో, ఇప్పటికీ అందరూ పాడతారు!

అయితే, ఆయన ఏ ముహూర్తంలో అలా పాడాడో, అలా రికార్డు అయ్యిందో గానీ, "శుక్లాం.....బరధరం....." అని ఉంటుంది....అలాగే పాడతారు అందరూ!

కానీ, అసలు "శుక్లాంబర.....ధరం, విష్ణుం" అని పాడాలి.

అదృష్టవశాత్తూ, "అగజానన పద్మార్కం....." పద్యాన్ని, చక్కగా అర్థయుక్తంగా పాడాడు.....అందరూ అలా కొనసాగిస్తున్నారు.....చాలా సంతోషం!

సంస్కృతం లో తు, చ అనే అక్షరాలు యెంతో ముఖ్యమైనవి. అందుకే తు చ తప్పకుండా ఆచరించాలి అంటారు.

మన బాలసుబ్రహ్మణ్యం మాత్రం, "వక్రతుండ, మహాకాయా, సూర్యకోటి సమప్రభా, నిర్విఘ్నం.....కురుమేదేవా...."! అని పాడేశాడు. నిర్విఘ్నం తరవాత "తు" ఎగిరిపోయింది!

దాంతో, తరువాత, "కురుం ఏ దేవా" అన్నది కలిసిపోయి, కురుమ....అంటే "కుమ్మరి" అనే అర్థం ధ్వనిస్తుంది!

మరి, ఇలాంటి ప్రయోగాలు ఎందుకు చేస్తారో మన గాయకులూ, విద్వాంసులూ, సినిమావాళ్లూ!

Tuesday, August 23, 2016

గో వధలూ.....గొడవలూ.....

గో సంరక్షణ.....

ఈ మధ్య, గోరక్షకులూ....దళితులూ....అంటూ అనవసర సమస్యలు సృష్టించడానికి చాలా గట్టి ప్రయత్నాలు జరుగుతున్నాయి.

కానీ, అడుసుమిల్లి సూర్య ప్రకాశ్ లాంటి వాళ్లు కూడా, "ఉప్పలగుప్తం లో.....గో రక్షకులు...." అంటూ వ్రాస్తుంటే, నవ్వాలో యేడవాలో తెలీడం లేదు!

స్వామీ దయానంద సరస్వతి 1875 ఏప్రిల్ 10 న బొంబాయి లో "ఆర్య సమాజ్" ను స్థాపించారు.

(ఇప్పుడు అనేకమంది దయానందులూ, సరస్వతులూ అనేక చెత్త మఠాలూ అవీ నడుపుతున్నారు. ఆయనెవరో ....ఆనంద సరస్వతి, ఆంధ్ర ప్రదేశ్ ప్రత్యేక హోదా కోసం యాగం చేసి, కిరస్థానీ జగన్ చేత హోమం చేయించి, పూర్ణాహుతి ఇప్పించాడు).

ఆయనే, 1882 లో, "గోరక్ష" ఉద్యమాన్ని చేపట్టారు. అప్పటినుంచీ, మనదేశంలో అన్ని రాష్ట్రాల్లోనూ, గో సంరక్షణ సమితులు కొనసాగుతున్నాయి. వాటికి యే ప్రభుత్వ లేదా మత సంస్థలతోనూ సంబంధం లేదు. ఆ సభ్యులకి ఎవరూ జీతాలూ గట్రా ఇవ్వరు.

ముఖ్యంగా వాటి ఉద్దేశ్యం.....వట్టిపోయిన, ముసలివైపోయిన ఆవులనీ, ఆబోతులనీ కబేళాలకి పంపించకుండా, సంరక్షించడం. జీవ కారుణ్యానికి చక్కని ఉదాహరణ ఇది.

ఇప్పుడు అనేకమంది సాధువులూ వగైరాలు గోశాలలూ, సంరక్షణాలయాలూ నడిపిస్తున్నారు.

అక్రమంగా తరలిస్తున్న అనేక వందల పశువులని పోలీసుల సహాయంతో పట్టుకొని, గోశాలలకి తరలించిన సంఘటనలు గత కొన్ని సంవత్సరాలలో అనేకం జరిగాయి. పత్రికలు వ్రాస్తూనే ఉన్నాయి. మరి ఆ అక్రమార్కులకి యేమైనా శిక్షలు పడ్డాయో లేదో, ఆ పత్రికలు ఇంక పట్టించుకోవు.

అసలు ఉప్పలగుప్తం సంఘటన యేమిటి? గుజరాత్ లోనూ, యూపీ, బీహార్లలోనూ జరిగినవి ఏమిటి? వాటికి మీడియా పూసిన రంగులు యేమిటి?

(.....ఇప్పటికి ఇంతే)

Wednesday, March 30, 2016

"చిన్నారుల" భారతం.....6


                                  .........నడుస్తున్న భాగోతం

"ఆరోజు" కార్యక్రమం తాలూకు విడియోలు బయటపడ్డాయి. "చిన్నారి" కన్నయ్య కుమార్ ని అరెస్టు చేశారు ఇంకొంతమంది తో సహా. దేశద్రోహం కేసు పెట్టారట.

ఆ వీడియోల లో ఆడియో యే మాత్రం వినిపించేలా లేదు. కారణం.....అతను మాట్లాడుతున్నంత సేపూ, ఆడియో రికార్డరు ఎదురుగా డప్పుల మోతలూ, ఇతరుల "ఓ...." అని అరుపులూ.

కొన్ని టీవీ ఛానెళ్ల వాళ్లు "తరువాత" తయారు చేసిన వీడియోలు ప్రసారం చేశారట.....వాటిలో దేశ వ్యతిరేక నినాదాలు కన్నయ్యే చేస్తున్నట్టు.

కోర్టులో ప్రదర్శించిన విడియోలు--నాయిస్ ఫిల్టర్లు ఉపయోగించి, ఆడియో మెరుగు పరచి, వినిపించినవి. (వాటిని కొందరు "డాక్టర్డ్" వీడియోలు అని కొట్టిపారేస్తున్నారు. కానీ, వాళ్లు గుండెలకి హత్తుకున్నవాళ్ల ఫోటోలని మార్చలేరుకదా? సందర్భాన్ని బట్టి, వాళ్లు ఆ ఫోటోల్లో ఉన్నవాళ్లని ఉరితీయాలి అనో, పాకిస్తాన్ తీవ్రవాదులని శిక్షించాలి అనో నినాదాలు చేస్తున్నారు అని అనుకోలేం కదా?)

కోర్టులో హాజరు పరుస్తుంటే, మళ్లీ హై డ్రామాలు...కొంతమంది లాయర్లు చేయి చేసుకున్నారు అనీ, పోలీసులు ఏమీ చెయ్యలేదు అనీ ఆరోపణలు....అవన్నీ టెలికాస్టులూ.....!

కస్టడీలు అయ్యాక, బెయిల్ ఇచ్చారు న్యాయ మూర్తి. వెంటనే, వాడు బయటికి వచ్చి, విజయోత్సవ మీటింగులూ, ర్యాలీలూ. కాంగీ, కమ్మీ మేథావులు "వాక్ స్వాతంత్ర్యం నిలిచింది" లాంటి స్టేట్మెంట్లూ, "దేశద్రోహ ఆరోపణ వాపసు తీసుకునే సూచనలు" అంటూ ఊహాగానాలూ....!

న్యాయమూర్తి యేమి చెప్పారు?

"విశ్వవిద్యాలయాల ప్రాంగణాల్లో, స్వేఛ్ఛాయుత వాతావరణం లో, (కాబట్టి) ఆ వ్యక్తులు అలాంటి నినాదాలు చేయగలుగుతున్నారు. '......ఊపిరిసైతం సరిగ్గా అందని పరిస్తితుల్లో మన వీర జవానులు దేశ సరిహద్దుల్ని అనుక్షణం కాపాడు తున్నందువల్లే' తాము అలాంటి సురక్షిత వాతావరణం లో ఉన్నామని వారు గ్రహించలేకపోతున్నారు. ఆ ఫోటోలూ తగిలించుకొని, నినాదాలు చేసినవాళ్లు, సరిహద్దుల్లో....ఒక్క గంటైనా వుండలేరు. .....ఏది పడితే అది మాట్లాడుతూ, అదే భావ ప్రకటన స్వేఛ్ఛ అనీ, అదేదో తమకు ఉన్న మౌలిక హక్కు అనీ వారు వాదిస్తే కుదరదు. .......ఇన్‌ఫెక్షన్ మరీ ముదిరిపోయి పుండుపడితే, సంబంధిత అంగాన్నే తొలగించాల్సి వస్తుంది. ఆ సమస్యకు అదే చికిత్స."

అని స్పష్టంగా చెప్పారు.

మళ్లీ మామూలుగానే, కుహనా వాదులు--'ఉత్తర్వులు ఇమ్మంటే, ఆవిడ ధర్మోపదేశాలు చెయ్యడం ఏమిటి' --అంటూ, ఆ న్యాయమూర్తిని కించ పరిచేందుకు వెనుకాడలేదు.

అసలు "జాతి వ్యతిరేకత అనేది ఏమీ 'క్రిమినల్ నేరం ' కాదు" అంటాడో న్యాయ కోవిదుడు. అంటే, కొద్ది మంది జాతి వ్యతిరేకులతో కొన్ని కోట్లమంది సహజీవనం చెయ్యవలసిందేనన్నమాట! అంతేకానీ, వాళ్లనేమీ అనకూడదు....వాళ్లని బలపడనివ్వాలి....జాతి యేమైపోయినా, కాంగీ, "కమ్మీలు" ఎలాగైనా అధికారం సంపాదించుకోవాలి!

ఇంకొంతమంది "కమ్మీలు"--వ్యవస్థ కి (తుపాకులూ, బాంబులూ, మందుపాతరలూ వగైరాలతో) శస్త్ర చికిత్స చేస్తాం" అన్నందుకే కదా "మావిస్టులనీ" వాళ్లనీ తీవ్రవాదులు అంటున్నాం? మరి ఆ న్యాయమూర్తి కూడా తీవ్రవాదేనా? అంటూ ఓ వితండవాదం మొదలెట్టారు....!!

(......మరోసారి)

Sunday, March 27, 2016

"చిన్నారుల" భారతం.....5


.........నడుస్తున్న భాగోతం

(2వ భాగం చివర....."ఇంకో "చిన్నారి" ఇంకో సంచలనం సృష్టించకపోతే......!"--తరువాయి).....

రోహిత్ గొడవలో పండగ చేసుకుంటూండగానే, మీడియా వాళ్లకీ, కాంగీ కమ్మీలకీ ఇంకో కొబ్బరికాయ అందించాడు ఇంకో "చిన్నారి".....కన్నయ్య కుమార్--ఢిల్లీ జేఎన్యూ లో 2016 ఫిబ్రవరి 9 న "వామపక్ష డెమొక్రాటిక్ స్టూడెంట్స్ యూనియన్"--డీ ఎస్ యూ--తరఫున అఫ్జల్ గురు ని ఉరితీయడం పై నిరసన ప్రదర్శన నిర్వహించడం ద్వారా!

ఆ రోజు (09-02-2016) న, ఓ పదిమంది డెమోక్రాటిక్ స్టూడెంట్స్ యూనియన్ మాజీ సభ్యులు, ఓ సాంస్కృతిక కార్యక్రమం నిర్వహించుకుంటాం అని యూనివర్సిటీ అధికారులని అనుమతి అడిగి, కేంపస్ అంతటా పోస్టర్లు అంటించారట......ఇక్కడ ఒక కళా/ఛాయాచిత్ర ప్రదర్శన నిర్వహించబడుతుంది....'కాశ్మీర్ ఆక్రమణ చరిత్ర ' పై, ఇంకా దానికి వ్యతిరేకంగా 'అక్కడి ప్రజల పోరాటం గురించీ'.....అని, అఫ్జల్ గురు; మక్బూల్ భట్ మొదలైనవాళ్ల ఫోటోలతో!

నిజంగా వాళ్లు ఉద్దేశించింది.....మూడేళ్ల క్రితం అదే తారీఖున ఉరితీయబడ్డ అఫ్జల్ గురు స్మారక సభ జరపాలని! ఆ సందర్భాన్ని, అఫ్జల్ గురు, మక్బూల్ భట్ ల "న్యాయపూర్వక హత్య" లని నిరసించడం, కాశ్మీరీ ప్రజల స్వయం నిర్ణయాధికారం అనే ప్రజాస్వామిక హక్కు కోసం వాళ్లు చేస్తున్న పోరాటానికి సంఘీభావం ప్రకటించడం.....అని వాళ్లే చెప్పుకున్నారని, ఆ సంఘటనలతో సంబంధంలేని విద్యార్థులు చెపుతున్నారు. 

దాంతో, ఏబీవీపీ వాళ్లు ఫిర్యాదు చేయగా, యూనివర్సిటీ అధికారులు అనుమతి ఉపసం హరించారట. 

అయినా, ఆ సంస్మరణ సభ జరగనే జరిగింది. 

అక్కడ చేరిన కొంతమంది కాశ్మీరీ విద్యార్థులు, "ఈ కాశ్మీర్ మాది....పూర్తిగా మాదే", "ప్రతీ ఇంటి నుంచీ ఓ అఫ్జల్ గురు పుడతాడు", "భారత్ నాశనం అయ్యేవరకూ యుధ్ధం జరుగుతుంది....యుధ్ధం జరుగుతుంది" లాంటి నినాదాలు ఇచ్చారు. 

మీటింగ్ నిర్వాహకులు...."మనకేం కావాలి? .....స్వాతంత్ర్యం", "తీసుకు తీరుతాం ....స్వాతంత్ర్యం" లాంటి నినాదాలు ఇచ్చారు. (వీళ్లలో "చిన్నారి" కన్నయ్య కుమార్ ముఖ్యుడు). కానీ.....కన్నయ్య కాశ్మీరు విద్యార్థులు ఇచ్చిన నినాదాలు ఇవ్వలేదుట!

ఇంకో ముఖ్య విషయం ఏమిటంటే, ఆ కాశ్మీర్ విద్యార్థులు అసలు జే ఎన్ యూ విద్యార్థులే కాదట. 

ఈ విషయాలన్నీ చెపుతున్నవాళ్లు.....ఆ సంఘటనలతో సంబంధం లేని విద్యార్థులే!

(......మరో సారి)

Friday, March 18, 2016

"చిన్నారుల" భారతం.....4


.........నడుస్తున్న భాగోతం

అసలు రోహిత్ ఆత్మహత్య లేఖలో....."నా పుట్టుకే ఓ ప్రమాదం" వంటి మాటలలో, నిరాశా వాదం, పలాయన వాదం ప్రస్ఫుటంగా కనిపిస్తుంటే, చాలామందికి, ఓ "చిన్నారి" లోని "భావుకత్వం" కనిపించిందట! అదేమిటోమరి.....

తను వ్రాసి కొట్టేసేడని చెప్పబడుతున్న మాటలు చూడండి.....

“The Ambedkar Students Association, the Students Federation of India, anything and everything exist for their own sake. Seldom the interest of a person and an organisation matches. To get power, to become famous or to be important in between boundaries and to think we are up to changing the system, very often we overestimate the acts and find solace in traits. Of course I must give credit to both these groups for making, introducing me to wonderful literature and people.”
ఒకే అడ్డగీతతో తొలగించబడింది ఈ క్రింది అసంపూర్తి వాక్యం :

"There are some bad waters in us bels."

తనేదో దస్తావేజుల లేఖరి లా, యేదో లీగల్ డాక్యుమెంట్ వ్రాస్తున్నట్టు.....5 వ వరుస లో రెండు హంసపాదులు; 11 నుంచి 15 వ వరుస వరకూ తుడుపులు; 22 వ వరుస కొట్టివేత.....ఇలా పేజీ చివర వ్రాసి, లేఖరి సంతకం చేసినట్టు.....వ్రాశాడంటారా? మరైతే, ఆ లైన్లు అక్షరాలు కనపడకుండా వుండేలా తుడుపులు పెట్టడం యెందుకు? చివర్లో ఓ లైన్, అడ్డగీత తో మాత్రమే కొట్టెయ్యడం యెందుకు? ఆ "లీగల్ బ్రెయిన్" అక్కడ పని చేయ లేదా?

ఆ లేఖని ఫోరెన్సిక్ పరిశోధనకి పంపించారన్నారు.....యెవరు కొట్టేశారో పరిశీలించమని. మరి ఫలితం యేమిటో ప్రకటితం కాలేదు!

"చిన్నారి" రాహుల్ మాత్రం ఓ అర్థరాత్రి తో సహా, రెండు మూడుసార్లు వచ్చి--'న్యాయం జరిగేదాకా పోరాడుదాం; మీకు అండగా నేనుంటాను'--వగైరా హామీలు ఇవ్వడం, సీతారాం యేచూరి లాంటి కమ్మీలు తందాన తాన అనడం చూస్తే, శ్రీ శ్రీ వ్రాసిన--ఘూకం కేకా, భేకం బాకా--గుర్తు రావడం లేదూ?

ఇవన్నీ.....వేరో చిన్నారి వాళ్లకి ఇంకో అవకాశం కల్పించడంతో ప్రక్కన పెట్టేశారు!

ఇంకా చిత్రం యేమిటి అంటే, "చాతుర్ వర్ణ్యం మయా సృష్టం" అని శ్రీ కృష్ణుడు చెప్పింది "కులాల" గురించి కాదు.....ఆ "వర్ణాలు" వేరు.....లాంటి నీతులు చెప్పే మేథావులు సైతం, అక్కడ "కులవివక్ష" వల్లే ఓ "చిన్నారి" హత్య జరిగిపోయింది.....అంటూ మొసలి కన్నీళ్లు కార్చి, దానికి బాధ్యులు.......కాషాయ సేన, వాళ్ల ప్రభుత్వం అని నిర్ధారించేయడం!

(....మరో సారి)

Thursday, March 17, 2016

"చిన్నారుల" భారతం.....3


.........నడుస్తున్న భాగోతం

అసలు రోహిత్ వ్యవహారం మొదలయ్యింది 2015 ఆగస్ట్ 3 న......తను, ఇంకో నలుగురు ఆంబేద్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్ సభ్యులూ కలిసి, "యాకూబ్ మెమొన్" కి ఉరిశిక్ష విధించడంపై, ఇంకా "ముజఫర్ నగర్ బాకీ హై" అనే డాక్యుమెంటరీ ప్రదర్శిస్తుంటే, ఏబీవీపీ వాళ్లు దాడి చేసినందుకూ! (ఆ ఐదుగురికీ కేంపస్ హీరోలు అయిపోవాలని కోరిక యెందుకు పుట్టిందో ఎవరైనా చెప్పగలరా?)

తరువాత సుశీల్ కుమర్--వాళ్లని ఫేస్ బుక్ లో "గూన్‌స్" అన్నాడని అతని మీద దాడి చేశారు రోహిత్ గాంగ్.

ఏబీవీపీ వాళ్లు ఇచ్చిన ఫిర్యాదు పై దర్యాప్తు చేసి, వైస్ ఛాన్సెలర్ రోహిత్ నీ, నలుగురు ఇతరులనీ సస్పెండ్ చేసి, హాస్టలు ఖాళీ చెయ్యమన్నారు. తరువాత కూడా అనేక విధాల చర్చలూ, దర్యాప్తులూ జరిగాక, జనవరి 2016 లో మళ్లీ శిక్ష నిర్ధారించినందుకు.....ఆత్మహత్య చేసుకున్నాడు అని ఆరోపణ.....మీడియా వాళ్లదీ, కాంగీ కమ్మీలదీ.

అసలు విషయాలని ప్రక్కదారి పట్టిస్తూ, కొంతమంది మీడియావాళ్లూ, రాజకీయులూ.....వాడసలు దళితుడేకాదు అనీ, వడ్డెర కులస్తుడు అనీ, అయినా తల్లిదండ్రుల్లో యెవరి కులం కావాలో నిర్ధారించుకునే హక్కు వాడికే వుంది అనీ......అసలు ఏబీవీపీ వాళ్లు చేసిన "యూనివర్సిటీ లో రాజకీయ, కుల సంబంధ, జాతి వ్యతిరేక ఉద్యమాలు నడుస్తున్నాయి" అనే ఫిర్యాదు పై దత్తాత్రేయ చర్యతీసుకోమని మంత్రిత్వ శాఖ కి రాసినందుకూ, ఆ మంత్రి యూనివర్సిటీ వాళ్లకి తగిన చర్య తీసుకోమని రాసినందుకూ (ఆ లేఖల్లో రోహిత్ పేరూ, ఏ ఎస్ ఏ పేరూ ఎక్కడా లేకపోయినా) మాత్రమే ఆత్మహత్య జరిగింది అనీ, అది అగ్రకులాలు చేసిన హత్య అనీ.....ఇలా ఆకాశంలో దీపావళి చేసుకున్నారు!

అసలు రోహిత్ ఆత్మహత్య లేఖలో..... 

(....మరో సారి)

Thursday, March 10, 2016

"చిన్నారుల" భారతం.....2



.........నడుస్తున్న భాగోతం

తరవాత, ఇంకొన్నాళ్లకి, హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీ లో, ఓ "చిన్నారి".....ఆత్మహత్య చేసుకున్నాడు.....తన ఆత్మహత్యకి యెవరూ కారణం కాదు అని చీటీ వ్రాసి పెట్టి!

ఇంకేముందీ.....ప్రపంచంలోనే "చిన్నారి" రాజకీయ నాయకుడు రాహుల్ గాంధీ అక్కడ వాలి పోయాడు....అక్కడ అసహనం పెరిగిపోయింది, దళిత చిన్నారిని హత్య చేశారు, విద్యార్థులకి న్యాయం జరగాలి, అప్పటిదాకా విశ్రమించం అంటూ!

వాడి వెనకాలే, కమ్యూనిస్టు "చిన్నారి" తొత్తులందరూ క్యూ కట్టేశారు. అపర మేథావులందరూ పేపర్లకీ, రోడ్లకీ యెక్కేశారు. 

తరవాత వాడి వీడియోలూ వగైరా బయటికి వచ్చాయి. వాడి కులం ప్రసక్తి వచ్చింది. ఇంకా అనేకం వచ్చాయి. 

నిజాలు సమాధి అయిపోయి, మసిపూసిన మారేడు కాయ మీడియాలో ప్రత్యక్షం అయ్యింది.

అసలు ఆ "చిన్నారి".....రోజూ బాగా తాగేసి, ఇతర విద్యార్థులతో గొడవపడేవాడు. ముఖ్యంగా ఏబీవీపీ వాళ్లతో. వాళ్ల బేనర్లు చింపేసేవాడు. వాళ్లు అడిగితే, నేను దళితుణ్ణి కాబట్టి నన్ను అడుగుతున్నారు అని  దెబ్బలాడేవాడు. ఏబీవీపీ లో కూడా దళితులున్నారు. 

వాళ్లు మేమూ దళితులమే, మీ అంబేద్కర్ యూనియన్ బ్యానర్లు మేము చింపేశామా? అని అడిగితే, నాకు మీ బేనర్లు కనపడ్డాయి చింపేశాను. మా బేనర్లు మీకు కనపడలేదేమో.....! అని డబాయించేవాడు.

కేంపస్ లో వాళ్ల యూనియన్ తరఫున "ఉరిశిక్ష" కి వ్యతిరేకంగా సభ చేసుకుంటాము అని అనుమతి తీసుకుని, సభలో అఫ్జల్ గురు ని ఉరితీయడం అన్యయం. ఇది మనువదం. దీనికి వ్యతిరేకం. అఫ్జల్ గురు జిందాబాద్. వాడి హంతకులు నశించాలి అంటూ నినదాలు ఇచ్చాడు.

ఈ విషయాలు రిపోర్టు చేసినందుకూ, వాళ్లమీద చర్య తీసుకోమన్నందుకూ కక్షగట్టి,ఓ పాతిక ముఫై మంది వెళ్లి ఏబీవీపీ నాయకుణ్ని చితక బాదేశారు. వాడు సెక్యూరిటీ గార్డుల అడ్డా దగ్గరకి వెళ్తే, వాళ్లని కూడా కొట్టారు.

తరవాత ఏమయిందో, విచక్షణ నశించి, "నన్ను రాజకీయ నాయకులు వాడుకోడానికి చూస్తున్నారు. అదినాకు ఇష్టం లేదు" అని వ్రాసి మరీ ఆత్మహత్య చేసుకున్నాడు.

తరువాత ఆ రాజకీయ నాయకులే ఆ చిన్నారికి న్యాయం జరగాలి అనీ, ఓ 5 కోట్లో యెంతో పరిహారం ఇవ్వాలి అనీ ఆందోళనలు సాగించారు. 

ఇంకెన్నాళ్లు సాగించేవారో.....ఇంకో చిన్నారి ఇంకో సంచలనం సృష్టించకపోతే......!

(.......మళ్లీ ఇంకోసారి)

Monday, March 7, 2016

"చిన్నారుల" భారతం.....1



........నడుస్తున్న భాగోతం

మొన్నామధ్యన ఓ పదహారేళ్ల "చిన్నారి", ఇంకొంతమంది పెద్ద చిన్నారులతో కలిసి, ఓ చిన్నారి "అమ్మాయిని" బస్సులో రేప్ చేసి, చంపేశాడు. దాన్నే "నిర్భయ" కేసు అన్నారు.

ఆ "చిన్నారి"ని, చట్టం ప్రకారం శిక్ష పొడిగించలేము అంటూ కోర్టు విడుదల చేసేసింది.

ప్రభుత్వమేమో, వాడికి ఓ షాపూ, కుట్టు మిషనూ, కొంత డబ్బూ ఇచ్చి, జీవన సౌలభ్యం కల్పించిందట. ("లేడీస్ స్పెషల్ టైలర్" అని బోర్డు పెట్టాడేమో నాకు తెలీదు!)

ఆ చిన్నారిని ఇనుప రాడ్ తో పేగులు బయటికి వచ్చేలా గాయపరిచిందీ, బస్సులోంచి తోసెయ్యమని సలహా ఇచ్చి తోయించేసినదీ--ఈ "చిన్నారే"(ట).

విడుదలయ్యాక వాడేమన్నాడు?

"మాకు కొంచెం సహకరించి వుంటే, మేము అలా చేసి వుండేవాళ్లం కాదు కదా? అది ఆమె తప్పు" అని!

అదీ ఆ చిన్నారి కథ.

(ఇంకొందరు చిన్నారుల కథలు.....వరుసగా.....త్వరలో....)

Tuesday, February 9, 2016

సమయస్ఫూర్తి కి బహుమతి

"స్ఫూర్తిమంతులు....!"

మొన్న తగులబెట్టబడిన "రత్నాచల్" ఎక్స్ ప్రెస్ డ్రైవర్, అసిస్టెంట్ డ్రైవర్ లకి, "అవార్డు" ఇచ్చారట.....రైల్వే వాళ్లు! "సమయస్పూర్తి తో" ఫోను చేసి మరీ కరెంటు సప్లై ఆపి, ఇంజను మీదకెక్కిన వాళ్ల ప్రాణాలు కాపాడినందుకు. (నా బొందలో సమయస్ఫూర్తి.....నేనైతే, వాళ్ల వుద్యోగాలు పీకేసి వుండేవాడిని--కొన్ని కోట్ల క్రొత్త ఇంజనూ, ఒక్కోటీ కొన్ని లక్షల ఖరీదు చేసే 23 బోగీలూ తగులబెట్టడానికి దోహదం చేసినందుకు).

100 కీలోమీటర్ల వేగంతో వస్తూ.....ఓ కిలోమీటరు దూరం నుంచి జనాలని చూసి, సడెన్ బ్రేక్ వేస్తూ, జనాలకి కేవలం "5 మీటర్ల" దూరం లో రైలు ఆపగలిగినందుకు......యెగబడి వాణ్ని చితక్కొట్టేశారు....! (నేనైతే, వాడిని వెంటనే కంటిచూపు పరీక్షకి పంపించేవాణ్ని! రైల్వేలో అదో ఘోరమైన శిక్ష.....ఆ వంకతో డిస్ మిస్ చేసేస్తారు(ట)......ఆ తరువాత.....రిపోర్టులో కంటిచూపు 100% ఖచ్చితంగాలేదు అని వస్తుంది కాబట్టి!).

ఆ డ్రైవర్ ని నేనే అయితే, స్పీడుని తగ్గించుకుంటూ......"నా రైలు" కి ప్రమాదం జరగని స్టేజి వరకూ చూసుకుని, అదే స్పీడులో ముందుకి నడిపించేసేవాడిని.......తరువాత స్టేషన్ వరకూ......యెవరు బ్రతికారో, చచ్చారో లెఖ్ఖ చెయ్యకుండా!

యేమో.....తరువాత అన్ని కోట్ల రైలుని కాపాడినందుకు నాకు ఎవార్డ్ ఇచ్చేవారేమో......!

మహా అయితే, "నిర్లక్ష్యంగా" నడిపి, కొన్ని పదుల మంది ప్రాణాలు తీశానని, పనిష్మెంటు ఇచ్చేవారేమో! (తరువాత ఇంకెవడైనా 'రైల్ రోకో' అంటే చాలు, ఆమడదూరం పరిగెత్తేవారు!)

పాపం....."క్లియరెన్స్" ఉందికదా అని బండి నడిపి, ట్రాక్ పై పని చేస్తున్న గాంగ్ మెన్ లనీ, కూలీలనీ పొరపాటున రైలు గుద్దేస్తే, బాధ్యులందరితో పాటు డ్రైవర్ లకి కూడా పనిష్మెంట్ ఇవ్వడం లేదూ......అనేక కేసుల్లో? అలాంటి పనిష్మెంట్ నాకొచ్చినా సంతోషంగా స్వీకరించేవాడిని......భవిష్యత్తులో యెవరూ రైలుకి అడ్డంగా రాకుండా వుండేలా చేసినందుకు!

ఇప్పటికైనా, రైల్వే అధికారులు......ఇలాంటి సంఘటనల్లో....."రైలు ఆపడానికి ప్రయత్నించద్దు"......అని డ్రైవర్లకి ఆదేశాలివ్వాలి. రైల్వేల, "మన" ఆస్థుల్ని కాపాడాలి!

(నిజానికి......"అంబులెన్స్" గానీ, "ఫైర్ ట్రక్" గానీ యెవరినైనా గుద్దేసినా, కేసు లేదంటారు.....యెంతవరకూ నిజమో నాకు తెలీదు. ఇది అలాంటి వాటిని మించిన......కొన్ని వేలమంది......పెద్దా, చిన్నా, ముసలీ, ముతకా, వికలాంగ, రోగగ్రస్త వగైరా ప్రజల ప్రాణాలకీ, కొన్ని కోట్ల విలువైన "మన" ఆస్థులకీ సంబంధించిన వ్యవహారం! అందుకే ఇందులో యేమీ తప్పు లేదు!)

యేమంటారు.....?

(ఇది నేను ఆ "అవార్డు" గురించి వార్త చదివిన రోజున వ్రాసిన టపా. అందరూ 'వేడిలో' వుండగా ప్రచురించడం యెందుకులే అని ఆపాను. ఇప్పుడు ప్రచురించాను. నిర్మొగమాటం గా మీ అభిప్రాయాలని వ్రాయండి).