haaram logo

Tuesday, December 27, 2011

యాత్రానుభవాలూ.........


........క్షేత్రానుభవాలూ

తిరిగే కాలూ, తిట్టే నోరూ ఊరికే వుండవుట.
ఈ మధ్య ఓ పెద్దాయన, అమెరికాలో పిల్లలదగ్గర సెటిల్ అవుదామని వెళ్లినవాడు, తూర్పుకి తిరిగి ఓ దణ్ణం పెట్టేసి, ఇండియా వచ్చేసి, తన పెరట్లో మొక్కలు పెంచుకోడం అనే హాబీ తీర్చుకోడం మొదలెట్టాడు.
ఆయన చెప్పిన కారణం అదే! అమెరికాలో ఆ రెండూ బంద్ అయిపోతే, యెంత సేపు గదిలో బందీగా పడివుండగలం? అని.
అలా, మేముకూడా వూళ్లు తిరగడం కొనసాగిస్తున్నాము. ఇప్పుడు చెన్నైలో!
మహామల్లపురం అనే మామల్లపురం అనబడిన మహాబలిపురం వగైరాలూ, అరవిందుడి సమాధీ, వాటిని వెనక్కి తోసి వృధ్ధి చెందిన గణేశాలయం, బీచీ వగైరాలు చూసి, యేలగిరి వెళ్లి, బోటింగూ వగైరాలు చేసి, మురుగన్ నీ, పెరుమాళ్ నీ చూసి, అక్కడ రాత్రి బసచేసి, ప్రొద్దున స్వామిమలై వెళదామని, అంతదూరం నడిచి కొండ యెక్కలేక వెనుదిరిగి, జలపాతాలు చూసి, కొంచెం తడిసి, చెన్నై తిరుగు ప్రయాణంలో, పనిలోపని అని శ్రీపురంలో ఓ బంగారు గుడి వుందని అది చూసేద్దామని వెళ్లాము.
ఆ గుడి గురించి జనాలు చెప్పుకొంటున్నది వింతగా అనిపించింది. ఒకాయన తన వ్యాపారాల్లో భాగంగా అనేక అక్రమాలు, హత్యలు చేయడం చేయించడంతో సహా చేసి, బాగా డబ్బుచేశాక, ఓ గురువుగారి ఉపదేశం పొంది, సంపాదించిన డబ్బంతా వినియోగించి పూర్తిగా (కొన్ని క్వింటాళ్ల) బంగారంతో ఓ అమ్మవారి గుడి కట్టించాడట. ఇప్పుడది తిరుపతీ, శబరిమల లెవెల్లో, మరికాస్త సంపాదించి పెడుతోందట ఆయనకి! ఆయన్ని "శ్రీ శక్తి అమ్మ" (మగ దేవత) అంటున్నారు!
మామూలుగా, క్యూలైన్ లో వెళితే, దర్శనం 3 గంటలు పడుతుందని బోర్డు పెట్టారు. ఒక్కోప్పుడు ఇంకా చాలా తక్కువ సమయం పట్టిన దాఖలాలున్నాయట.
అదేమిటో, మేము వెళ్లినరోజు మాత్రం, బస్సులకొద్దీ జనం—ముఖ్యంగా ఆడవాళ్లు—యెర్రరంగు చీరలు పసుపురంగు పూలతో వున్నవీ, పసుపురంగు అంచుమీద వేపాకుల మండలు డిజైన్ గా కలవీ ధరించి, మగాళ్లు యెర్ర పంచే/పేంటూ, యెర్ర చొక్కాలూ ధరించీ క్యూలూ, కంపార్ట్ మెంటులూ నిండిపోయారు…..ఇంకా వస్తూనే వున్నారు!
మేము ఓ కంపార్ట్ మెంట్ దాకా ప్రవేశించి అప్పటికే ఓ రెండు గంటలు కాగా, ఇంకో నాలుగైదు గంటలు పట్టచ్చు అంటే, వోపికలు నశించి, సెక్యూరిటీ వాడినడిగి, బయటికి వచ్చేశాము.
బయట రోడ్డు మీదనుంచి మూసేసిన ద్వారంలోంచి కనిపిస్తున్న ఆ బంగారు గుడిని చూసేసి, చక్కావచ్చాము.
ఈ సందర్భంలో, నాకు కొన్ని అవిడియాలు మెరిశాయి. అవి మీతో పంచుకోవాలని……ఇలా.
మొన్న త్రిదండి శ్రీమన్నారాయణ చిన జీయర్ స్వామి అననే అన్నాడు—తిరుమలకి వెళ్లేవాళ్లు ఓ క్లబ్బుకి వెళ్లినట్టు వెళుతున్నారు. అందుకే అక్కడ భక్తి భావం లోపిస్తోంది—అని.
అసలు కిటుకు అక్కడే వుంది.
ఈ మధ్య, స్వామి అయ్యప్ప పుణ్యమా అని, భక్తి మాటెలా వున్నా, ప్రతీ దేవుడికీ, దేవతకీ, కుల మత ప్రసక్తి లేకుండా, విచక్షణ లేకుండా, “దీక్షలు” పట్టడం, దీక్ష విరమణకి ఫలానా కొండకో, పుణ్యక్షేత్రానికో వెళ్లడం బాగా యెక్కువైపోయింది.
అందుకని, ఇలాంటి దీక్షలు పట్టేవాళ్లకి నామినల్ గా ఓ 100 రూపాయల టిక్కెట్టు పెట్టేస్తే సరి.
వృధ్ధులూ, వికలాంగులూ వగైరాలు, మళ్లీ రాగలమో లేదో, వచ్చినా యెప్పటికి మళ్లీ వస్తామో అనుకుంటూ వస్తారు. కాబట్టి, వారికి “ఫ్రీ” దర్శనాలకి వేరే క్యూ పెట్టాలి.
క్రొత్తగా పెళ్లయినవాళ్లూ, మ్రొక్కులు తీర్చుకోడానికి వచ్చేవాళ్లూ అనేక ఆశలతో వస్తారు కాబట్టి, వాళ్లకి నామినల్ గా ఓ రూ. 200 టిక్కెట్టు పెట్టొచ్చు.
ఇంక, పర్యాటకం కోసం వచ్చి, పనిలో పనిగా దేవుణ్నో, దేవతనో చూసేద్దామనుకొనేవాళ్లకి నామినల్ గా ఓ రూ.500 టిక్కెట్టు పెట్టొచ్చు.
ఆలాగే, దర్శనం ముఖ్యం కాకపోయినా, ఫలానా గుడినీ, ప్రాంతాన్నీ చూసి వచ్చాము అని చెప్పుకోవాలనుకొనే వాళ్లక్కూడా అదే టిక్కెట్టు పెట్టొచ్చు.
ఇంక, రానాలకీ, వీఐపీలకీ, వీవీఐపీలకీ, వాళ్ల హోదాలని బట్టి, ఒక లక్షనుంచి, పది లక్షల వరకూ టిక్కెట్లు పెట్టి, వాళ్ల తైనాతీలకి కూడా ఓ పది నుంచి ఇరవైమందికి ప్రత్యేక దర్శనాలు ప్రవేశపెట్టొచ్చు.
ఇంకా, గర్భగుళ్లో తోచినంతసేపు ధ్యానం చేసుకొంటామనే కాంట్రాక్టర్లూ, లిక్కర్ మహరాజులూ వగైరాలకి ఓ కోటి రూపాయలు నించి పది కోట్లవరకూ టిక్కెట్టు పెట్టొచ్చు.
మొదటి ప్రింటు సమర్పించే సినీ నిర్మాతలకీ, సినిమా హిట్ అవ్వాలనో, హిట్ అయ్యిందనో, దర్శనాలకి వచ్చే సినిమా వాళ్లకి మధ్యేమార్గంగా, ఓ 50 వేలో యెంతో టిక్కెట్టు పెట్టొచ్చు.
ఇలా చేస్తే, యే గుళ్లోనూ, యే క్షేత్రంలోనూ కూడా తొడతొక్కిడి లేకుండా, అందరూ కొన్ని నిమిషాల్లోనే దర్శనాలూ, పూజలూ చేయించేసుకోవచ్చు.
(నేను చెప్పిన రేట్లన్నీ కోటీశ్వర దేవుళ్లూ దేవతల ఆలయాలకి మాత్రమే. చిన్న చిన్న ఆలయాలకి అనుపాతంగా తగ్గించుకోవచ్చు. ఇంకా ఇలాంటి “దర్శనాల” అవిడియాలు యెవరికైనా వస్తే వ్రాయండి).
బుఱ్ఱపెట్టి ఆలోచించేవాళ్లెవరైనా అవి అమలు చేస్తారేమో చూద్దాము.

Saturday, November 12, 2011

"పం పంగ నామాలు"



ఆరొకట్లు

11.11.11--మళ్లీ  వందేళ్ల వరకూ రాదట. అదియొక వింత!

మొన్నోరోజున, ప్రపంచంలో 700 కోట్లవ శిశువు జన్మించిందన్నారు మన దేశంలోనే! అది నిజంగా ప్రపంచమంతా తెలుసుకోవలసిన అద్భుతమైన వింత.

మరి ఈ ఆరొకట్ల మాటో? 

మామూలుగా మూడొకట్లని "పంగనామాలు"గా వ్యవహరిస్తారు. మోసపోయినవాడిని "ఇంకేముంది! నీకు మిగిలింది......" అంటూ చేతి బొటన, చిటికెన వ్రేళ్లు మడిచి, నుదుటిమీద పైజుంచి క్రిందకి గీస్తున్నట్టుగా అభినయిస్తారు! 

ఆరొకట్లు కాబట్టి, రెండు పంగనామాలు. ఆ మాటలు కలిస్తే "ఆమ్రేడిత సంధి" అవుతుందోలేదో నాకు తెలీదు. కానీ, మా మేష్టారు--కవిశేఖర, కవిభూషణ, కవితావతంస శిష్ట్లా వెంకట సుబ్బయ్యగారు, "అందరూ మిట్ట మధ్యాహ్నం అంటారు. అది తప్పు. మధ్య+మధ్యాహ్నము=మట్ట మధ్యాహ్నము అవుతుంది"--అని చెప్పేవారు. 

అదే సూత్రాన్ని వుపయోగించి, "పం పంగ నామాలు" 'కాయిన్' చేశానన్నమాట! (ఇంగ్లీషులో క్రొత్త పదాలని, ప్రయోగాలని కనిపెడితే, దాన్ని కాయిన్ చెయ్యడం అంటారు. తెలుగులో అలాంటి మాట గుర్తుకురాక ఇలాగే వ్రాసేశాను.)

ఈ వేవె యెక్కడివరకూ వెళ్ళిందంటే, పేపర్లనిండా అవే వార్తలు--ఆరోజున 11గంటల 11 నిమిషాలకి, ఇంకా 11సెకన్లకి 'పుట్టిన శిశువులు' అంటూ ఫోటోలూ, వార్తలూ. 

కొంతమంది ఆ అంకెలు వ్రాసిన అట్టనో, కాయితాన్నో నిలువుగా వుంచి చూస్తే, "శివనామాలు" కనిపిస్తాయంటున్నారు. 

మా జిల్లా కలెక్టరైతే, అదేదో ట్రస్టుని ఆ రోజు, 11.11.11 (గం. ని. సె) కే "రిజిస్టరు" చేయించారట! (ఇలాంటి వాటిగురించి మరోసారి వ్రాస్తాను.) 

ఇంకా వింతేమిటంటే, స్కూలు పిల్లలు, వీపుమీద ఆరు అంకెలూ కనిపించేలా, ఆరు జడలు అల్లుకొని స్కూళ్లకి వెళ్లడం! (మధ్యలో చుక్కలకి కుర్తాలమీద ఆ రెండేసి జడల మధ్యలో యే నల్లింకుతోనూ చుక్కలు పెట్టుకోలేదు!)

ఇప్పటికి ఈ వేవె లు పరాకాష్టకి చేరాయంటారా? ఒక వేళ చేరితే, "పెరుగుట విరుగుటకొరకే" అనే సూత్రమ్మీద తగ్గుతాయంటారా? 

యేమో.......మన ఆహార, తదితర ద్రవ్యోల్బణాలమీద కూడా అలాంటి పిచ్చి ఆశతోనే బ్రతుకుతున్నాం ఇప్పుడు.

చూద్దాం. 

Friday, October 7, 2011

నాయకులూ.......



......పేదరికం

"గాంధీ" అనే మాట చెవిని పడగానే, "ఓ! ఆ అర్థనగ్న ఫకీరోడా!" అంటూ, తన చుట్టకాల్చిన శ్లేష్మంసహిత దగ్గుతో...."హె హె హ్హె!" అన్నాడట ఓ మ్లేఛ్ఛుడు. (మ్లేఛ్ఛుడు అంటే అర్థం యేమిటో......బ్రౌణ్యం నో, పాణినీయం నో, సూర్యారాయాంధ్రం నో శరణుకోరండి) 

"వాణ్ణి ఫకీరుగా వుంచడానికి రోజుకి ఓ 30 రూపాయలుపైగా ఖర్చు అవుతున్నాయి మాకు" అని వాపోయిందొకావిడ..... ఆవిడే--నైటింగేల్ ఆఫ్ ఇండియా--సరోజినీనాయుడు! 

(సరోజిని మాతృభాష తెలుగు. ఆవిడ ఆంగ్లంలో కవితలు కూడా వ్రాసింది. ఆంగ్లంలో 'హీ, షీ, ఇట్, దే' లకి తెలుగులో అతడు లేక వాడు, ఆమె లేక అది, అది, వారు అనే అనువదించింది. కొంతమంది అన్నోన్ వెధవలు--అన్నోన్లందరూ వెధవలు కారు, వెధవలందరూ అన్నోన్లు కారు--ఈ సూక్ష్మాలు తెలుసుకుంటే యెంతబాగుండునో!)   

యెందుకంటే, ఆయనకి యెక్కడో దూ....రం నుంచి, మేకపాలూ, బాదం పప్పులూ, వేరుశెనగపప్పులూ వగైరాలూ, కిరసనాయిలూ (ఆయన రాత్రిపూట దోమలు తనని కుట్టకుండా వొళ్లంతా కిరసనాయిలు పూసుకొనేవాడట!) తేవలసి వస్తూంది! అందట ఆవిడ. 

(ఆ యుధ్ధం రోజుల్లో, మొట్టమొదట రేషన్ విధించింది 'కిరసనాయిలుకే'నట. తరవాతే తిండిగింజలూ వగైరాలు!) 

ఆ రోజుల్లో (ఓ 70 యేళ్ల క్రితం) మహాత్ముడికి రోజుకి 30 రూపాయల ఖర్చంటే, ఈరోజుల్లో ఓ మూడువేలన్నమాట. మరి మన ప్రణాళికా సంఘంవాళ్లు ఈరోజుల్లో "తలా" ఒకరికీ 32 రూపాయిలో యెంతో అంటే, అప్పటికి దారిద్ర్యరేఖ క్రిందనున్న మహాత్ముడి తో సమానంగా మీరు వున్నారు అని చెప్పడమే కదా? 

మరి చెట్టుపేరుచెప్పుకొని కాయలమ్ముకుంటున్న కాంగీలు యేమి సాధించినట్టు? 

సరే! "ఆవిడకి 6 కోట్ల కారా?" అని యెద్దేవా చేశాడట--రాష్ట్రపతినుద్దేశించి--ఫిరోజ్ వరుణ్ గాంధీ. (వాడికీ జడ్ కేటగరీ భద్రతా అవీ వున్నాయనుకుంటా! తనకి ఓ 60 లక్షలో యెంతో పెట్టి, ఓ బులెట్ ప్రూఫ్ కారు కొనివ్వలేదని వాడి బాధేమో!)

వందకోట్లో ఇంకా యెక్కువో వున్న భారతీయులందరికీ రాజ్యాంగబధ్ధ నాయకురాలు కి ఆ మాత్రం భద్రత అవసరం లేదా?

అమెరికా ప్రెసిడెంట్ భద్రతకి కొన్ని బిలియన్ డాలర్లతో ప్రత్యేక బడ్జెట్ కేటాయిస్తారు. "ఎయిర్ ఫోర్స్-1" మెయింటెనెన్స్ కీ, సిబ్బందికీ, దాని ప్రత్యేక రక్షకదళానికీ, 24 గంటలూ దాన్ని సంసిధ్ధంగా వుంచడానికీ, ఒకవేళ దాన్ని వాడడంలో యేదైనా ఇబ్బంది యెదురైతే వాడడానికి మళ్లీ ఇంకో "ఎయిర్ ఫోర్స్-1" ని "స్టాండ్ బై" గా అదే సంసిధ్ధతతో వుంచడానికీ--అన్ని బిలియన్ డాలర్లు ఖర్చు చేస్తున్నారు అని తెలుసా?

మనకంత సీనులేకపోవచ్చుగానీ, మరీ కారుకూడా వద్దంటే యెలాగ?

నా బ్లాగు లోకం


సింహావలోకనం

ఇదే శీర్షికతో నా "ఓ ప్రపంచపౌరుడు" బ్లాగ్ ప్రారంభించాను కొన్నేళ్ల క్రితం.

తరవాత మరికొన్ని బ్లాగులు నిర్వహిస్తూ, ఈనాటికి, నాకూ బ్లాగ్ లోకంలో ఓ "సముచిత" స్థానం వుంది అని గర్వంగా చెప్పుకోగలుగుతున్నాను.

ఈ సందర్భంలో, చాలామంది మెచ్చినవీ, చాలామందికి నచ్చనివీ అనే ఓ "లిట్మస్" టెస్టులో నిలబడిన కొన్ని బ్లాగులని మత్రమే వుంచి, మిగిలినవాటిని "విత్ డ్రా" చేస్తున్నాను.

(యేమో! మళ్లీ యెప్పుడో నా బ్లాగుసోదరులకి ఇష్టం అయితే, వాటిని పునరుధ్ధరించవచ్చేమో!)

ఆ ప్రక్రియలో భాగంగా, నా "కృష్ణశ్రీ" బ్లాగుని, "కృష్ణశ్రీ స్వగతాలు" అని మారుస్తున్నాను. (నా జ్ఞాపకాలూ, హనీమూన్ లూ వగైరాలు దాంట్లో వుంటాయి.)

ఇంకో "కృష్ణశ్రీ" బ్లాగుని నా "ఫ్లాగ్ షిప్" గా ప్రారంభిస్తున్నాను. అదే ఈ "కృష్ణశ్రీ"--విసుర్లు.

దీంతో కొంత సంఘసేవ, సమాజ పరివర్తనం, ఇంకేవేవో చెయ్యాలని ఆశ!

ఆశీర్వదించండి!