haaram logo

Friday, May 18, 2012

".......ఆచమానాలూ......



........అవస్థలూ"

"కలలు బాగా కనండి......వాటిని సాకారం చేసుకోడానికి ప్రయత్నించండి" అని మన కలామ్ గారు తరచూ ఇచ్చే ప్రవచనం. (ఈయన మరోసారి మన రాష్ట్రపతి కావడంలేదు అని ఈపాటికి రూఢీ అయిపోయినట్టే!) 

(కానీ కలలు కనాలంటే నిద్రపోవాలనీ, నిద్రపట్టాలంటే కడుపు నిండుగా వుండాలి అనీ, "రోజుకి" 22/26 రూపాయలు "తిండీ, బట్టా, ఇతర అవసరాలకోసం" ఖర్చుపెట్టి, సుష్టుగా తిని పడుకొనే "ఆమ్ అద్మీ"కి ఇదెంతవరకూ సాధ్యం అనీ అడక్కండి!)

ఇలా వో సామాన్యుడు అద్భుతమైన కలకన్నాడు. విమానాల్లో "అద్భుతమైన" టాయిలెట్లు యేర్పాటుచేస్తారు. విమానం క్రిందికి దిగాక, ఆ వేస్ట్ ని టాంకు పళంగా తీసుకెళ్లి, ఇంకో టాంకులో పారబోస్తారు. (తరవాత దాన్ని రీసైకిలో యేదో చేస్తారట. ఈ సదుపాయం లేకపోతే అదేదో--పెద్దపులీ, గారెలూ కథలోలా--ప్రజలందరూ దాన్ని భరించే అగత్యం వచ్చుండేది!)

"ఇలాంటి" పర్యావరణ టాయిలెట్లనే మన రైల్వేలు అనుసరిస్తున్నాయట. (ఇన్ ఇండియా ఎవ్విరితింగ్ ఈజ్ ఓపెన్! అని మరిచి, కొన్ని కోట్లు ఖర్చుపెట్టేస్తున్నారు). ఇదో అద్భుతమైన వ్యాపార ఆలోచన!

ఇంక బస్సుల సంగతికి వస్తే, ఆర్ టీ సీ వారికి "బస్ స్టాండ్లూ"; "కాంప్లెక్స్ లూ" వున్నాయి. కొంతవరకూ సరే.

మరి, ప్రైవేటు బస్సులున్నాయి--కేశినేని, దివాకర్, కాళేశ్వరి.......ఇలా.....అన్నీ "లగ్జరీ; సెమీ లగ్జరీ; స్లీపర్; ఏసీ, నాన్ ఏసీ" వగైరా బస్సులని వేల సంఖ్యలో, కొన్ని రెట్ల సొమ్ము టిక్కెట్లగా వసూలు చేస్తూ, లాభాలు దండుకుంటున్నాయి. 

గతిలేక వీటిలో ప్రయాణాలు చేస్తున్నారుగానీ, ప్రయాణీకులు "కట్టు" కట్టగలిగితే......?

"వీటిల్లో ఆ పర్యావరణ టాయిలెట్లని యేర్పాటు చేస్తే వారిమీద పడే భారం యెంత"?

అక్కడిదాకా అఖ్ఖర్లేదు. బస్సులో అందరికీ "అరలీటరు" మినరల్ వాటర్ బాటిళ్లని "వుచితంగా" (టిక్కెట్టులోనే వాటి ధర కలిపేసుకొని) అందిస్తున్నారు. అలా ఇవ్వకపోతే యెవడేడిచాడు? కానీ "ప్రభుత్వ నిబంధన" అలా యేడిచిందట. 

తెల్లవార్లూ టీవీలో డీవీడీలు వెయ్యమని, నిద్రాభంగం చెయ్యమని, యెవడేడిచాడు? (డిటో). 

స్లీపర్లలో కొంచెం నయం. అవసరమైనవాళ్లే చూసేలా, ఇయర్ ఫోన్లతో యేర్పాటు చేస్తున్నారు.

రాత్రి భోజనాలకి అదేదో ముష్టి ధాబా దగ్గర ఆపుతాడు. ఓ పది నిమిషాల వ్యవధిలో ఓ ఐదారు బస్సులు అక్కడే ఆగుతాయి! మనం ముష్టివాళ్లలా, ప్లేట్లు చేత్తో పట్టుకొని, అంతకుముందే కవుంటర్లో డబ్బులిచ్చేసి, టోకెన్లు తీసుకొని, ఆ టిఫిన్ మాస్టర్ ముందు నిల్చుంటే, వాడి దయ కలిగినప్పుడు మనకి ఓ ప్లేటు ఇడ్లీయో, ఓ దోశో, ఓ చపాతీనో అనుగ్రహిస్తాడు (అవీ వుంటేనే!). మళ్లీ కాఫీ కావాలంటే, మళ్లీ టోకెన్, కాఫీ మాస్టర్ ముందు క్యూ! ఈలోగా బస్సు టైము అయిపోయిందని హారన్ లు! వేడితోనూ, కారం తోనూ కాలుతున్న మూతులతో అందరూ బస్సులోకి!

ఇంక ఈ బస్సుల్లో యెవరికైనా టాయిలెట్ అవసరం వస్తే, వాళ్ల అవస్థ వర్ణనాతీతం. స్పీడుగా వెళుతున్న ఆ బస్సులో, పడుతూలేస్తూ, డ్రైవర్ దగ్గరకి వచ్చి ఆపమని అడిగితే, వాడి షెడ్యూల్ ప్రకారం అప్పటికే కొంత లేటుగా నడుస్తూండడంతో (దారిలో లగేజీల లోడింగుకి కొన్ని పావుగంటలు గడిచిపోతాయి మరి!) "అలాగలాగే.....ఆగండి మరి......" అంటూ ఇంకో పది కిలోలు లాగించి, యెప్పుడో ఆపుతాడు!

ఇంక ప్రొద్దున్నే, అందరూ కాలకృత్యాలు తీర్చుకొనే వేళకి, వాడికి యెక్కడ "అనిపిస్తే" అక్కడ బస్సు ఆపేసి, అక్కడి ధాబాలో ఓ ఖాళీ వాటర్ బాటిల్ నింపుకొని, ఓపెన్ ఎయిర్ లోకి వెళ్లిపోతాడు. (అందరినీ అలాగే చెయ్యమంటాడు! తప్పనివాళ్లు యేమి చేస్తారు?) ఆ ధాబాలో టాయిలెట్లుంటాయి.....కానీ అన్నీ తాళం వేసి వుంటాయి!  యెలాగోలా బ్రష్ వగైరాలు చేసి, కాస్త కాఫీయో యేదో తాగుదామంటే, అక్కడ అవేవీ వుండవు. 

మళ్లీ బస్సెక్కి, యెప్పటికో గమ్యస్థానం!

వీటికి పరిష్కారమే--ఓ అద్భుతమైన వ్యాపార సూచన!

వేచి చూడండి మరి.  

Saturday, May 12, 2012

తెలుగు సెలబ్రిటీలూ......



.......వాణిజ్య ప్రకటనలూ

వెనకటికి మా అన్నగారిలాంటి ఒకాయన "అసలు కిత్తాత్తమి అంటే......" అంటూ అంతకుముందు హిట్ అయిన తన సినిమాలోని మేనరిజం ను అనుకరిస్తూ, ప్రకటనల్లో నటించారు.  అది ఓ సిమెంటు కంపెనీదో యేదో. బాగనే వుంది అని సంతోషించాము. (తరవాత ఆయనతో ప్రకటనల జోలికి యెవరూ వెళ్లినట్టులేదు). 

సాధారణంగా, పెద్ద కంపెనీలు సెలెబ్రిటీలని తమ వుత్పత్తులని అమ్ముకోడానికి ప్రకటనలకి వాడుకొంటూ వాళ్లకీ కొంత సొమ్ము చెల్లిస్తూండడం పరిపాటి అయిపోయింది. 

కొండొకచో అది కోట్ల రుపాయలు దాటి, బ్రాండ్ అంబాసిడర్లు లాంటి కొత్త పేర్లతో చెలామణి అయిపోతోంది. 

మరి ఆ ప్రకటనలు చూసేవాళ్లమాటేమిటి? బిగ్ బీ చెప్పాడనో, షారుఖ్, హృతిక్, సల్మాన్ వగైరాలూ, సచిన్ లాంటివాళ్లూ--వాళ్లు చెప్పారని అవన్నీ కొనేస్తారా? వాళ్లని తమ కుటుంబ సభ్యులతో ఐడెంటిఫై చేసుకొని, అనుసరిస్తారా?

యెప్పుడూ జరగదు. 

అదే మన తెలుగులో, చిరంజీవి, బాల కృష్ణ లాంటివాళ్లని తమ అన్నలుగా, ఇంకొంతమంది పెద్దవాళ్లని బాబాయిలుగా, మామయ్యలుగా, ఇతర బంధువులుగా భావిస్తారు. చిరంజీవి "కూల్ కూల్" అంటే, అది ప్రయత్నించినవాళ్లు కోకొల్లలు!

మరి వీళ్లకి ఈ ప్రకటనల్లో పాల్గొనడం అత్యవసరమా? వాళ్లకి అప్పటికే చక్కని ప్రతిష్ట వుంది. డబ్బు వుంది. ఆదరణ వుంది. మరి ఇంక దేనికోసం ఈ చిలక్కొట్టుళ్లు?

దీపం వుండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనో, ముద్దొచ్చినప్పుడే చంకకెక్కాలి అనో భావించొచ్చు. తమకి చాలా సన్నిహితులైన స్నేహితులో, బంధువులో యెవరో, లేదా ఇతర రకాల వొత్తిళ్లు వచ్చాయనో సమర్థించుకోవచ్చు. కానీ, వాటిని తట్టుకోలేరంటే మనం నమ్మగలమా? రియల్ ఎస్టేట్ వ్యాపారులకి వీళ్ల ప్రచారం అంత అవసరమా?

గరికపాటివారూ, చాగంటివారూ ఫలానా "వుల్లి బ్రదర్స్" వారి జరీ పంచెలూ, కండువాలూ మాత్రమే కొనండి అని ప్రకటనల్లో నటిస్తే.............!!??

పాపం గుమ్మడివారిని అదేదో గొర్రెల ఫారం వాళ్లు ప్రకటనల్లో వుపయోగించుకొని, కొన్ని షేర్లు అంటగట్టి, తరవాత ఆయన్ని తొలగించి, బాగా సంపాదించుకొని బోర్డు తిప్పేశారని, ఆయన ఆ మనో వ్యధతోనే వెళ్లిపోయాడనీ అంటుంటారు. 

మన బాబాయిలూ, మామయ్యలూ, అన్నలూ ఇలాంటివాటికి దూరంగా వుంటే బాగుంటుందని అనుకునే తెలుగువాళ్ల అభిప్రాయాలని వీళ్లు గమనిస్తే బాగుండును.

మీరేమంటారు?