haaram logo

Wednesday, December 24, 2014

"అప్పనంగా" 28,000 కోట్లు......!

.......మరో కుంభకోణం....?!

దేశం లోని 9 జాతీయ రహదారుల్లో, జాతీయ రహదారుల అభివృధ్ధి సంస్థ (ఎన్‌ హెచ్ ఏ ఐ), యెక్కువ "టోల్ సుంకం" వసూళ్ల ద్వారా, 28,000 కోట్లు రిలయన్‌స్ ఇన్‌ఫ్రా, ఎల్ అండ్ టీ, ఐ ఆర్ బీ వంటి సంస్థలకి అక్రమ లాభం కట్టబెట్టింది అని కాగ్ ప్రకటించిందట! 6 లేన్ల ప్రాజెక్టులు మూడింటిలో, ఇంకా ప్రాజెక్టు మొదలు కాకముందే, వసూళ్లు మొదలు పెట్టి, 902.98 కోట్లు వాళ్లకి కట్టబెడితే, రిలయన్‌స్ వాళ్ల వసూళ్లని తమ సొంత మ్యూచువల్ ఫండ్ కి బదిలీ చేసిందట!

అసలు ఇలాంటి పీ పీ పీ (పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్‌) క్రింద, బీ ఓ టీ (బిల్డ్, ఆపరేట్, ట్రాన్‌స్‌ఫర్) ప్రాతిపదిక మీద అభివృధ్ధి చేయడం అనే పధ్ధతిని, వాజపేయీ ప్రారంభించాడు. స్వర్ణ చతుర్భుజి పథకం అలా సాకారమయ్యిందే! (ఇందుకు ఆయన్ని విమర్శించినవాళ్లూ, ఇప్పటి అక్రమాలకి ఆయనే కారణం అనే వాళ్లూ వున్నారు). 

అప్పట్లో ప్రాజెక్ట్ వ్యయాన్నీ, దాంట్లో ప్రభుత్వ వ్యయాన్నీ, గుత్తేదారు పెట్టుబడినీ, వాళ్ల లాభాన్నీ, రాబోయే ఆదాయాన్నీ ఖచ్చితంగా అంచనా వేసి, యెన్నేళ్లు టోల్ సుంకం వసూలు చేసుకోవచ్చో నిర్ణయించేవారు. అప్పట్లో ఇన్ని లక్షల ప్రైవేటు వాహనాలు కూడా లేవు. తరువాత కొన్ని లక్షల సంఖ్యలో ఇబ్బడి ముబ్బడిగా పెరిగాయి అన్నిరకాల వాహనాలూ. (టోల్ గేట్ల ముందు నిరీక్షించే వాళ్లందరికీ తెలుసు ఆ సంగతి.......సుంకం యెంత వసూలు అవుతుందో వేచి చూస్తున్న కార్ల, ఇతర వాహనాల ని బట్టి ఊహించి ఆశ్చర్యపోతూ వుంటారు చాలా మంది).

మరి, ఇప్పుడు ఆ రహదార్ల విస్తరణా, ఇతర రహదార్ల నిర్మాణం వగైరాలకి విపరీతమైన అంచనాలు రూపొందించి, టోల్ వసూలు హక్కు (ఇదివరకు 25 యేళ్లకి మించి యెక్కడా లేదు) 33 యేళ్లకీ, 50 యేళ్లకీ, ఇంకా యెక్కువకీ పెంచేస్తున్నారు! పైగా, టోల్ వసూలు మొదలు పెట్టిన కొన్ని సమ్‌వత్సరాల వరకూ ప్రాజెక్టు పూర్తి కావడం లేదు! 

మరి ఇదంతా అక్రమం కాదూ?

ఈ కుంభకోణం లో యే పెద్ద తలకాయలు రాల్తాయో? 

ప్రభుత్వం సత్వర చర్య తీసుకోవాలి!

Monday, April 21, 2014

సమాచార హక్కు


సిగ్గులేని నాయకత్వం 

మన రాష్ట్రం లో స హ చట్టం ప్రకారం దరఖాస్తులకి తెలుగులోనే సమాధానం ఇవ్వాలి.....సమాచారం ఆంగ్లం లో వుంటే అనువదించి మరీ ఇవ్వాలని ఉన్నత న్యాయస్థానం తీర్పు.

కానీ, రాయలసీమ విశ్వవిద్యాలయానికి సంబంధించి దరఖాస్తు చేస్తే, సమాచారం 70 వేల పేజీలు వుంది అనీ, పేజీ కి రూ. 2/- చొ.న. ఓ లక్షా నలభైవేలూ, అనువాదానికి ఖర్చులుగా రూ. 2 లక్షల పది వేలూ, వెరసి మూడున్నర లక్షలిస్తే సమాధానం ఇస్తామన్నారట అధికారులు.

నడివీధిలో కొరడాదెబ్బలు కొట్టాలని శిక్ష వేయద్దూ వాళ్లకి?

పార్లమెంటు లో సభ్యులు లేవనెత్తిన అంశాలపై ఆయా శాఖల మంత్రులు, చర్య తీసుకుంటామని ఇచ్చిన హామీలని నిర్దిష్ట గదువులోగా నెరవేర్చాలి. అవి నెరవేరేలా చూడ్దానికి ఓ సభాసంఘం వుంటుంది. కానీ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ ఇచ్చిన సమాచారం ప్రకారం అలాంటి హామీలు 2,812 బుట్టదాఖలు చేశారట. ఇంకో 299 మాటలను వెనక్కి తీసుకున్నారట!

ఈ ప్రభుత్వ పార్టీ యేమో, 2004, 2009 యెన్నికలప్పుడు ఇచ్చిన హామీలన్నీ కాకపోయినా, అత్యధికం నెరవేర్చాం అంటు సిగ్గులేకుండా డబ్బా కొట్టుకొంటోంది!

సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా ప్రమేయం వుందనే ఆరోపణలున్న ఓ భూకుంభకోణం పై సమాచారం అడిగితే, ప్రథానమంత్రి కార్యాలయం యేకంగా గుండెలు బాదేసుకుందట--సమాచారం అడగడం చట్ట విరుధ్ధం; చట్టాన్ని దుర్వినియోగ పరచడం; చట్టాన్ని అపహాస్యం చెయ్యడం--అంటూ!

పెద్దింటి అల్లుడి గురించి అడగడం మాహా పాపం అన్నట్టు తేల్చారట.....పీ ఎం ఓ ఉపకార్యదర్శి తన 15 పేజీల లేఖలో!

సమాచార హక్కు చట్టం మేమే తెచ్చాము అన్న వెయ్యేళ్లు ధనంతో వర్థిల్లాలి అనుకొనేవాడు ముఖం యెక్కడ పెట్టుకోవాలో మరి?

మూడేళ్ల క్రితం, ఒత్తిడి పెరుగుతూండడంతో, కేంద్ర ప్రభుత్వం దేశ విదేశాల్లో మన వాళ్ల నల్లధనం యెంతో తేల్చమని మూడు ప్రభుత్వ దర్యాప్తు సంస్థలని ఆదేశించి, 18 నెలల గడువు ఇచ్చిందట.

ఆ విషయం లో యేం జరిగింది అని స హ దరఖాస్తు చేస్తే, ఒక్క సంస్థ మాత్రమే నివేదిక ఇచ్చింది అనీ, దాన్ని పరిశీ........లించి, చర్యలు తీసుకోవాలి కాబట్టి, ఆ నివేదిక నకలు ఇవ్వలేము అనీ చెప్పారట అధికారులు. మిగిలిన రెండు సంస్థలూ ఇంకా యెన్నాళ్లు గోళ్లు కొరుక్కుంటూ వుంటాయో?

అవినీతికి వ్యతిరేకంగా చర్యలు తీసుకుంటున్నది మా ప్రభుత్వం మాత్రమే అంటూ స్వకుచమర్దనం చేసుకుంటున్న వె ధ వ ..............?!

మొదణ్నించీ చెపుతున్నాను ఆథార్ పెద్ద కుంభకోణం అని.......

నందన్‌ నీలేకణి ని ఆథార్ ఛైర్మన్‌ గా నియమిస్తూ ఇచ్చిన ఉత్తర్వుల ప్రతి, ఆయన రాజీనామా పత్రం నకలు, ఆయన పదవిలో వున్నప్పుడు ప్రథానమంత్రి కార్యాలయం తో జరిపిన ఉత్తర ప్రత్యుత్తరాల ప్రతులను అడుగుతూ సహ దరఖాస్తు చేస్తే, దాన్ని సెక్షన్‌ 6 (3) క్రింద యెన్నికల సంఘానికి బదిలీ చేశారట!

గోకులాష్టమికీ, పీరు సాయిబ్బుకీ సంబంధం యేమిటో మరి!

ఇలాంటివన్నీ బయట పెడితే, అసలు రహస్యాలు బయటపడతాయని భయపడుతున్నారు అని తేట తెల్లం అవడం లేదూ?

ఇంక స హ చట్టం తెచ్చింది మేమే అని బుకాయించడం మానేస్తారా......వె ధ వ లు?

గత పదేళ్లలో ప్రథాని 1110 సార్లు నోరు విప్పారని చెప్పారట....అంటే నెలకో పది సార్లకన్నా తక్కువే! ఆ సందర్భాలు కూడా విదేశాల్లోనో, ఇంకెక్కడో అగ్రరాజ్యాలని దేబిరించడం, తనేదో అంతరిక్ష రాజ్యానికి అధిపతినన్నట్టు....... ప్రభుత్వం ఇలా చెయ్యాలి, అలా చెయ్యాలి......అని చెప్పడానికేనమ్మా! మహగొప్ప నికమ్మా!

అదే 2009-14--ఐదేళ్లలో, స్పీకర్ మీరా కుమార్ (1977 లోఇందిరాగాంధీ మంత్రివర్గం నుంచి రాజీనామా చేసి, "సింహాసనం అదిరింది" అని ప్రకటించిన మహానుభావుడు బాబూ జగజ్జీవనరామ్ కుమార్తె ఈమె) తన తండ్రీ, తన నియోజకవర్గం బీహార్ లోని ససారమ్‌ లో కేవలం 58 రోజులు మాత్రమే గడిపారట.

దాహంతో గొంతెండిపోయే ప్రజలకి చేసిందేమీ లేదుగానీ, అదే సమయం లో 178 రోజులు విదేశాల్లో వున్నారట! (ఇవీ స హ చట్టం ప్రకారం బయటకి వచ్చినవే!)

మరి ఆ ప్రజలు మళ్లీ ఆవిడకి ఓట్లు వేస్తారంటారా?

Monday, March 3, 2014

విసుర్లు........


............తగిలేనా?!

మొన్నో రోజు పేపర్లో, ఒకాయన ఆధ్యాత్మిక వ్యాసం వ్రాస్తూ, రామకృష్ణ పరమహంస గా ప్రసిధ్ధి చెందినాయన, కాళికాలయం లో పూజారిగా పనిచేస్తూ, ఓ రోజున ఓ యోగి ఆకాశ మార్గాన ప్రయాణించడం, అయన వెనకే ఓ హంస యెగురుతూ వెళ్లడం చూసి, తాను కూడా అలా యెగిరి వెళ్లిపోతే బాగుంటుందనుకున్నాడట అనీ, తరువాత ఓ రోజు, కాళికామాత పాదాల దగ్గర ఆ హంసని చూసి ఆశ్చర్య పోయాడనీ, అక్కణ్నించి "పరమ హంస" అనే పేరు "తనకి తానే" పెట్టుకున్నాడనీ సెలవిచ్చారు. (నిజానిజాలేమిటో నాకు తెలీదు కానీ, ఆయన ఆధ్యాత్మిక పాండిత్యానికి అందరూ సంతోషించాలి.) 

ఇంతకు ముందు, ఓ సారి, విష్ణుచిత్తుడికి ఓ పాప దొరికితే, "శూడిక్కుడుత్త నాచ్చియర్" అని పేరు పెట్టుకొని పెంచాడని వ్రాసిందీ ఈ మహాను భావుడే. 

పత్రికవాళ్లు వీటిని ప్రచురించడం మాత్రం అత్యంత ముదావహం. 

ముదావహం అంటే గుర్తొచ్చింది..........

మా మునిసిపల్ ఛైర్మన్‌ ఒకాయన వుండేవారు. ఆయన ఉపన్యాసాలలో పదాలని వాడడం లో నిరంకుశుడు. (నిరంకుశాః కవయః అన్నారు).

ఘంటసాల కి సన్మానం చేస్తూ, ఆ సభాధ్యక్షుడిగా ఈయన "ఈయనెవరనుకున్నారు? మన సినిమాల్లో నాగేశ్వర్రావూ, రామారావూ పాటలు బలే పాడేస్తున్నారని మీరనుకుంటారు. కానీ వాళ్లతోపాటు యస్వీ రంగారావుకీ, సావిత్రీ వాళ్లక్కూడా పాటలు పాడేది ఈయనే!" అనెయ్యగానే, తరువాత మాట్లాడినాయన, "నిజమే, మాయాబజార్ లో సావిత్రిక్కూడా పాడారు" అని సమర్థించవలసి వచ్చింది. హాస్యం మాత్రం బాగా పండిందనుకోండి. 

ఆయనే పోలీసుకాల్పుల్లో ఓ వ్యక్తి మరణించినప్పుడు ఆవేశంగా 'తుపాకీ' వారి 'సీ ఆర్ పీ గుళ్లకి' నా ప్రజలు ఇలా బలై పోవడం చాలా 'ముదావహం'.......ఇలాంటి ముదావహాలు ఇకముందు జరిగితే యేమాత్రం సహించడానికి 'సంకోచించం' అంటూ, "పావుగంటలో 16 ముదావహాలు వేశాడు" అన్నాడు మా కృష్ణమాచారి. (ఈ కృష్ణమాచారి కృష్ణం రాజు సినిమా కృష్ణవేణి లో ఓ మంచి పాత్ర వేసి, డ్యాన్‌సుల్లో కూడా పాల్గొన్నాడు). 

అలా వుంటాయి.

మా భాషా, సాహిత్య, చరిత్ర నిపుణుడైన  మిత్రుడికి యే విషయమైనా మూలాల్లోకి వెళ్లి శోధించి, దాని వ్యుత్పత్తి యెలా జరిగిందో కనిపెట్టి, అందరికీ చెప్పడం ఓ సరదా. (ఈ విషయం లో మోడీ కన్నా తనకి కొంచెం యెక్కువే తెలుసు అని చెప్పుకుంటున్నాడీ మధ్య).

ప్రపంచ ప్రఖ్యాత రష్యన్‌ నాయకుడు లెనిన్‌ పూర్తి పేరు, అసలు పేరు, దాని అర్థం యేమిటో తెలుసా అని ప్రశ్నించి, యెవరూ సాహసం చెయ్యకపోవడంతో తనే చెప్పాడిలా--పూర్తి పేరు వ్లాడిమిర్ ఇల్ ఇచ్ లెనిన్‌. అసలు పేరు వ్లాడిమిర్ ఇల్ ఇచ్ ఉల్యనోవ్. అంటే అర్థం--వాళ్ల భాషలో వ్లాడ్ అంటే గోక్కోవడం. వ్లాడి అంటే గోక్కోవలసిన. మిర్ అంటే బాగా. వ్లాడిమిర్ అంటే బాగా గోక్కోవలసిన. ఇల్ అంటే చెడ్డదైన ఇచ్ అంటే దురద. ఉల్యనోవ్  అంటే ఉద్దీపింప చేసేవాడు అని. అంటే పూర్తిగా, బాగా గోక్కోవలసిన చెడ్డ  దురదని ఉద్దీపింప చేసేవాడు. అంటే, బాగా పెంచేవాడు. లేదా విజృంభింప చేసేవాడు అని. 

చూశారా యెంత చక్కటి పాండిత్యమో!

Wednesday, February 26, 2014

మన ప్రభుత్వం.............


...........ఆర్థిక స్థితీ 

మొన్న (24-02-2014) ఈనాడులో ఎస్ ఎస్ తారాపోర్ (ఈయన ఒక రినౌన్‌డ్ బ్యాంకర్. ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ఉన్నతపదవులు నిర్వహించిన విశ్రాంతుడు. మామూలు 'బ్యాంకింగ్ రంగ నిపుణుడు' కాదు!) వ్రాసిన కొత్త సర్కారుకు "ముందు నుయ్యి - వెనుక గొయ్యి" వ్యాసం చదివితే నేను నా బ్లాగుల్లో వ్రాస్తున్న ఆర్థిక విషయాలు (బ్యాంకులూ, ఇన్‌ఫ్లేషన్‌ వగైరాలు) యెంత నిజాలో మీకూ తెలుస్తుంది. ఈ క్రింది విషయాలు గమనించండి.

".........2013-14 కు సవరించిన అంచనాల ప్రకారం  కేంద్రానికి వివిధ ప్రభుత్వ  రంగ సంస్థల నుంచి లాభాలు, డివిడెండ్ రూపం లో వచ్చిన మొత్తం 2012-13 లో వాస్తవంగా ఇలా అందిన మొత్తం కన్నా 64 శాతం ఎక్కువ. దీన్నిబట్టి చూస్తే ఏమనిపిస్తోంది. ప్రభుత్వం తాను గీసుకున్న లక్ష్మణరేఖ (ద్రవ్య లోటును జీడీపీలో 4.8 శాతం లోపు ఉండేలా చూడడం) దాటాల్సిన అవసరం లేకుండా పోయింది. అర్థ్హం చేసుకుంటే ఇదంతా లెక్కల గిమ్మిక్కు మహత్యమేనని తెలియదూ!"

".........మొన్నటి మధ్యంతర బడ్జెట్లో.........ముఖ్యంగా వాహన పరిశ్రమకు ఊరట లభించింది. అయితే పెద్ద కార్ల విషయం లో గణనీయంగా తగ్గింపు ప్రకటించడం రాజకీయ ఒత్తిళ్లు ఎంతగా పనిచేశాయన్నదానికి అద్దం పడుతోంది..................సామాన్యుడికి మాత్రం ఒరిగేది ఏమీ లేదనే చెప్పుకోవాలి."  

"ప్రభుత్వ రంగ బ్యాంకులకు మూలధన సాయం రూపం లో రూ.11,200 కోట్లు అందించనున్నట్లు ఆర్థిక మంత్రి...........బ్యాంకుల స్వరూప స్వభావాలు జాతీయకరణ సమయం లో ఎలా ఉన్నాయో ఇప్పుడు కూడా అలాగే ఉన్నాయి. గత 45 యేళ్లలో బ్యాంకుల చరిత్ర తిరగేస్తే.....జబ్బుపడ్డ గుర్రాలకు రక్తమార్పిడి చేయడం, స్టెరాయిడ్లు ఎక్కించడం ద్వారా వాటిని పందెం గుర్రాలుగా తీర్చిదిద్దుతున్న ప్రయత్నం కనిపిస్తుంది...........జబ్బు తిరగబెట్టి మళ్లీ మళ్లీ.......మూలధన సాయం అవసరమౌతూ........మళ్లీ చతికిలపడిపోతూ......... చివరకు......నిలదొక్కుకోలేని విధానాల తాలూకు భారాన్ని మోయవలసింది మాత్రం సగటు వ్యక్తేనన్నది తోసిపుచ్చలేని వాస్తవం."    

"............ప్రధాన పారిశ్రామిక దేశాలతోపాటు భారత్ లోనూ ద్రవ్యోల్బణ రేటు పెరుగుతూ వస్తోంది...........రూపాయి విలువ పడిపోవడం అత్యంత సహజం. కానీ, మన రాజకీయవేత్తలు ఊరుకోరుగా...అరచి గగ్గోలు చేస్తారు..........ఆర్ బీ ఐ సరైన లక్ష్యాలనే నిర్దేశించింది.........ఆర్థిక మంత్రి మరింత బలపరచడమో, లేదా కనీసం సమర్ధించడమో చేయాలని ఎవరైనా ఆశిస్తారు. కానీ.........ప్రభుత్వా వైఖరి.....ఆర్ బీ ఐ..........కఠినతర ద్రవ్య విధానాలని వదలి వేసేటట్లుగా........ఒత్తిడిని పెంచనుంది........ప్రముఖ ఆర్థికవేత్త ఆచార్య పి.ఆర్.బ్రహ్మానందం మాటలలో చెప్పాలంటే 'ద్రవ్యోల్బణాన్ని పట్టించుకోకపోవడం ప్రాణాలు వదలిన, తీవ్రగాయాలతో మరణానికి దగ్గరగా ఉన్న, క్షతగాత్రులైన వారిని గురించి పట్టించుకోకుండా సమరానికి వెళ్ళడం లాంటిదే'. రానున్న నెలల్లో సామాన్యుడికి మరింత వేదనే మిగలనుంది."

వచ్చే ప్రభుత్వం తప్పులని సవరించి, సామాన్యుడికి న్యాయం చేస్తుందని ఆశిద్దాం.

Sunday, February 23, 2014

మన బ్యాంకులూ........2


.........నిరర్ధక ఆస్తులూ

బ్యాంకు ఉద్యోగుల యూనియాన్లు మొదటినుంచీ ఆ విధానాలని వ్యతిరేకిస్తున్నాయి. కోట్లాది రూపాయలు బకాయి పడ్డవాళ్లని ఒదిలేసి, ప్రభుత్వమే వివిధ పథకాల క్రింద ఇప్పించిన చిన్న చిన్న ఋణాలమీద ప్రతాపం చూపించమనడం, వాళ్ల మీద చర్యలు తీసుకోవడం ఏమిటి అని ప్రశ్నిస్తూనే ఉన్నాయి. విత్త మంత్రిగారేమో బ్యాంకుల లాభాలన్నీ ఉద్యోగుల జీతాలకే పోవాలా అంటున్నాడు. పెద్ద మొత్తాలలో ప్రభుత్వం వాటా డివిడెండ్ చెల్లించాలని బ్యాంకులని ఒత్తిడి చెయ్యడం, బ్యాంకులు బ్యాలెన్స్ షీట్లని మసిపూసి మారేడు కాయ చెయ్య్డడం , మళ్లీ వాటి కేపిటల్ కోసం పెద్ద యెత్తున నిధులు విడుదల చేస్తున్నామని చెప్పుకోవడం--ఇదంతా ఓ పెద్ద విష వలయం.

ఫినకిల్ సాఫ్ట్ వేర్ లో లోపాలు ఉన్నాయని యునైటెడ్ బ్యాంకు చేసిన ఆరోపణలని వెనక్కి తీసుకున్నారని చదివాము. బహుశా ఇన్‌ఫోసిస్ వాళ్లు అదేమీ లేదు అని చెప్పారు కాబట్టీ, అన్ని బ్యాంకులూ అదే సాఫ్ట్ వేర్ వాడుతున్నారు కాబట్టీ కావచ్చు. కానీ, ఆ సిస్టమ్ లో నిరర్ధక ఆస్తుల గుర్తింపు కోసం అనేక పరామితులు (పెరామీటర్స్) నిర్దేశించడంతో ఆ ప్రక్రియ సంక్లిష్టంగా మారింది. ఉదాహరణకి రాబోయే కాలం లో NPA లుగామారే ఆస్కారం వున్న ఖాతాలని చూపించమంటే, ఆ Potential NPA రిపోర్టు (PNPA అంటారు) తయారవడానికే కొన్ని గంటల సమయం పడుతుంది. ప్రింటు పేజీలతరబడి వస్తూనేవుంటుంది. ఆ బ్రాంచి (ఫినకిల్ లో సోల్--Service Outlet) లో ఉన్న అన్ని ఋణ ఖాతాలనీ చూపిస్తుంది. ఆ రిపోర్టు ఆథారంగా యే ఖాతా యెందుకు NPA గా మారుతుందో తెలుసుకొని, తగిన చర్య తీసుకోవడం యే మానవ మాత్రుడికీ సాధ్యం కాదు. కనీస యేఖాతాలో యెంత వసూలు చేస్తే ప్రమాదం తప్పుతుందో కూడా చూపించదు. ఓ ఖాతాలో 10 కోట్లు బాకీ వుంటే, అంతా చూపిస్తుంది. కనీసం యేతేదీ నుంచి అది NPAగా మారుతుందో చూపించదు. ఇంకా ఋణ ఖాతాల వైవిధ్యం ప్రకారం అయినా (టెర్మ్ లోన్లు వేరే, గోల్డ్ లోన్లు వేరే.....ఇలా) చూపిస్తే, చాలా వెసులుబాటుగా వుంటుంది. (ఇప్పుడు ఇవి యేమైనా మార్చారో లేదో నాకు తెలియదు కానీ, మేనేజర్లు తమ కష్టం యేమీ తగ్గక పోగా పెరుగుతోంది అని వాపోతున్నారు).

మళ్లీ కొత్త బ్యాంకులు స్థాపిస్తామంటారు. ముత్తూట్ వగైరాలు కూడా వైట్ లేబెల్ ఏటీఎం లు ప్రారంభిస్తామంటారు. ఓ పక్క యెక్కువ లావాదేవీలు జరగని ఏటీఎం లని మూసేస్తామంటున్నాయి బ్యాంకులు. (వాటికి కూడా పనిచేయు వేళలు అని బోర్డులు తగిలిస్తారనుకొంటా!) ప్రభుత్వమేమో ఆథార్ కోసం మరిన్ని చోట్ల మరిన్ని ఏటీఎం లు తెరవాలి అంటుంది. ఇదంతా ప్రగతి లో భాగమేనేమో!

దానికన్నా బ్యాంకులని డీ నేషనలైజ్ చేస్తే యెలా వుంటుదో ఆలోచించాలి మేధావులు.


Saturday, February 22, 2014

మన బ్యాంకులూ........




.........నిరర్ధక ఆస్తులూ

యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిరర్ధక ఆస్తులు 3 నెలల్లో ఒకేసారి యెక్కువగా పెరిగినట్టు "చూపించడం" తో ఆ బ్యాంకు సీ ఎం డీ బలి కావాలసి వచ్చింది. 

అసలు ఈ నిరర్ధక ఆస్తుల గుర్తింపే ఓ గందరగోళం. పైగా వాటివల్ల యెవరికీ ఏ ఉపయోగం లేదు--బ్యాంకుల షేర్ హోల్డర్లనీ, రిజర్వ్ బ్యాంకునీ, స్టాక్ మార్కెట్ నీ మోసం చెయ్యడం తప్ప. యెందుకంటే..........

అసలు వాటి గుర్తింపు, తగిన జాగ్రతా చర్యలు తీసుకోవడం, అవి వసూలు కాకపోతే బ్యాంకు లాభ నష్టాల ఖాతాలో తగిన "ప్రావిజన్" లు పెట్టడం విషయం లో ఓ విధానమంటూ మొదలయ్యాక, దాని కోసం ప్రతీ బ్యాంకూ వాళ్లిష్టం వచ్చినట్టు వ్యవహరించడం మొదలెట్టాయి. అప్పట్లో వివిధ స్థాయిల అధికార్లకీ ఈ నిరర్ధ్హక ఆస్తులు యెంత తక్కువగా చూపిస్తే, అంత గొప్ప. దాంతో, నానా కష్టాలూ పడి, సం వత్సరాంతం లో జరిగే "ఆడిట్" కి వచ్చే ఆడిటర్లని మేనేజ్ చేసుకొని, వీలైనన్ని నిరర్ధక ఆస్తులని చాపక్రింద తోసేసేవారు. 

ఓ ఐదారు యేళ్లుగా రిజర్వ్ బ్యాంకు కొద్దిగా కళ్లెర్రజేయడంతో, వీటిని పెంచి చూపించడం మొదలెట్టారు. అదీ దశలవారీగా. కానీ యెన్నాళ్లు దాగుతాయి? 

బ్యాంకులు సంక్షోభం యెదుర్కోకుండా అందించిన అస్త్రం రీ షెడ్యూల్ మెంట్. అంటే, ఋణం ఇచ్చేటప్పుడు యెన్ని వాయిదాలలో తిరిగి చెల్లించాలి, వడ్డీ యెలాకట్టాలి, అపరాధ వడ్డీ యెంత? లాంటి నిబంధనలు విధిస్తారు కదా? అలా చెల్లించలేని ఖాతాలు నిరర్ధక ఆస్తులు అయిపోతాయి. అందుకని, నిబంధనలు మార్పు చేసి, చెల్లించవలసిన వాయిదాలని పెంచడం, మొదటి వాయిదా చెల్లింపుని వీలైనంత దూరం జరపడం, అపరాధ వడ్డీ ముదరా.....ఇలా చేసి, హమ్మయ్య! ఇది నిరర్ధక ఆస్తి కాదు అని నిట్టూర్చడం!

రికార్డుల కోసం ఋణగ్రహీతలకి నోటీసులు ఇచ్చినట్టూ, వారి అంగీకారంతోనే నిబంధనలు మార్చి, ఋణాన్ని రీ షెడ్యూలు చేసినట్టూ పుస్తకాల్లో వ్రాసేస్తారు. ఆక్కడనుంచీ, 10 వేల రూపాయల చిన్న ఋణం నుంచీ కోట్ల రూపాయల ఋణాల వరకూ (వీటిని టెరమ్ లోన్లు అంటారు) రీషెడ్యూల్ చేసేస్తారు. అలా యెన్నాళ్లు? ఆడిటర్లు ఒప్పుకొన్నన్నాళ్లూ! 

ఇంకో నిబంధన యేమిటంటే, ఓ ఋణ గ్రహీత కి అనేక లిమిట్ లు ఉండొచ్చు. (ఓపెన్ లోన్, కీలోన్, టెరమ్ లోన్, బిల్ డిస్కవుంట్ లిమిట్, లెటర్ ఆఫ్ క్రెడిట్, గోల్డ్ లోన్, గ్యారంటీలు--ఇలా) వాటిలో యే ఖాతా నిరర్ధక ఆస్తి గా మారే అవకాశం వున్నా, అప్పుడు ఆ ఆస్తిలో ఈ అన్ని లిమిట్ ఖాతాల లోనూ చెల్లించవలసిన నిలవలనీ కూడా నిరర్ధక ఆస్తులుగానే ప్రకటించాలి. 

దీనికోసం బ్యాంకులు అనుసరించే పాధ్ధ్హతి--బ్యాంకులో యే ఖాతా తెరవాలన్నా, ఖాతాదారు వివరాలతో ఓ కోడ్ ఎలాట్ అవుతుంది కంప్యూటర్లో. అందుకని, వేరే వేరా ఖాతాలకి అవే వివరాలతో వేరే వేరే కోడ్ లు సృష్టించడం. దాంతో, ఫలానా కోడ్ తో వున్న ఖాతాలు చూపించమంటే, ఒక్క ఖాతానే చూపిస్తుంది కంప్యూటర్ మరి! మరి పై నిబంధనని తుంగలో తొక్కినట్టే కదా?

కొన్నేళ్ల క్రితం కొద్దిగా మార్పు వచ్చింది. కొత్తగా వచ్చిన సీ ఎం డీ నిరర్ధక ఆస్తులని యెక్కువగా చూపించి, ఆయన హయాం లో అవి తగ్గిపోయినట్టు చెప్పి, షేర్ వాల్యూ ని పెంచుకున్నారు. ఇంకా తరవాత రిజర్వ్ బ్యాంక్ సంకేతాలతో, స్టేట్ బ్యాంక్ సీ ఎం డీ, నిరర్ధక ఆస్తులని వీలైనంతవరకూ దాపరికం లేకుండా ప్రకటించాలని ఆదేశించడంతో, అవి విపరీతంగా పెరిగాయి. (ఆయన అదృష్టం కొద్దీ బలి అవలేదు). ఇతర బ్యాంకులు కూడా కొంత మారాయి. ఇప్పుడు యునైటెడ్ బ్యాంకు పరిస్థ్హితి చూస్తే, వాళ్లు మారలేదు అని తెలుస్తోంది. ఫలితమే ఆవిడ రాజీనామా!

మిగతా మరోసారి.......

Tuesday, January 14, 2014

నేటి జర్నలిజం


వార్తలూ, విశేషాలూ

13-01-2014, ఈనాడు జిల్లా ఎడిషన్ లో, శాస్త్రవేత్త ఎ.సూర్యతేజ్ "......తన అనుభవాలను..... పంచుకున్నారు...... ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే......." అంటూ.......

"జీ ఎస్ ఎల్ వీ-డీ5.......ప్రయోగంలో 'లిక్విడ్ ఇంజిన్ మెకానికల్ సిస్టం 'పై పనిచేసి........గర్వకారణం....... గతంలో పీ ఎస్ ఎల్ వీ ప్రయోగం ద్వారా 1.6 టన్నుల క్రయోజెనిక్ ఇంజిన్ ను కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. జీ ఎస్ ఎల్ వీ-డీ5 ప్రయోగం ద్వారా దాదాపు 2 టన్నుల బరువుతో కూడిన క్రయోజెనిక్ ఇంజిన్ ను కక్ష్యలోకి ప్రవేశ పెట్టడం ద్వారా.......ఘన విజయమనే చెప్పాలి"

అని ప్రచురించారు. (అండర్ లైన్ చేసింది నేను)

మరి ఆ విలేకరే అలా వ్రాశాడో, సబ్ ఎడిటర్ పట్టించుకోలేదో! ఇంకా ఇలాంటివాళ్లని యెన్నాళ్లు భరిస్తారో?
     
అసలే జర్నలిస్టులూ, సబ్ ఎడిటర్లూ దొరక్క మేమేడుస్తూంటే ఈ గోల యేమిటీ అంటారేమో!