haaram logo

Sunday, November 11, 2012

మనదేశం……



………కంప్యూటర్లూ

“సర్కారీ పెద్దలకి కావలసిన పెద్ద మనిషొకడు వచ్చి, ‘అయ్యా….బ్రతకడానికో దారి చూపండి‘ అంటూ ప్రాధేయపడితే, ‘సరే! ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలని కంప్యూటరీకరిస్తూ బ్రతుకు’ అన్నాడటా సర్కారీ పెద్ద. 2008 నుంచీ ‘అలా బ్రతికేస్తున్నాడు‘ వాడు! ఇప్పుడు కోట్లాది రూపాయల కుంభకోణాలు బయట పడుతున్నాయి. అయినా కంప్యూటరీకరణ యెక్కడ వేసిన గొంగళీ అక్కడే అన్నట్టుంది.”—ఇదీ ఓ ప్రముఖ వార్త!

అంతకు ముందెప్పుడో చంద్రబాబు చేసిన తప్పేమిటయ్యా అంటే, విజన్ 2020 పేరుతో, ప్రభుత్వ కార్యకలాపాలన్నీ కంప్యూటరైజ్ చెయ్యాలనుకోవడం. (అప్పట్లో ఆయన అందజేసిన కంప్యూటర్లని ‘కర్మచారులు‘ గొడ్డళ్లతో నరికేశారు—పని చెయ్యాల్సొస్తుందనీ, చేస్తే తమ గుట్లు బయటపడతాయనీ!) అదే ‘అయాచిత వరం‘ అయ్యింది తరవాతవాళ్లకి.

రెవెన్యూ ఆఫీసుల మధ్య అనుసంధానం, రిజిస్ట్రేషన్ ఆఫీసుల అనుసంధానం, వాటికీ వీటికీ అనుసంధానం, వీటన్నింటినీ హైదరాబాదుతో అనుసంధానం, మళ్లీ అన్నీ ‘మీ సేవ‘ కేంద్రాలతో అనుసంధానం……ఇలా నిరంతరం కొనసాగుతూ వస్తోంది. (యెవరికీ ఒక్క పైసా ప్రయోజనం లేదింతవరకూ. పైగా అనేక కష్టాల పాలవుతున్నారు సామాన్య ప్రజలు. దానికి తోడు వరదలూ గట్రా వచ్చి, కార్యాలయాలు నీట మునిగితే, మళ్లీ కంప్యూటరు వాళ్ల పంట పండినట్లే!)

ఇక, కేంద్రంలో అయితే—ఆథార్ కోసం, జనాభా రిజిస్టర్ కోసం, ప్రభుత్వ పథకాల కోసం, ‘పైలట్ ప్రాజెక్టుల‘ కోసం, వాటి అనుసంధానం కోసం—ఇలా కొనసాగుతూనే వున్నాయి. 

ఇప్పుడు తాజాగా ‘నగదు బదిలీలు!’.

నేనిదివరకే వ్రాశాను—కంప్యూటర్లు మనదేశానికి వచ్చినప్పటినుంచీ మనదేశం లో వాటిపేరుతో యెంత ఖర్చుపెట్టారో, దానిలో యెంత వృధా అయ్యిందో దర్యాప్తు చేస్తే, అది మన జనాలు విదేశీ బ్యాంకుల్లో దాచుకున్న నల్ల ధనం కన్నా, మన కరెంటు ఖాతా లోటు కన్నా, మన ప్రభుత్వాలు ‘ఆమ్ అద్మీ’ కి ఇస్తున్న సబ్సిడీలకన్నా—కొన్నిరెట్లు వుంటుందని.

అసలు వీళ్లని సబ్సిడీలెవరు ఇవ్వమన్నారు?

దేశంలో మొదటిసారిగా 1962 లో చైనా యుధ్ధం మొదలైనప్పుడు ‘రేషన్ విధానం‘ పుట్టుకొచ్చింది—సైన్యావసరాలకి పోను మిగతా ఆహార పదార్థాలూ, కిరొసిన్ వంటి వాటిని ప్రజలకి కొద్ది నియంత్రణతో మాత్రమే అందించాలనే వుద్దేశ్యంతో. (ఆ కాలంలోనే వ్యాపారులు అక్రమ నిల్వలు చెయ్యడం, బ్లాక్ మార్కెట్ అనే వ్యవస్థా పుట్టాయి. నెహ్రూగారు ‘బ్లాక్ మర్కెట్ చేసేవాళ్లని దగ్గరలోని దీపస్థంభానికి వురితీయాలి‘ అని అక్రోశించిందప్పుడే).

తరవాత 1965 పాకిస్థాన్ యుధ్ధం సమయంలో మళ్లీ రేషన్ విధించాల్సిన అవసరం వచ్చింది. ఇదేకాకుండా, లాల్ బహదూర్ శాస్త్రి దేశ ప్రజలందరూ ‘వారానికి ఒక పూట భోజనం మానేసి, దానికయ్యే ఖర్చు దేశ రక్షణ నిధికి ఇవ్వండి‘ అని విజ్ఞప్తి చేశారు! (అప్పటికే దేవుళ్లపేరుతో—ముఖ్యంగా వెంకటేశ్వర స్వామికి శనివారాలు ఒంటిపూట భోజనాలు చేస్తున్నవాళ్లు కూడా ఇంకో పూట దేశంకోసం మానేశారు!)

మరి ఈ పచ్చ కార్డులూ, గులాబీ కార్డులూ, తెల్ల కార్డులూ, పసుపు కార్డులూ, గొడవా యెప్పుడు మొదలయ్యింది?

…….(మరోసారి)  

Tuesday, October 16, 2012

శబ్దకాలుష్యం..........



.........ప్రవచనాలూ

"వినదగునెవ్వరు చెప్పిన......" అన్నారు. అది ఇక్కడ సరిపోదుగానీ, ప్రవచనాలు మాత్రం నిజంగా అందరూ వినవలసిందే.......వంటపట్టించుకోవలసిందే. 

నిజంగా ఈ ప్రవచనాలు చెప్పేవాళ్లు "పుంభావ సరస్వతులు". వాళ్లకి నా నమోవాకాలు.

మొదట చెప్పుకోవలసింది "ధారణా రాక్షసుడు" అని బిరుదు పొందిన మాష్టారి గురించి. అలవోకగా పురాణాల్లోంచీ, ఇతిహాసాల్లోంచీ, ప్రసిధ్ధ కవులనుంచీ, అవధానాల నుంచీ సమర్థనలు ఇస్తూ, మధ్యలో చక్కని జోకులూ, కొండొకచో చురకలూ వేస్తూ గంటలతరబడి చెప్పేస్తూ వుంటారు. టీవీ ఛానెళ్లలో కూడా సుమారు గత పదేళ్లుగా తరచూ వినిపిస్తూంటుంది ఈయన గొంతు. చెప్పుకోవలసిందేమిటంటే, స్పుటమైన స్వరంతో, తక్కువ శబ్దంతో విన్నా, స్పష్టంగా అర్థమౌతాయి ఈయన ప్రవచనాలు.

మొన్నీమధ్య అమెరికాలో సభలకి వెళ్లినప్పుడు, ఆయనకి అందరూ ఇచ్చిన పంచెలూ, శాలువాలూ (ఆయన మరిచిపోయారనుకుని) ఓ ప్యాకెట్ తయారుచేసి, పార్థ రామరాజుగారు అనే ఆయన ఎయిర్ పోర్టుకి తెచ్చి ఆయనకి ఇవ్వబోయారట. నిజానికి ఆయన అవన్నీ వదిలెయ్యాలనే వదిలేసి వచ్చారట. (ఈ విషయం బలభద్రపాత్రుని రమణి కౌముదిలో వ్రాశారు.) 

సన్మానాలు పేరుచెప్పి, ఓ బొకే ఇచ్చి, ఓ మాల (కొండొకచో గజమాల) వేసి, ఓ శాలువా కప్పి, ఓ జ్ఞాపిక అందించడం, ఫోటోలూ, వీడియోలూ తీయించుకోడం, పేపర్లలోనూ, టీవీల్లోనూ అవి వచ్చేలా చూసుకోవడం! నిజంగా "సన్మానితుడికి" వాటివల్ల వుపయోగం యేమైనా వుందా? నిజంగా ఆయన్ని వాటితో గౌరవించినట్టేనా? అని యెవరూ ఆలోచించరు. 

మొన్నీమధ్య మావూళ్లో గురు సహస్రావధానిగారికి సన్మానం చేస్తే, ఒకే రోజున 29 శాలువాలు కప్పారు! (ఆయన అవన్నీ యేమిచేసుకొన్నాడో?)

మొన్న "పబ్లిసిటీ ఈశ్వర్" కి "నంది" బహుమతి వస్తే, ఆయనకొచ్చిన జ్ఞాపికలన్ని ఓ గోడలా పేర్చి, ముందు ఆయన్ని కూర్చోపెట్టి, ఫోటో తీసి పేపర్లలో వేశారు. (ఇన్నాళ్లూ ఆయన ఒక్కసారైనా ఆ జ్ఞాపికలన్నీ చూసుకొని, యేది యెప్పుడు వచ్చిందో తలుచుకొని, ఆనందించాడనుకోను.)

సరే......ఇవన్నీ అలా వుంటే, ఇంకో పెద్దాయన సుమారు ఓ మూడునాలుగేళ్లుగా--పురాణేతిహాసాలనుంచి - విద్యార్థుల వ్యక్తిత్వ వికాసం వరకూ, సాయిబాబా నుంచి - పుంతలో ముసలమ్మ వరకూ--అనర్గళంగా ప్రవచనాలు చెపుతున్నారు. ఉదయం నుంచీ అర్థరాత్రివరకూ యేదో ఓ టీవీ ఛానెల్లో ఈయన ప్రవచనాలు వినిపిస్తూనే వుంటున్నాయి.

అసలే ఆయనది "ఉచ్చైస్వరం". మైకూ స్పీకర్లూ లేకపోయినా చివరకూర్చున్నవాళ్లక్కూడా వినిపిస్తుంది ఆయన గొంతు. కానీ టీవీల్లో, ఆయన అసలే చాలా వేగంగా మాట్లాడడంతో, స్పష్టతలోపించి, కాస్త యెక్కువ సౌండ్ పెడితేగానీ సరిగ్గా అర్థం అవదనుకుంటా. ఉదయం, సాయంత్రం "వాకింగు" కి వెళుతూండేవాళ్లకి వీధులోకి గట్టిగా ప్రతీ ఇంట్లోంచీ ఆయన గొంతు వినిపిస్తూనే వుంటుంది.

పాపం ఆయన యేవిధమైన ప్రతిఫలం పుచ్చుకోరట. తన స్వంత వాహనంలో, స్వంత ఖర్చులతోనే వెళ్లి ప్రవచిస్తారట. 

అంతవరకూ బాగానే వుంది. ఇప్పుడు ఆయన ప్రవచనాలని సీడీల్లో, డీవీడీల్లో రికార్డు చేసి, వీధి గుళ్లలో వుదయం, సాయంత్రం వాయించేస్తున్నారు! మరి దానికి ఆయన అనుమతి యేమైనా వుంటుందని నేననుకోను.

అదృష్టవశాత్తూ, మనకన్నీ "పవిత్రమైన" మాసాలూ, "పవిత్రమైన" రోజులూ వుండడంతో ఆ గుళ్లలో ప్రతీరోజూ రెండు పూటలా ఘంటసాల భగవద్గీతో, ఎం ఎస్ రామారావు సుందరకాండో, పాత ఘంటసాల సినిమా భక్తి పాటలో, తరవాత అన్నమయ్యా, రామదాసూ, రామరాజ్యం సినిమా పాటలో వాయిస్తూ వుండేవారు. ఇప్పుడు లేటెస్ట్ ఈ ప్రవచనాలు.

ఆ చుట్టుప్రక్కల ఇళ్లలో వయో వృధ్ధులూ, బీపీ, హార్ట్ పేషెంట్లూ వుంటే వాళ్ల తాలూకువాళ్లు వెళ్లి కాస్త సౌండ్ తగ్గించమని వేడుకొంటే, వెంటనే తగ్గిస్తారు గుడివారు. కానీ మరో ఐదునిమిషాల్లోనే యెవరో "భక్తుడు" వాళ్లని తిట్టేస్తాడు.......వెంటనే సౌండ్ పెంచేస్తాడు!

మరి ఈ శబ్దకాలుష్యాన్ని అరికట్టేది యెవరో? జీవ వైవిధ్యాన్ని, పర్యావరణాన్నీ కాపాడేది యెలాగో? యెవరైనా ఆలోచిస్తున్నారా?

శుభం భూయాత్.

Friday, May 18, 2012

".......ఆచమానాలూ......



........అవస్థలూ"

"కలలు బాగా కనండి......వాటిని సాకారం చేసుకోడానికి ప్రయత్నించండి" అని మన కలామ్ గారు తరచూ ఇచ్చే ప్రవచనం. (ఈయన మరోసారి మన రాష్ట్రపతి కావడంలేదు అని ఈపాటికి రూఢీ అయిపోయినట్టే!) 

(కానీ కలలు కనాలంటే నిద్రపోవాలనీ, నిద్రపట్టాలంటే కడుపు నిండుగా వుండాలి అనీ, "రోజుకి" 22/26 రూపాయలు "తిండీ, బట్టా, ఇతర అవసరాలకోసం" ఖర్చుపెట్టి, సుష్టుగా తిని పడుకొనే "ఆమ్ అద్మీ"కి ఇదెంతవరకూ సాధ్యం అనీ అడక్కండి!)

ఇలా వో సామాన్యుడు అద్భుతమైన కలకన్నాడు. విమానాల్లో "అద్భుతమైన" టాయిలెట్లు యేర్పాటుచేస్తారు. విమానం క్రిందికి దిగాక, ఆ వేస్ట్ ని టాంకు పళంగా తీసుకెళ్లి, ఇంకో టాంకులో పారబోస్తారు. (తరవాత దాన్ని రీసైకిలో యేదో చేస్తారట. ఈ సదుపాయం లేకపోతే అదేదో--పెద్దపులీ, గారెలూ కథలోలా--ప్రజలందరూ దాన్ని భరించే అగత్యం వచ్చుండేది!)

"ఇలాంటి" పర్యావరణ టాయిలెట్లనే మన రైల్వేలు అనుసరిస్తున్నాయట. (ఇన్ ఇండియా ఎవ్విరితింగ్ ఈజ్ ఓపెన్! అని మరిచి, కొన్ని కోట్లు ఖర్చుపెట్టేస్తున్నారు). ఇదో అద్భుతమైన వ్యాపార ఆలోచన!

ఇంక బస్సుల సంగతికి వస్తే, ఆర్ టీ సీ వారికి "బస్ స్టాండ్లూ"; "కాంప్లెక్స్ లూ" వున్నాయి. కొంతవరకూ సరే.

మరి, ప్రైవేటు బస్సులున్నాయి--కేశినేని, దివాకర్, కాళేశ్వరి.......ఇలా.....అన్నీ "లగ్జరీ; సెమీ లగ్జరీ; స్లీపర్; ఏసీ, నాన్ ఏసీ" వగైరా బస్సులని వేల సంఖ్యలో, కొన్ని రెట్ల సొమ్ము టిక్కెట్లగా వసూలు చేస్తూ, లాభాలు దండుకుంటున్నాయి. 

గతిలేక వీటిలో ప్రయాణాలు చేస్తున్నారుగానీ, ప్రయాణీకులు "కట్టు" కట్టగలిగితే......?

"వీటిల్లో ఆ పర్యావరణ టాయిలెట్లని యేర్పాటు చేస్తే వారిమీద పడే భారం యెంత"?

అక్కడిదాకా అఖ్ఖర్లేదు. బస్సులో అందరికీ "అరలీటరు" మినరల్ వాటర్ బాటిళ్లని "వుచితంగా" (టిక్కెట్టులోనే వాటి ధర కలిపేసుకొని) అందిస్తున్నారు. అలా ఇవ్వకపోతే యెవడేడిచాడు? కానీ "ప్రభుత్వ నిబంధన" అలా యేడిచిందట. 

తెల్లవార్లూ టీవీలో డీవీడీలు వెయ్యమని, నిద్రాభంగం చెయ్యమని, యెవడేడిచాడు? (డిటో). 

స్లీపర్లలో కొంచెం నయం. అవసరమైనవాళ్లే చూసేలా, ఇయర్ ఫోన్లతో యేర్పాటు చేస్తున్నారు.

రాత్రి భోజనాలకి అదేదో ముష్టి ధాబా దగ్గర ఆపుతాడు. ఓ పది నిమిషాల వ్యవధిలో ఓ ఐదారు బస్సులు అక్కడే ఆగుతాయి! మనం ముష్టివాళ్లలా, ప్లేట్లు చేత్తో పట్టుకొని, అంతకుముందే కవుంటర్లో డబ్బులిచ్చేసి, టోకెన్లు తీసుకొని, ఆ టిఫిన్ మాస్టర్ ముందు నిల్చుంటే, వాడి దయ కలిగినప్పుడు మనకి ఓ ప్లేటు ఇడ్లీయో, ఓ దోశో, ఓ చపాతీనో అనుగ్రహిస్తాడు (అవీ వుంటేనే!). మళ్లీ కాఫీ కావాలంటే, మళ్లీ టోకెన్, కాఫీ మాస్టర్ ముందు క్యూ! ఈలోగా బస్సు టైము అయిపోయిందని హారన్ లు! వేడితోనూ, కారం తోనూ కాలుతున్న మూతులతో అందరూ బస్సులోకి!

ఇంక ఈ బస్సుల్లో యెవరికైనా టాయిలెట్ అవసరం వస్తే, వాళ్ల అవస్థ వర్ణనాతీతం. స్పీడుగా వెళుతున్న ఆ బస్సులో, పడుతూలేస్తూ, డ్రైవర్ దగ్గరకి వచ్చి ఆపమని అడిగితే, వాడి షెడ్యూల్ ప్రకారం అప్పటికే కొంత లేటుగా నడుస్తూండడంతో (దారిలో లగేజీల లోడింగుకి కొన్ని పావుగంటలు గడిచిపోతాయి మరి!) "అలాగలాగే.....ఆగండి మరి......" అంటూ ఇంకో పది కిలోలు లాగించి, యెప్పుడో ఆపుతాడు!

ఇంక ప్రొద్దున్నే, అందరూ కాలకృత్యాలు తీర్చుకొనే వేళకి, వాడికి యెక్కడ "అనిపిస్తే" అక్కడ బస్సు ఆపేసి, అక్కడి ధాబాలో ఓ ఖాళీ వాటర్ బాటిల్ నింపుకొని, ఓపెన్ ఎయిర్ లోకి వెళ్లిపోతాడు. (అందరినీ అలాగే చెయ్యమంటాడు! తప్పనివాళ్లు యేమి చేస్తారు?) ఆ ధాబాలో టాయిలెట్లుంటాయి.....కానీ అన్నీ తాళం వేసి వుంటాయి!  యెలాగోలా బ్రష్ వగైరాలు చేసి, కాస్త కాఫీయో యేదో తాగుదామంటే, అక్కడ అవేవీ వుండవు. 

మళ్లీ బస్సెక్కి, యెప్పటికో గమ్యస్థానం!

వీటికి పరిష్కారమే--ఓ అద్భుతమైన వ్యాపార సూచన!

వేచి చూడండి మరి.  

Saturday, May 12, 2012

తెలుగు సెలబ్రిటీలూ......



.......వాణిజ్య ప్రకటనలూ

వెనకటికి మా అన్నగారిలాంటి ఒకాయన "అసలు కిత్తాత్తమి అంటే......" అంటూ అంతకుముందు హిట్ అయిన తన సినిమాలోని మేనరిజం ను అనుకరిస్తూ, ప్రకటనల్లో నటించారు.  అది ఓ సిమెంటు కంపెనీదో యేదో. బాగనే వుంది అని సంతోషించాము. (తరవాత ఆయనతో ప్రకటనల జోలికి యెవరూ వెళ్లినట్టులేదు). 

సాధారణంగా, పెద్ద కంపెనీలు సెలెబ్రిటీలని తమ వుత్పత్తులని అమ్ముకోడానికి ప్రకటనలకి వాడుకొంటూ వాళ్లకీ కొంత సొమ్ము చెల్లిస్తూండడం పరిపాటి అయిపోయింది. 

కొండొకచో అది కోట్ల రుపాయలు దాటి, బ్రాండ్ అంబాసిడర్లు లాంటి కొత్త పేర్లతో చెలామణి అయిపోతోంది. 

మరి ఆ ప్రకటనలు చూసేవాళ్లమాటేమిటి? బిగ్ బీ చెప్పాడనో, షారుఖ్, హృతిక్, సల్మాన్ వగైరాలూ, సచిన్ లాంటివాళ్లూ--వాళ్లు చెప్పారని అవన్నీ కొనేస్తారా? వాళ్లని తమ కుటుంబ సభ్యులతో ఐడెంటిఫై చేసుకొని, అనుసరిస్తారా?

యెప్పుడూ జరగదు. 

అదే మన తెలుగులో, చిరంజీవి, బాల కృష్ణ లాంటివాళ్లని తమ అన్నలుగా, ఇంకొంతమంది పెద్దవాళ్లని బాబాయిలుగా, మామయ్యలుగా, ఇతర బంధువులుగా భావిస్తారు. చిరంజీవి "కూల్ కూల్" అంటే, అది ప్రయత్నించినవాళ్లు కోకొల్లలు!

మరి వీళ్లకి ఈ ప్రకటనల్లో పాల్గొనడం అత్యవసరమా? వాళ్లకి అప్పటికే చక్కని ప్రతిష్ట వుంది. డబ్బు వుంది. ఆదరణ వుంది. మరి ఇంక దేనికోసం ఈ చిలక్కొట్టుళ్లు?

దీపం వుండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనో, ముద్దొచ్చినప్పుడే చంకకెక్కాలి అనో భావించొచ్చు. తమకి చాలా సన్నిహితులైన స్నేహితులో, బంధువులో యెవరో, లేదా ఇతర రకాల వొత్తిళ్లు వచ్చాయనో సమర్థించుకోవచ్చు. కానీ, వాటిని తట్టుకోలేరంటే మనం నమ్మగలమా? రియల్ ఎస్టేట్ వ్యాపారులకి వీళ్ల ప్రచారం అంత అవసరమా?

గరికపాటివారూ, చాగంటివారూ ఫలానా "వుల్లి బ్రదర్స్" వారి జరీ పంచెలూ, కండువాలూ మాత్రమే కొనండి అని ప్రకటనల్లో నటిస్తే.............!!??

పాపం గుమ్మడివారిని అదేదో గొర్రెల ఫారం వాళ్లు ప్రకటనల్లో వుపయోగించుకొని, కొన్ని షేర్లు అంటగట్టి, తరవాత ఆయన్ని తొలగించి, బాగా సంపాదించుకొని బోర్డు తిప్పేశారని, ఆయన ఆ మనో వ్యధతోనే వెళ్లిపోయాడనీ అంటుంటారు. 

మన బాబాయిలూ, మామయ్యలూ, అన్నలూ ఇలాంటివాటికి దూరంగా వుంటే బాగుంటుందని అనుకునే తెలుగువాళ్ల అభిప్రాయాలని వీళ్లు గమనిస్తే బాగుండును.

మీరేమంటారు?

Friday, March 9, 2012

దేశానికి దరిద్రం.......



.......యెప్పటికి వదిలేనో?

సగం దరిద్రం వదిలింది. 5 రాష్ట్రాల్లో, ఒక్క వేలెడంతకూడా లేని ఓ రాష్ట్రంలో మాత్రమే అధికారం మళ్లీ దక్కింది కాంగీలకి.

ఇంక రాహుల్ అజ్ఞాతంలోకి వెళ్లిపోతే బాగుండును--యే 2034 వరకో--అప్పటికి కాస్త సీనియారిటీ వస్తుంది!

రేపు మనరాష్ట్ర వుపయెన్నికల్లో కాంగీలూ, తెరాసాలూ పోతే, ఇంకో పావు వంతు దరిద్రం తీరుతుంది.

మిగితా పావు, 2014 లో చూద్దాం!

కానీ, వోటర్లూ, అవినీతి ములాయం ప్రథాని అవ్వాలనీ, తాను ముఖ్యమంత్రి అవ్వాలనీ అఖిలేష్ లాంటివాళ్లు చేస్తున్న రాజకీయాల విషయం లో జాగ్రత్త వహించండి!

సోనియా మాత్రం, రెట్టించిన వుత్సాహంతో, కొన్ని లక్షల కోట్ల "ఖర్చు" కాగల పథకాలమీద పథకాలని వదుల్తోంది! అదేదో జాతీయ సలహా మండలి కి ఆవిడ కుర్చీమనిషో యేదో అనుకుంటా! 

తాజాగా 20 కోట్ల కుటుంబాలకి ఆరోగ్య అదేదో పథకంట. మరణం, అంగవైకల్య బీమా, గర్భిణులకు ఆర్థిక సాయం, ఆరోగ్య బీమా, పింఛన్లూ ఇస్తారట.

బీమా ప్రీమియం యెవరు కడతారు? ఇంకెవరు--ప్రభుత్వమే! 

ముఖ్యంగా, 20 కోట్ల కుటుంబాల్లో, స్త్రీలు గర్భిణులుగా వుంటే, ఒక్కొక్కరికీ నెలకి వెయ్యి రూపాయల చొప్పున, ఓ ఆరునెలలపాటు చెల్లిస్తారట! (యేడాదిలో "దీనికే" యెన్ని కోట్లవుతుందంటారు?)

పాపం.....మన్మోహనూ, ఇతర మంత్రులూ ఓ తడికలాంటి అటకమీద ఒకళ్లమీద ఒకళ్లు పడివున్నారు--క్రింద ప్రణబ్ తో--మధ్యలో యెక్కడో వీళ్లమీద రహస్య గూఢచర్యం సాగిస్తున్న పిచ్చిదంబరం తో! మన్మోహన్ అప్పుడప్పుడూ తన తలపాగాలోంచి ఓ కుందేలునో, పిల్లినో తీస్తూంటాడు--చిల్లర వ్యాపారంలో ఎఫ్ డీ ఐ; జోక్ పాల్; అదేదో జాతీయ భద్రతా దళం--అంటూ! వెంటనే, క్రిందనుంచి కమ్యూనిస్టులూ, అన్నా హజారేలూ, ప్రతిపక్షాలూ పొడుస్తారు!

ఈలోపల పైనుంచి ఇలాంటి బండలు వేస్తూంటుంది సోనియా! 

మన్మోహన్--"ఒక్క క్షణం......ఒక్క క్షణం......మోయలేని ఈ హాయిని మోయనీ!" అని పరవశిస్తూంటే, పాపం ప్రణబ్......"నీ హాయి మండా! నీకేం? పదవిలో వున్నావు! యేమీ లేకుండా, ఇంత గాడిద బరువు యెలా మొయ్యాలా అని నాకు నిద్రకూడా పట్టడంలేదురా బాబూ!!!!!" అంటూ మొత్తుకుంటున్నాడు.

ఈ దేశం, ఈ ప్రభుత్వం యెటు వెళుతున్నాయో? 

వాటికి దిశానిర్దేశం (పాతాళం లోకి) చెయ్యడానికి సిధ్ధపడుతున్నారా?

ఓకే!

శుభమస్తు!

Monday, February 27, 2012

ప్రభుత్వ 'క్రీడలూ'.......



......వాటి 'ఉధ్ధరణా'

"ఆలూలేదు, చూలూ లేదు......" అని సామెత. 

ఇప్పుడు "కర్రాలేదు, బిళ్లాలేదు, గూటేబిళ్లాట ప్రోత్సాహం కొసం ఔట్ డోర్ స్టేడియం కట్టిస్తానన్నారట" అని కొత్త సామెత.

"పంచాయతీ యువ క్రీడా అభ్యుదయం" అనో యేదో పేరుని "పైకా" గా వ్యవహరిస్తూ, అన్ని పంచాయతీల్లోనూ అనేక 'భవనాలు' నిర్మించేస్తున్నారు--లక్షల ఖర్చుతో!

భవనం అంటే యెంతా? ఓ 6 X 6 అడుగుల గదికి పైన స్లాబూ, ఓ గుమ్మం, దానికో తలుపూ, ముందు రెండు మెట్లూ!

మా నరసాపురం మండలం లోని సీతారాంపురం జిల్లా పరిషత్ పాఠశాలలో, ఈ పైకా భవనం లో, మధ్యాహ్న భోజన పథకానికి వంటలు చేసే సామాగ్రిని భద్రపరుస్తున్నారట!

ఆ ప్రథానోపాధ్యాయుణ్నడిగితే, "నా బొంద! భద్రపరచడానికి 'క్రీడా సామాగ్రి' అంటూ వుంటేగా! యెలాగూ మధ్యాహ్న భోజనాలకి వంటలకి ఓ షెడ్డూలేదు, సామానుకోసం ఓ స్టోర్ రూమూ లేదు. అందుకని ఈ భవనాన్ని 'ఇలా' వాడుకుంటున్నాము!" అని నిజాలని కక్కేశాడట. పాపం ఆయన మాత్రం యేం చెయ్యగలడు?

ఖో ఖో లాంటి ఆట కోసం ఓ రెండు చెక్క స్థంభాలని పాతించే దిక్కులేదు. తరతరాలుగా అవే బంతులతో మన యువ క్రీడాకారులు, కాళ్లకి బూట్లు కూడా లేకుండా, ఫుట్ బాలూ, వాలీబాలూ ఆడుకుంటున్నారు. హాకీ, క్రికెట్ ల సంగతి చెప్పనక్కరలేదు--రాళ్లనే వికెట్లుగా.......ఇలా! (యెన్నికలముందు మాత్రం రహస్యమార్గాల్లో ఈ కిట్లు తరలి వస్తూంటాయి--యువ వోటర్ల కోసం)

ఈ తతంగాలు ఇలా సాగుతుంటే, మొన్న మన రాష్ట్ర బడ్జెట్లో, ఇదివరకెన్నడూ లేనివిధంగా క్రీడలకోసం 200 కోట్లు కేటాయించి, "ప్రతి నియోజక వర్గం లోనూ కనీసం ఒక స్టేడియం నిర్మిస్తాము. అదీ మా ఘనత" అని డబ్బా కొట్టుకున్న మంత్రినేమనాలి? 

ఇలాంటి మూర్ఖ పథకాలతో ముందుకు సాగుతున్న ప్రభుత్వాలని మళ్లీ నెత్తికెత్తుకోవాలా? (వాళ్లు మూర్ఖులు అనుకుంటే, మనమే మూర్ఖులం. యెందుకంటే, వాళ్ల కార్యకర్తలకీ, ప్రభుత్వాలకీ జరగవలసిన మేళ్లు వీటిద్వారానేకదా జరుగుతున్నది!)

ఆలోచించండి.

Friday, February 24, 2012

తెలుగుకే యెందుకు......



........తెగులు?

మొన్న అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా "మళ్లీ" పెద్దలు తెగబాధపడిపోయారు--తెలుగు భాషాభివృధ్ధి జరగడం లేదు--అంటూ.

క్రితంతో పోలిస్తే, 30% మంది తెలుగుకు దూరమయ్యారని నిన్న జరిగిన ఇంకో సభలో వారెవరో ప్రకటించారు.

చంద్రబాబుతోసహా, 'తెలుగులో మాట్లాడినందుకు శిక్ష పొందా'నని చెప్పిన కి కు రె తో సహా, అనేకమంది నాయకులూ, పండితులూ, పాత్రికేయులూ ఇలాంటి వేదికలమీద తెలుగు గురించి బాధపడడం మనకి మంచి స్పూర్తినిస్తుంది. సహజమే కదా? చాలా సంతోషం.

అభివృధ్ధి సంగతి ఆ పైవాడెరుగు. అసలు మన భాష మృత భాషల్లో చేరకుండా వుండడానికి యెవరెలా దోహదం చెయ్యాలి?

టీవీల్లో "ఒక నిమిషంపాటు ఇంగ్లీషు మాట లేకుండా యేదైనా మాట్లాడండి" అని జనాలని అడగడం ద్వారానా?
ఫైళ్లని దస్త్రాలు అనీ, కాంట్రాక్టర్లని గుత్తేదారులు అనీ, ఇలా మార్చుకోవడం ద్వారానా?
స్కూళ్లలో ముందు వుపాధ్యాయులకీ, తరవాత విద్యార్థులకీ, వేయ్యేళ్ళ తెలుగు సాహిత్యం తో తలంటడం ద్వారానా? ఓ శాఖ యేర్పరచి, ఓ మంత్రిని నియమించడం ద్వారానా?
అభాసం (అధికార భాషా సంఘం), అకాడమీ వగైరాలని పునరుధ్ధరించడం ద్వారానా?
అసెంబ్లీలో స్పీకరూ, సభ్యులూ తెలుగులో మాట్లాడడం ద్వారానా? (ఇప్పుడదే చేస్తున్నార్లెండి--నువ్వు వెధవ, నువ్వు నాకంటే వెధవ--అంటూ)
క్రొత్త క్రొత్త "ఫాంట్"లూ, సాఫ్ట్ వేరూ కనిపెట్టడం ద్వారానా?
అనేక తీర్మానాలు "యేకగ్రీవంగా" ఆమోదించడం ద్వారానా? 

ఇలా చాలా చాలా మార్గాలున్నాయి.

అన్నింటికన్నా ముఖ్యమైనది--నాతో యేకీభవించిన (ఆయనతో నేనే యేకీభవించానేమో) సి నా రె చెప్పినట్టు--"సాంకేతిక పదాలైన" బస్సు, రైలు, రోడ్డు ల జోలికి పోకుండా మిగతా మాటలైనా తెలుగులో మాట్లాడాలని చేసిన సూచన!

(ఇవి సాంకేతిక పదాలు కాదుగానీ, ఆయన అలా అనకపోయినా, ఆ విలేఖరి అలా వ్రాసి వుంటాడు--అది కూడా మన తెలుగు దౌర్భాగ్యమే!). సరే.

ముందు మన విద్యార్థుల దగ్గరకీ, తరవాత వుద్యోగులూ వగైరాల దగ్గరకీ వెళదాం.

ఎస్ ఎస్ కే భగవాన్ అనే ఆయన రూపొందించి, ఈనాడు పత్రికలో ప్రచురించబడ్డ, పదో తరగతి "మోడల్" ప్రశ్నా పత్రం గమనిస్తే--పేపర్ - I లో పార్ట్స్ ఏ & బీ ల్లో ఒకదాంట్లో పదీ, ఇంకోదాంట్లో 19 (మొత్తం 29) "జవాబులు" వ్రాయాలి విద్యార్థులు. సమయం 2.30 గంటలు, మొత్తం మార్కులు 50.

పేపర్ - II లో మళ్లీ పార్ట్స్ ఏ & బీ ల్లో, ఒకదాంట్లో 11, ఇంకోదాంట్లో 19 (మొత్తం 30) "జవాబులు" వ్రాయాలి వారే. సమయం 2.30 గంటలు, మొత్తం మార్కులు 50.

రెండు తెలుగు పేపర్లకీ కలిపి 100 మార్కులు తెచ్చుకోడానికి, 59 జవాబులివ్వాలి. (ఇదేమి లెఖ్ఖ అని నన్నడగకండి!)

ఇంక, ప్రశ్నలు--ఒక పద్యానికి "ప్రతిపదార్థం" వ్రాయడం, ఒక పద్యానికి "పద్యభావం" వ్రాయడం, ఓ రెండు  వాక్యాలకి "అర్థ, సందర్భం" వ్రాయడం, ఓ పద్యాన్ని "పాదభంగం" లేకుండా వ్రాయడం, ఓ నాలుగు టాపిక్కులమీద వాక్యాలకి, పదివాక్యాలు మించకుండా సమాధానం వ్రాయడం, ఓ సాహిత్య "ప్రక్రియ" గురించి "తెలపడం" తో పార్ట్ ఏ ముగుస్తుంది.

పార్ట్ బీ లో, భాషగురించీ, వ్యాకరణం--సంధులూ, సమాసాలూ, అలంకారాలూ వగైరా.

ఇంక పేపర్ 2 లో, పార్ట్ ఏ అంతా-- నాన్‌డిటెయిల్డ్ అనుకుంటా (బారిష్టర్ పార్వతీశం) గురించి. రెండోభాగంలో వ్యాస రచన, లేఖలు, జాతీయాలని సొంతవాక్యాల్లో ప్రయోగించడం.

పార్ట్ బీ లో మొదటి భాగం పాసేజ్ చదివి ప్రశ్నలకి జవాబులు వ్రాయడం, పద్యాన్ని చదివి, ప్రశ్నలకి జవాబు వ్రాయడం, రెండో భాగం లో ఆధునిక వాక్యంలోకి మార్చి వ్రాయడం, క్రియనుమార్చి, వ్యతిరేకార్థం వచ్చేలా వ్రాయడం, డైరెక్ట్, ఇండైరెక్ట్ స్పీచ్ లూ, సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్ లూ, జాతీయాల వివరణా.

దాంతో పరీక్ష ముగుస్తుంది.

ఇక్కడొక విషయం. చిన్నప్పణ్నించీ వాళ్లకి తెలుగు సరిగ్గా నేర్పకుండా, పదో తరగతిలో ఇంత పరీక్ష అవసరమా?

ఓ ప్రక్క హెడ్ మేష్టర్లూ, టీచర్లూ గోల పెట్టేస్తున్నారు--రిజల్టు శాతం పెరగకపోతే, మీ పీకలు కోస్తాం అన్నంతగా బెదిరిస్తున్నారు అని. (అందుకే చాలా స్కూళ్లలో పుస్తకాలూ, గైడ్లూ  పెట్టేసుకొనో, సమాధానాలు వాళ్లే చెప్పేసో మమ అనిపిస్తున్నారు!)

ఇంక పరీక్షల్లోని ప్రశ్నలు చూస్తే, పేపరు ఇచ్చేవాళ్ల పాండిత్యం అంతా ప్రదర్శిస్తాయిగానీ, వాటివల్ల విద్యార్థికో, అభ్యర్థికో యేమైనా వుపయోగం వుంటుందా అని ఆలోచించరు.

విద్యార్థుల పరిస్థితి ఇలా వుంటే, అధ్యాపకుల బీ ఎడ్, డీ ఎడ్ లాంటివాటిలో, తెలుగుభాషాధ్యాపకులకి ఇచ్చే ప్రశ్నలలో, కనీసం 25% కి కూడా--తెలుగుమీద మంచి ఆధిపత్యం వున్నవాళ్లుకూడా--ఇదీ సరైన సమాధానం అని ఖచ్చితంగా చెప్పలేరు! దీనికితోడు, చిత్ర విచిత్రమైన సమాధానాలు ఇచ్చి, వాటిలో సరైనది గుర్తించండి అంటారు!

"ఉపమా కాళిదాసస్య...." అంటే, కాళిదాసుకు ఉప్మా చాలా ఇష్టమట అనో, ఉప్మా చాలా బాగా వండుతాడు అనో చెపుతున్న అధ్యాపకులున్న రోజులు ఇవి! (వీళ్లకన్నా, గణపతి చెప్పిన "శ్రీరామ చారు....." భావం ప్రకారం ఆయనే మెరుగేమో!)

"ఉపమా పూర్వక రూపకాలంకారం", "అర్థాంతరన్యాస పూర్వక ఉపమాలంకారం" లాంటివి కూడా వింటున్నాము.

వుద్యోగులకి--ఉదాహరణకి--వీ ఆర్ వో/వీ ఆర్ ఏ లకి సూచిస్తున్నవాటిలో, చరిత్రలో చాలా ఘోరమైన సిలబస్ వుంది(ట).

"త్రిసముద్రతోయ పీతవాహనుడు" అంటే యెవరో మీకు తెలుసా? ఆ పదాలకి అర్థం అయినా తెలుసా? (మూడుసముద్రాల్లోని నీళ్లలో వుండే పీతలన్నీ వాహనాలుగా కలవాడు....ద్విగు సహిత, షష్టీ తత్పురుష పూర్వక బహువ్రీహి సమాసం అనిమాత్రం చెప్పెయ్యకండి! అది గౌతమీపుత్ర శాతకర్ణి బిరుదుట.)

మరి, తెలుగు పేరు చెపితేనే జనాలు పారిపోరూ?

ఆలోచించండి.

Thursday, January 26, 2012

వేలం వెఱ్ఱులకి పరాకాష్ట......



.........దీన్ని "కొలవెర్రి" అంటే సరిపోతుందేమో!

"వై దిస్ కొలవెరి....." పాట గురించి ప్రత్యేకంగా వ్రాయఖ్ఖర్లేదు. ఆ పాటకి సంగీత దర్శకత్వం వహించిన 18 యేళ్ల కుర్రవాడికి నచ్చింది అని చెపుతున్న, నాక్కూడా నచ్చిన ఓ పాట గురించి వ్రాస్తున్నాను.

చాలా యేళ్లుగా, మన సినిమాల్లో వస్తున్న "డోఁయ్, డోఁయ్; సోఁయ్, సోఁయ్, టియ్యాఁ, టియ్యాఁ" లాంటి స్వరాలతో, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, పంజాబీ, కొంకిణీ లాంటి మన భాషలేకాకుండా, ఫ్రెంచ్, ఇటాలియన్, అరబిక్, జపనీస్ వగైరా భాషా పదాలతో, అదేదో తంత్రీ వాయిద్యమో, నిస్తంత్రీ వాయిద్యమో పాడేవాళ్ల గొంతుల్లో నొక్కేసి, వాళ్లే పాడుతున్నట్టు భ్రమ కలిగిస్తూ రికార్డింగు చేస్తున్న పాటలు--పొరపాటున చెవినిబడి, సంగీతమంటేనే విరక్తి కలిగిన వాళ్లకి కూడా ఈ పాట నచ్చుతుందని నేననుకుంటా. 

ఆ పాట "సారొత్తారొత్తారా........"!  అమ్మాయి గొంతులో చక్కగా వినిపిస్తున్న ఆ పాటలో, సడెన్‌గా ముళ్లపంది గొంతుతో ఓ మగాడు పాడడం మాత్రం నాకు నచ్చలేదు. 

యెందుకో, ఈ పాట వింటూంటే, మా చిన్నప్పుడు విన్న అదేదో సినిమాలోని "అన్నా అన్నా విన్నావా? చిన్నీ కృష్ణుడు వచ్చాడు, వెన్నల దొంగా వచ్చాడూ, వన్నెల చెలికాడొచ్చాడు....." అనే అనుకుంటా.....సాగే పాట గుర్తొచ్చింది. అదీ ఇదీ ఒకే రాగంలో వున్నాయేమో, ఎస్పీ బాలు లాంటివాళ్లు "పాడుతా తీయగా"లో చెప్పాలి.

ఇంక, "కొలవెర్రుల" గురించి చెప్పాలంటే, మన మీడియా పుణ్యమా అని, మన పండగలూ, మన సాంప్రదాయాలూ వగైరాల పేరుతో, అమెరికాలో కూడా "గ్లేజ్డ్ టైల్స్" ఫ్లోరింగులని కూడా పేడతో అలికేసి, ముగ్గులు పెట్టేస్తున్నారట. ఇంకా కొంతమంది గంగిరెద్దులవాళ్ల, హరిదాసుల వేషాలు కూడా వేసేస్తున్నారట.

మొన్నొకాయన సింగపూరు నుంచి తిరిగి వస్తూ, రైల్లో కలిశారు. ఆయన విన్న మాట--దుమ్ము కణం కూడా యెక్కడా కనిపించని సింగపూరులో ఇలాంటి ప్రయత్నాలు చేసిన తెలుగోళ్లకి భారీ లెవెల్లో డాలర్లలో జరిమానాలు వడ్డించారట! 

సరే. బాగానే వుంది. ఇంకో కొలవెర్రి సోకాల్డ్ "దేశ భక్తి"!

నిన్న గణతంత్ర దినోత్సవం సందర్భంగా, అనేక చోట్ల వంద అడుగుల; వెయ్యి మీటర్ల; 3.1 కిలోమీటర్ల పొడుగున్నవీ, 400 మీటర్లూ వగైరా వైశాల్యమున్నవీ త్రివర్ణ పతాకాల ప్రదర్శనలూ, సామూహిక "జనగణమన" లూ కానిచ్చేశారు.

మా ఆకివీడులో అయితే, లయన్స్ వగైరా క్లబ్బులవాళ్లు, యథాశక్తి, 100 అడుగుల పొడుగు జండాని వూరేగించి, 14 వేలకి పైగా పిల్లలతో, 37 సార్లో యెన్నో ఆ గీతాన్ని పాడించి, "గిన్నిస్" రికార్డు సాధించారట! యెందుకు అంటే, ఆకివీడు పేరు ఆ పుస్తకంలో కనిపించాలనే తాపత్రయమేనట!

వుదయం 8-00 నుంచీ చుట్టుప్రక్కల వూళ్లనుంచి స్కూలు పిల్లలని పోగేసి, (వాళ్లని యెండలో మాడుస్తూ, ఆకలి దప్పులకి గురిచేస్తూ, కాల కృత్యాలు తీర్చుకునే వెసులుబాటు కూడా లేక వాళ్లని హింసిస్తూ), తీరిగ్గా యే 12-00 గంటలకో "ప్రజా ప్రతినిధులు" జండా యెగరేసి, గీతాలాపన మొదలెట్టి, ఓ గంటో యెంతో సాగించి, మొత్తానికి "రికార్డు"కెక్కేశారు(ట). 

ఇలాంటి వారిమీద మానవహక్కుల కమిషన్లు "సువో మోటో" గా కేసులు బనాయిస్తే బాగుండును.

(మరి ఇవాళ ఆ జండాల పరిస్థితి యేమిటి అని మీడియావాళ్లు ఆరా తీసి, మళ్లీ ఫోటోలూ, వీడియోలూ ప్రచురిస్తే ఇంకా బాగుండును).

ఇంక, ఈ సోకాల్డ్ సేవా సంస్థలు మా "సన్యాసి రావు" నుంచి నేర్చుకోవలసింది యెంతో వుంది అంటే కాదంటారా?    

ఆయనెవరో కవిగారు "కల్లు మానండోయ్, బాబూ కళ్లు తెరవండోయ్" అన్నట్టు, ఇప్పుడు "వెర్రి మానండోయ్" అని పాడాలనిపించడం లేదూ?