haaram logo

Tuesday, November 28, 2017

ఆణిముత్యాలు కావాలి......2


"......వడ్లూ, మట్టి బెడ్డలూ....." -- (-1)



(బియ్యంలో వడ్లూ, మట్టిబెడ్డలూ అంటే......ఈ కాలం వాళ్లకి చాలామందికి తెలియదు! అందుకే ఈ "నేపథ్య" వివరణ. నా వివరణలో ఏమైనా లోపాలు వున్నా, సవరణలు వున్నా, పెద్దలు ఎవరైనా సూచిస్తే సంతోషిస్తాను)



గోదావరి మీద ఆనకట్ట కట్టాక, స్వాతంత్ర్యం వచ్చేనాటికి, గోదావరి జిల్లాల్లో భూములు మాగాణులయ్యేనాటికి "అక్కుళ్లు" అనే రకం బియ్యం పండించేవారు. సామాన్యంగా అందరూ వాటినే వండుకు తినేవారు. కొంచెం ధనవంతులు "కృష్ణకాటుకులు" అనే రకం బియ్యం తినేవారు. అవి అక్కడక్కడా పండేవి. ఇంక, లక్షాధికారులు మాత్రం, "బంగారు తీగెలు" అనే రకం బియ్యం వండించుకు తినేవారు. ఈ రకం ఎక్కడ పండేవో.....లేదా దిగుమతి చేసుకునేవారో నాకు తెలియదు.

 ఆ రోజుల్లో, ఎకరానికి 7 బస్తాలు పండితే చాలా గొప్ప!
60 లలో అనుకుంటా--సస్య విప్లవంలో భాగంగా, ఐ ఆర్ 8 అనే రకం వచ్చాయి. ఎకరానికి దిగుబడి 18 నుంచి 20 బస్తాలదాకా పెరిగింది. తరువాత క్రమంగా హంస లాంటి రకాలు, తరువాత మసూరి వచ్చాయి. అప్పటికి అంటే 1980 నాటికి మా జిల్లాల్లో, ఎకరం ఖరీదు ఒక లక్ష. అదే శ్రీకాకుళం లాంటి జిల్లాల్లో, ఎకరం పదివేలు!

ఇంతకీ, అప్పటివరకూ ధాన్యాన్ని పొలాల్లోనే కళ్లాల్లో నూర్చి, ధాన్యాన్ని అమ్మేవారు. అందుకే బియ్యం ఆడినా, వాటిలో కొన్ని వడ్లు నలగకుండా మిగిలిపోయేవి, కొన్ని మట్టి బెడ్డలూ కలిసిపోయేవి.
గృహిణులు, బస్తా బియ్యం తెచ్చుకుంటే, రోజూ మధ్యాహ్నం వేళ ఓ కుంచెడో ఎన్నో, చేటల్లో పోసుకుని, వడ్లూ బెడ్డలూ ఏరుకునేవారు. అదే వారికి ఇరుగింటి పొరుగింటి వాళ్లతో కాలక్షేపం కూడా!

90 ల నాటికి, చిన్న పట్టణాల్లో కూడా మినీ సూపర్ బజార్లు వచ్చాయి. వాళ్లే అన్నీ శుభ్రం చేయించి, పేకెట్లలో సీలు చేసి, కొంచెం ఎక్కువ ధరకి అమ్మసాగారు. ఇప్పటికీ అదే జరుగుతోంది కాబట్టి ఈ కాలం వాళ్లకి వడ్లూ బెడ్డల సంగతి తెలియదు.

అన్నట్టు, 1970 ల్లో, కావాలని కొందరు వ్యాపారస్తులు బియ్యంలో రాళ్లు కలపడం అనే మోసానికి పాల్పడేవారు. అప్పుడే ".....కొలిచారు రాళ్లు నాయాళ్లు...." లాంటి పాటలు వచ్చాయి.

ఇంకా చెప్పాలంటే, 1962 లో బియ్యానికి రేషన్ పెట్టారు......చైనా యుధ్ధం వచ్చినప్పుడు. అదే మనదేశంలో రేషన్లకి ప్రారంభం. ఆ తరువాత కూడా, బియ్యం అమ్మడానికి ప్రత్యేకంగా లైసెన్‌స్ వుండేది. తరువాత్తరువాత ఆ లైసెన్‌స్ ఎత్తివేసి, అందరూ బియ్యం అమ్మచ్చు అన్నారు. అక్కణ్నించీ మొదలయ్యాయి బియ్యం కష్టాలు. రకరకాల బియ్యం, కల్తీలు, ఒక్కోచోటా ఒక్కో రేటు........ఇలా.

దీనికి కారణం మాత్రం ఖచ్చితంగా "కాంగీ" యే!

(మరో సారి)  

Monday, November 27, 2017

ఆణి ముత్యాలు కావాలి....

"......వడ్లూ, మట్టి బెడ్డలూ....." -- 1

అన్నం వండాలంటే, బియ్యం లోంచి వీటిని ఏరి పారెయ్యాలి! అలాగే మన వ్యవస్థ లోంచీ....!

ఎందుకు చెప్పొచ్చానంటే, ఇన్నేళ్లనుంచీ రైళ్లలో, విమానాల్లో ప్రయాణిస్తున్నానుగానీ, మనం భోజనం ఆర్డర్ ఇచ్చాక, ఆ ట్రే మన మొఖాన్న పారేసి పోతారు.....తిన్నా, తినక పోయినా మీ ఇష్టం అంటూ! పెట్టింది ఎలా వుంది, ఇంకేమైనా కావాలా అని అడిగిన పాపాన పోయినవాడు ఎవడూ లేడు. నిజంగా ఎవరైనా అలా అడిగితే ఎంత బాగుంటుంది?! నాకైతే, అలా అడిగినవాళ్లని కౌగిలించుకోవాలనిపిస్తుంది. 

మొన్న రాజధానీ ఎక్‌స్ప్రెస్ లో, ఐ ఆర్ సీ టీ సీ కేటరింగ్ అబ్బాయి డిన్నర్ ట్రే లు మామూలుగానే పంచిపెట్టాడు. దాదాపు పూర్తిగా తినే లోగానే, మళ్లీ వచ్చి, అందరినీ అడిగాడు....."సార్! ఇంకేమైనా కావాలా....రొట్టెలుగానీ, అన్నం గానీ...." అంటూ!

అతని పేరు "హరి ఓమ్"! దిగే ముందు అతనికి విషయం చెప్పి, షేక్ హాండ్ ఇచ్చి, తగినంత టిప్ కూడా ఇచ్చాను.

వడ్లూ, బెడ్డలూ ఏరి పారేసిన తరువాత మిగిలే నిఖార్సైన బియ్యం గింజలలో ఒకడు అతను.

అలాంటివాళ్లే కావాలి దేశానికి!

Monday, July 24, 2017

అవినీతీ......

"ద్రోహులు......ఊలిపికట్టెలు.....కాంగీలు......"


అసలు ఆ పరప్పన్న ఎవరో, ఆయనకి ఏ రాజుగారు అగ్రహారం ఇచ్చాడో, అందులో అంత పెద్ద భవనం ఎందుకు కట్టారో, దాన్ని జైలు గా ఎందుకు మార్చారో.....నాకు తెలీదు గానీ, అది తరచూ వార్తల్లో ఉంటుంది!

మొన్న దక్షిణభారత అవినీతి మహారాఙ్ఞి గారి నెచ్చెలి కి, ఆ జైల్లో ఓ అంతస్తు మొత్తం, అందులో 5 గదులూ, సకల సౌకర్యాలూ--2 కోట్లు మాత్రమే తీసుకొని మరీ, ఒకాయన కేటాయించారని ఓ జైళ్ల ఉన్నతాధికారిణి పై అధికారికి ఫిర్యాదు చేస్తే, ముఖ్య మంత్రి గారు "క్రమశిక్షణ ఉల్లంఘించావు" అంటూ ఆమెనే బదిలీ చేసి పారేశారు.

పైగా, ఆ జైళ్ల పై అధికారి, జైలుకి వెళ్లి, ఖైదీలతో ఆ అధికారిణికి వ్యతిరేకంగా "ఆందోళన" చేయించారట!

అసలు క్రమశిక్షణ ఉల్లంఘిస్తున్న--ముఖ్యమంత్రులకీ, ఆ జైళ్ల పై అధికారులకీ, 2 కోట్ల అధికారికీ శిక్షలు ఏమిటో......ఎప్పుడో......?

అయినా, ఆ రాణిగారిదీ, ఆవిడ నెచ్చెలిదీ తప్పేముందిలెండి! ధనాన్ని సంపాదించడమే కాదు, దాన్ని అనుభవించాలి, ఇంకొందరికి పంచాలి--అని ప్రవచనకారులు చెప్పే మాటలని తు చ తప్పకుండా ఆచరించడమేగా వాళ్లు చేసింది, చేస్తున్నది!

Thursday, January 19, 2017

పిచ్చి లెఖ్ఖలూ....

"సో కాల్డ్ 'నిపుణులు'....!"

(ఇది 30-12-2016 న ఫేస్ బుక్ లో ప్రచురించినదే......తరువాయి వ్రాయడానికి ముందు ఇక్కడ ప్రచురిస్తున్నాను).

బి కామ్ లో మేథ్స్, ఫిజిక్స్ చదువుకున్న ఎం ఎల్ ఏ నో, మంత్రో, ఏదో వాగితే నవ్వుకుంటాము. కానీ, నిజంగా కామర్స్ లో ఉన్నత విద్యని అభ్యసించిన వారూ, బ్యాంకుల్లో ఉన్నత పదవుల్లో ఉండి, విశ్రామ్తులైన వాళ్లు, ఎం బీ ఏ లు చేసినవాళ్లు కూడా, పిచ్చి లేఖ్ఖలు మాట్లాడితే??!!
అవునయ్యా.... ఓ 500 నోటు పదివేల చేతులు మారినా, ఏ రుసుములూ ఉండవు! నగదు రహితం తో, పదివేల చేతుల్లో, దాదాపు, నీ లెక్కల ప్రకారమే, ఓ లక్ష రూపాయలు సంపాదించుకుంటాడు ఆ బ్యాంకు వాడో, పేటిఎమ్ లాంటి వాడో. (*99# వాడితే, అది లావాదేవీకి 50 పైసలు మాత్రమే... అదీ భవిష్యత్తులో ఎప్పుడో!)
కానీ, గత 70 ఏళ్ళనుంచీ, బిల్లులు లేకుండా వ్యాపారం చేస్తూ, నల్లధనాన్ని పోగేసుకుంటున్న వాళ్ళ లావాదేవీల "పారదర్శకత" తో, దేశానికీ, మనకీ ఎంత మేలు?!
ఉదాహరణకి, అప్పట్లో.... ఓ పదివేలలోపు జనాభా ఉన్న ఊరికి, ఓ మార్వాడీ కొంత సొమ్ముతో వచ్చి, ఓ పెంకుటి షాపు అద్దెకు తీసుకొని, తాకట్టు వ్యాపారం మొదలెట్టాడు. బంగారం వస్తువులు తాకట్టు పెట్టుకొని, ఇచ్చే అప్పు మీద, 100కి, నెలకి, ఒక కానీ మాత్రమే (అప్పట్లో 3 పాత పైసలు) వడ్డీ!
(మరో సారి!)

Thursday, January 12, 2017

"పెద్దనోట్ల రద్దు వ్యవహారం"......6


సరైన ప్రత్యామ్నాయాలు చూపించకుండా......!

(మొన్నటి టపా తరువాయి)



అసలు "సరైన ప్రత్యామ్నాయం" అంటే ఏమిటి? అది దేనికి అవసరం? ఈ విషయాన్ని ఏ నిపుణుడూ వివరించలేదు!

వాళ్ల ఉద్దేశ్యం......రద్దు చేసిన పెద్ద నోట్ల స్థానం లో మళ్లీ అవే నోట్లు ప్రవేశ పెట్టాలి అనా? లేదా, పాత నోట్లు మార్చుకోవలసిన అవసరం లేకుండా, కొత్త నోట్లు ప్రవేశ పెట్టవలసింది అనా? ముందు, ఏటీఎం లు అన్నింటిలోనూ కొత్త నోట్లు నింపేసి, అప్పుడు పాతనొట్లు రద్దు చెయ్యవలసింది అనా? మరేమైనానా? ఏమనుకోవాలి మనం వీళ్ల "నిపుణత"ని?

పైన చెప్పినవాటిలొ ఏది చేసినా, రహస్యం వెల్లడి అయ్యేది! నల్లధనం మొత్తం మాయం అయ్యేది.....మరిన్ని రూపాల్లో! అందుకే హఠాత్తుగా ప్రకటించడం.

1978 లో, 10 వేలు, 5000 నోట్ల రద్దు చేసినప్పుడు--ప్రత్యామ్నాయాలు అసలు లేవు! మార్పిడి అనుమతించబడలేదు! ఏటీఎం లు లేవు! కొత్తగా మరిన్ని చిన్న నోట్లు విరివిగా జారీ చెయ్యడం......లేదు! కేవలం ఆ నోట్లని, బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకోవడమే.....రద్దు నుంచి రక్షణ....అదీ, పూర్తి వివరాలు ధృవీకరణ పత్రం లో వ్రాసి, సంతకాలు చేశాక!

మరి ఈ సారి అలా ఎందుకు చెయ్యలేదు.....అంటే, అప్పట్లో చెలామణీ లో ఉన్న నోట్లే, తక్కువ. వాటిలో 10000 నోట్లు , 5000 నోట్ల కంటే చాలా, చాలా తక్కువ! అందుకే, 10 వేల నోట్లు బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకున్నారు. 5 వేల నోట్లు పెద్ద సంఖ్యలోనే డిపాజిట్ చేసుకున్నారు. మిగిలినవాటిని, వివరాలు చెప్పలేనివాటిని, సిగరెట్లూ, కుంపట్లూ వెలిగించడానికి ఉపయోగించుకున్నారు!

ఇప్పుడు, అప్పటి కన్నా కొన్ని వేల రెట్లు నోట్లు చెలామణీ లో ఉన్నాయి. అందుకే, మార్పిడి! ఆ మాత్రానికి సంతోషించాలి అందరూ.

(ఇప్పుడు, అన్ని చోట్లా, ఏటీఎం ల ముందు క్యూలు లేవు, బ్యాంకుల్లో పరిమితికి లోబడి, అందరికీ కోరినంత నగదు అందుతూంది! డిజిటల్ లావాదేవిలు పెరిగాయి! ఆ టీవీల, నిపుణుల నోళ్లు మూతపడ్డాయి!)

(......మరోసారి)