haaram logo

Friday, March 9, 2012

దేశానికి దరిద్రం.......



.......యెప్పటికి వదిలేనో?

సగం దరిద్రం వదిలింది. 5 రాష్ట్రాల్లో, ఒక్క వేలెడంతకూడా లేని ఓ రాష్ట్రంలో మాత్రమే అధికారం మళ్లీ దక్కింది కాంగీలకి.

ఇంక రాహుల్ అజ్ఞాతంలోకి వెళ్లిపోతే బాగుండును--యే 2034 వరకో--అప్పటికి కాస్త సీనియారిటీ వస్తుంది!

రేపు మనరాష్ట్ర వుపయెన్నికల్లో కాంగీలూ, తెరాసాలూ పోతే, ఇంకో పావు వంతు దరిద్రం తీరుతుంది.

మిగితా పావు, 2014 లో చూద్దాం!

కానీ, వోటర్లూ, అవినీతి ములాయం ప్రథాని అవ్వాలనీ, తాను ముఖ్యమంత్రి అవ్వాలనీ అఖిలేష్ లాంటివాళ్లు చేస్తున్న రాజకీయాల విషయం లో జాగ్రత్త వహించండి!

సోనియా మాత్రం, రెట్టించిన వుత్సాహంతో, కొన్ని లక్షల కోట్ల "ఖర్చు" కాగల పథకాలమీద పథకాలని వదుల్తోంది! అదేదో జాతీయ సలహా మండలి కి ఆవిడ కుర్చీమనిషో యేదో అనుకుంటా! 

తాజాగా 20 కోట్ల కుటుంబాలకి ఆరోగ్య అదేదో పథకంట. మరణం, అంగవైకల్య బీమా, గర్భిణులకు ఆర్థిక సాయం, ఆరోగ్య బీమా, పింఛన్లూ ఇస్తారట.

బీమా ప్రీమియం యెవరు కడతారు? ఇంకెవరు--ప్రభుత్వమే! 

ముఖ్యంగా, 20 కోట్ల కుటుంబాల్లో, స్త్రీలు గర్భిణులుగా వుంటే, ఒక్కొక్కరికీ నెలకి వెయ్యి రూపాయల చొప్పున, ఓ ఆరునెలలపాటు చెల్లిస్తారట! (యేడాదిలో "దీనికే" యెన్ని కోట్లవుతుందంటారు?)

పాపం.....మన్మోహనూ, ఇతర మంత్రులూ ఓ తడికలాంటి అటకమీద ఒకళ్లమీద ఒకళ్లు పడివున్నారు--క్రింద ప్రణబ్ తో--మధ్యలో యెక్కడో వీళ్లమీద రహస్య గూఢచర్యం సాగిస్తున్న పిచ్చిదంబరం తో! మన్మోహన్ అప్పుడప్పుడూ తన తలపాగాలోంచి ఓ కుందేలునో, పిల్లినో తీస్తూంటాడు--చిల్లర వ్యాపారంలో ఎఫ్ డీ ఐ; జోక్ పాల్; అదేదో జాతీయ భద్రతా దళం--అంటూ! వెంటనే, క్రిందనుంచి కమ్యూనిస్టులూ, అన్నా హజారేలూ, ప్రతిపక్షాలూ పొడుస్తారు!

ఈలోపల పైనుంచి ఇలాంటి బండలు వేస్తూంటుంది సోనియా! 

మన్మోహన్--"ఒక్క క్షణం......ఒక్క క్షణం......మోయలేని ఈ హాయిని మోయనీ!" అని పరవశిస్తూంటే, పాపం ప్రణబ్......"నీ హాయి మండా! నీకేం? పదవిలో వున్నావు! యేమీ లేకుండా, ఇంత గాడిద బరువు యెలా మొయ్యాలా అని నాకు నిద్రకూడా పట్టడంలేదురా బాబూ!!!!!" అంటూ మొత్తుకుంటున్నాడు.

ఈ దేశం, ఈ ప్రభుత్వం యెటు వెళుతున్నాయో? 

వాటికి దిశానిర్దేశం (పాతాళం లోకి) చెయ్యడానికి సిధ్ధపడుతున్నారా?

ఓకే!

శుభమస్తు!

Monday, February 27, 2012

ప్రభుత్వ 'క్రీడలూ'.......



......వాటి 'ఉధ్ధరణా'

"ఆలూలేదు, చూలూ లేదు......" అని సామెత. 

ఇప్పుడు "కర్రాలేదు, బిళ్లాలేదు, గూటేబిళ్లాట ప్రోత్సాహం కొసం ఔట్ డోర్ స్టేడియం కట్టిస్తానన్నారట" అని కొత్త సామెత.

"పంచాయతీ యువ క్రీడా అభ్యుదయం" అనో యేదో పేరుని "పైకా" గా వ్యవహరిస్తూ, అన్ని పంచాయతీల్లోనూ అనేక 'భవనాలు' నిర్మించేస్తున్నారు--లక్షల ఖర్చుతో!

భవనం అంటే యెంతా? ఓ 6 X 6 అడుగుల గదికి పైన స్లాబూ, ఓ గుమ్మం, దానికో తలుపూ, ముందు రెండు మెట్లూ!

మా నరసాపురం మండలం లోని సీతారాంపురం జిల్లా పరిషత్ పాఠశాలలో, ఈ పైకా భవనం లో, మధ్యాహ్న భోజన పథకానికి వంటలు చేసే సామాగ్రిని భద్రపరుస్తున్నారట!

ఆ ప్రథానోపాధ్యాయుణ్నడిగితే, "నా బొంద! భద్రపరచడానికి 'క్రీడా సామాగ్రి' అంటూ వుంటేగా! యెలాగూ మధ్యాహ్న భోజనాలకి వంటలకి ఓ షెడ్డూలేదు, సామానుకోసం ఓ స్టోర్ రూమూ లేదు. అందుకని ఈ భవనాన్ని 'ఇలా' వాడుకుంటున్నాము!" అని నిజాలని కక్కేశాడట. పాపం ఆయన మాత్రం యేం చెయ్యగలడు?

ఖో ఖో లాంటి ఆట కోసం ఓ రెండు చెక్క స్థంభాలని పాతించే దిక్కులేదు. తరతరాలుగా అవే బంతులతో మన యువ క్రీడాకారులు, కాళ్లకి బూట్లు కూడా లేకుండా, ఫుట్ బాలూ, వాలీబాలూ ఆడుకుంటున్నారు. హాకీ, క్రికెట్ ల సంగతి చెప్పనక్కరలేదు--రాళ్లనే వికెట్లుగా.......ఇలా! (యెన్నికలముందు మాత్రం రహస్యమార్గాల్లో ఈ కిట్లు తరలి వస్తూంటాయి--యువ వోటర్ల కోసం)

ఈ తతంగాలు ఇలా సాగుతుంటే, మొన్న మన రాష్ట్ర బడ్జెట్లో, ఇదివరకెన్నడూ లేనివిధంగా క్రీడలకోసం 200 కోట్లు కేటాయించి, "ప్రతి నియోజక వర్గం లోనూ కనీసం ఒక స్టేడియం నిర్మిస్తాము. అదీ మా ఘనత" అని డబ్బా కొట్టుకున్న మంత్రినేమనాలి? 

ఇలాంటి మూర్ఖ పథకాలతో ముందుకు సాగుతున్న ప్రభుత్వాలని మళ్లీ నెత్తికెత్తుకోవాలా? (వాళ్లు మూర్ఖులు అనుకుంటే, మనమే మూర్ఖులం. యెందుకంటే, వాళ్ల కార్యకర్తలకీ, ప్రభుత్వాలకీ జరగవలసిన మేళ్లు వీటిద్వారానేకదా జరుగుతున్నది!)

ఆలోచించండి.

Friday, February 24, 2012

తెలుగుకే యెందుకు......



........తెగులు?

మొన్న అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా "మళ్లీ" పెద్దలు తెగబాధపడిపోయారు--తెలుగు భాషాభివృధ్ధి జరగడం లేదు--అంటూ.

క్రితంతో పోలిస్తే, 30% మంది తెలుగుకు దూరమయ్యారని నిన్న జరిగిన ఇంకో సభలో వారెవరో ప్రకటించారు.

చంద్రబాబుతోసహా, 'తెలుగులో మాట్లాడినందుకు శిక్ష పొందా'నని చెప్పిన కి కు రె తో సహా, అనేకమంది నాయకులూ, పండితులూ, పాత్రికేయులూ ఇలాంటి వేదికలమీద తెలుగు గురించి బాధపడడం మనకి మంచి స్పూర్తినిస్తుంది. సహజమే కదా? చాలా సంతోషం.

అభివృధ్ధి సంగతి ఆ పైవాడెరుగు. అసలు మన భాష మృత భాషల్లో చేరకుండా వుండడానికి యెవరెలా దోహదం చెయ్యాలి?

టీవీల్లో "ఒక నిమిషంపాటు ఇంగ్లీషు మాట లేకుండా యేదైనా మాట్లాడండి" అని జనాలని అడగడం ద్వారానా?
ఫైళ్లని దస్త్రాలు అనీ, కాంట్రాక్టర్లని గుత్తేదారులు అనీ, ఇలా మార్చుకోవడం ద్వారానా?
స్కూళ్లలో ముందు వుపాధ్యాయులకీ, తరవాత విద్యార్థులకీ, వేయ్యేళ్ళ తెలుగు సాహిత్యం తో తలంటడం ద్వారానా? ఓ శాఖ యేర్పరచి, ఓ మంత్రిని నియమించడం ద్వారానా?
అభాసం (అధికార భాషా సంఘం), అకాడమీ వగైరాలని పునరుధ్ధరించడం ద్వారానా?
అసెంబ్లీలో స్పీకరూ, సభ్యులూ తెలుగులో మాట్లాడడం ద్వారానా? (ఇప్పుడదే చేస్తున్నార్లెండి--నువ్వు వెధవ, నువ్వు నాకంటే వెధవ--అంటూ)
క్రొత్త క్రొత్త "ఫాంట్"లూ, సాఫ్ట్ వేరూ కనిపెట్టడం ద్వారానా?
అనేక తీర్మానాలు "యేకగ్రీవంగా" ఆమోదించడం ద్వారానా? 

ఇలా చాలా చాలా మార్గాలున్నాయి.

అన్నింటికన్నా ముఖ్యమైనది--నాతో యేకీభవించిన (ఆయనతో నేనే యేకీభవించానేమో) సి నా రె చెప్పినట్టు--"సాంకేతిక పదాలైన" బస్సు, రైలు, రోడ్డు ల జోలికి పోకుండా మిగతా మాటలైనా తెలుగులో మాట్లాడాలని చేసిన సూచన!

(ఇవి సాంకేతిక పదాలు కాదుగానీ, ఆయన అలా అనకపోయినా, ఆ విలేఖరి అలా వ్రాసి వుంటాడు--అది కూడా మన తెలుగు దౌర్భాగ్యమే!). సరే.

ముందు మన విద్యార్థుల దగ్గరకీ, తరవాత వుద్యోగులూ వగైరాల దగ్గరకీ వెళదాం.

ఎస్ ఎస్ కే భగవాన్ అనే ఆయన రూపొందించి, ఈనాడు పత్రికలో ప్రచురించబడ్డ, పదో తరగతి "మోడల్" ప్రశ్నా పత్రం గమనిస్తే--పేపర్ - I లో పార్ట్స్ ఏ & బీ ల్లో ఒకదాంట్లో పదీ, ఇంకోదాంట్లో 19 (మొత్తం 29) "జవాబులు" వ్రాయాలి విద్యార్థులు. సమయం 2.30 గంటలు, మొత్తం మార్కులు 50.

పేపర్ - II లో మళ్లీ పార్ట్స్ ఏ & బీ ల్లో, ఒకదాంట్లో 11, ఇంకోదాంట్లో 19 (మొత్తం 30) "జవాబులు" వ్రాయాలి వారే. సమయం 2.30 గంటలు, మొత్తం మార్కులు 50.

రెండు తెలుగు పేపర్లకీ కలిపి 100 మార్కులు తెచ్చుకోడానికి, 59 జవాబులివ్వాలి. (ఇదేమి లెఖ్ఖ అని నన్నడగకండి!)

ఇంక, ప్రశ్నలు--ఒక పద్యానికి "ప్రతిపదార్థం" వ్రాయడం, ఒక పద్యానికి "పద్యభావం" వ్రాయడం, ఓ రెండు  వాక్యాలకి "అర్థ, సందర్భం" వ్రాయడం, ఓ పద్యాన్ని "పాదభంగం" లేకుండా వ్రాయడం, ఓ నాలుగు టాపిక్కులమీద వాక్యాలకి, పదివాక్యాలు మించకుండా సమాధానం వ్రాయడం, ఓ సాహిత్య "ప్రక్రియ" గురించి "తెలపడం" తో పార్ట్ ఏ ముగుస్తుంది.

పార్ట్ బీ లో, భాషగురించీ, వ్యాకరణం--సంధులూ, సమాసాలూ, అలంకారాలూ వగైరా.

ఇంక పేపర్ 2 లో, పార్ట్ ఏ అంతా-- నాన్‌డిటెయిల్డ్ అనుకుంటా (బారిష్టర్ పార్వతీశం) గురించి. రెండోభాగంలో వ్యాస రచన, లేఖలు, జాతీయాలని సొంతవాక్యాల్లో ప్రయోగించడం.

పార్ట్ బీ లో మొదటి భాగం పాసేజ్ చదివి ప్రశ్నలకి జవాబులు వ్రాయడం, పద్యాన్ని చదివి, ప్రశ్నలకి జవాబు వ్రాయడం, రెండో భాగం లో ఆధునిక వాక్యంలోకి మార్చి వ్రాయడం, క్రియనుమార్చి, వ్యతిరేకార్థం వచ్చేలా వ్రాయడం, డైరెక్ట్, ఇండైరెక్ట్ స్పీచ్ లూ, సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్ లూ, జాతీయాల వివరణా.

దాంతో పరీక్ష ముగుస్తుంది.

ఇక్కడొక విషయం. చిన్నప్పణ్నించీ వాళ్లకి తెలుగు సరిగ్గా నేర్పకుండా, పదో తరగతిలో ఇంత పరీక్ష అవసరమా?

ఓ ప్రక్క హెడ్ మేష్టర్లూ, టీచర్లూ గోల పెట్టేస్తున్నారు--రిజల్టు శాతం పెరగకపోతే, మీ పీకలు కోస్తాం అన్నంతగా బెదిరిస్తున్నారు అని. (అందుకే చాలా స్కూళ్లలో పుస్తకాలూ, గైడ్లూ  పెట్టేసుకొనో, సమాధానాలు వాళ్లే చెప్పేసో మమ అనిపిస్తున్నారు!)

ఇంక పరీక్షల్లోని ప్రశ్నలు చూస్తే, పేపరు ఇచ్చేవాళ్ల పాండిత్యం అంతా ప్రదర్శిస్తాయిగానీ, వాటివల్ల విద్యార్థికో, అభ్యర్థికో యేమైనా వుపయోగం వుంటుందా అని ఆలోచించరు.

విద్యార్థుల పరిస్థితి ఇలా వుంటే, అధ్యాపకుల బీ ఎడ్, డీ ఎడ్ లాంటివాటిలో, తెలుగుభాషాధ్యాపకులకి ఇచ్చే ప్రశ్నలలో, కనీసం 25% కి కూడా--తెలుగుమీద మంచి ఆధిపత్యం వున్నవాళ్లుకూడా--ఇదీ సరైన సమాధానం అని ఖచ్చితంగా చెప్పలేరు! దీనికితోడు, చిత్ర విచిత్రమైన సమాధానాలు ఇచ్చి, వాటిలో సరైనది గుర్తించండి అంటారు!

"ఉపమా కాళిదాసస్య...." అంటే, కాళిదాసుకు ఉప్మా చాలా ఇష్టమట అనో, ఉప్మా చాలా బాగా వండుతాడు అనో చెపుతున్న అధ్యాపకులున్న రోజులు ఇవి! (వీళ్లకన్నా, గణపతి చెప్పిన "శ్రీరామ చారు....." భావం ప్రకారం ఆయనే మెరుగేమో!)

"ఉపమా పూర్వక రూపకాలంకారం", "అర్థాంతరన్యాస పూర్వక ఉపమాలంకారం" లాంటివి కూడా వింటున్నాము.

వుద్యోగులకి--ఉదాహరణకి--వీ ఆర్ వో/వీ ఆర్ ఏ లకి సూచిస్తున్నవాటిలో, చరిత్రలో చాలా ఘోరమైన సిలబస్ వుంది(ట).

"త్రిసముద్రతోయ పీతవాహనుడు" అంటే యెవరో మీకు తెలుసా? ఆ పదాలకి అర్థం అయినా తెలుసా? (మూడుసముద్రాల్లోని నీళ్లలో వుండే పీతలన్నీ వాహనాలుగా కలవాడు....ద్విగు సహిత, షష్టీ తత్పురుష పూర్వక బహువ్రీహి సమాసం అనిమాత్రం చెప్పెయ్యకండి! అది గౌతమీపుత్ర శాతకర్ణి బిరుదుట.)

మరి, తెలుగు పేరు చెపితేనే జనాలు పారిపోరూ?

ఆలోచించండి.

Thursday, January 26, 2012

వేలం వెఱ్ఱులకి పరాకాష్ట......



.........దీన్ని "కొలవెర్రి" అంటే సరిపోతుందేమో!

"వై దిస్ కొలవెరి....." పాట గురించి ప్రత్యేకంగా వ్రాయఖ్ఖర్లేదు. ఆ పాటకి సంగీత దర్శకత్వం వహించిన 18 యేళ్ల కుర్రవాడికి నచ్చింది అని చెపుతున్న, నాక్కూడా నచ్చిన ఓ పాట గురించి వ్రాస్తున్నాను.

చాలా యేళ్లుగా, మన సినిమాల్లో వస్తున్న "డోఁయ్, డోఁయ్; సోఁయ్, సోఁయ్, టియ్యాఁ, టియ్యాఁ" లాంటి స్వరాలతో, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, పంజాబీ, కొంకిణీ లాంటి మన భాషలేకాకుండా, ఫ్రెంచ్, ఇటాలియన్, అరబిక్, జపనీస్ వగైరా భాషా పదాలతో, అదేదో తంత్రీ వాయిద్యమో, నిస్తంత్రీ వాయిద్యమో పాడేవాళ్ల గొంతుల్లో నొక్కేసి, వాళ్లే పాడుతున్నట్టు భ్రమ కలిగిస్తూ రికార్డింగు చేస్తున్న పాటలు--పొరపాటున చెవినిబడి, సంగీతమంటేనే విరక్తి కలిగిన వాళ్లకి కూడా ఈ పాట నచ్చుతుందని నేననుకుంటా. 

ఆ పాట "సారొత్తారొత్తారా........"!  అమ్మాయి గొంతులో చక్కగా వినిపిస్తున్న ఆ పాటలో, సడెన్‌గా ముళ్లపంది గొంతుతో ఓ మగాడు పాడడం మాత్రం నాకు నచ్చలేదు. 

యెందుకో, ఈ పాట వింటూంటే, మా చిన్నప్పుడు విన్న అదేదో సినిమాలోని "అన్నా అన్నా విన్నావా? చిన్నీ కృష్ణుడు వచ్చాడు, వెన్నల దొంగా వచ్చాడూ, వన్నెల చెలికాడొచ్చాడు....." అనే అనుకుంటా.....సాగే పాట గుర్తొచ్చింది. అదీ ఇదీ ఒకే రాగంలో వున్నాయేమో, ఎస్పీ బాలు లాంటివాళ్లు "పాడుతా తీయగా"లో చెప్పాలి.

ఇంక, "కొలవెర్రుల" గురించి చెప్పాలంటే, మన మీడియా పుణ్యమా అని, మన పండగలూ, మన సాంప్రదాయాలూ వగైరాల పేరుతో, అమెరికాలో కూడా "గ్లేజ్డ్ టైల్స్" ఫ్లోరింగులని కూడా పేడతో అలికేసి, ముగ్గులు పెట్టేస్తున్నారట. ఇంకా కొంతమంది గంగిరెద్దులవాళ్ల, హరిదాసుల వేషాలు కూడా వేసేస్తున్నారట.

మొన్నొకాయన సింగపూరు నుంచి తిరిగి వస్తూ, రైల్లో కలిశారు. ఆయన విన్న మాట--దుమ్ము కణం కూడా యెక్కడా కనిపించని సింగపూరులో ఇలాంటి ప్రయత్నాలు చేసిన తెలుగోళ్లకి భారీ లెవెల్లో డాలర్లలో జరిమానాలు వడ్డించారట! 

సరే. బాగానే వుంది. ఇంకో కొలవెర్రి సోకాల్డ్ "దేశ భక్తి"!

నిన్న గణతంత్ర దినోత్సవం సందర్భంగా, అనేక చోట్ల వంద అడుగుల; వెయ్యి మీటర్ల; 3.1 కిలోమీటర్ల పొడుగున్నవీ, 400 మీటర్లూ వగైరా వైశాల్యమున్నవీ త్రివర్ణ పతాకాల ప్రదర్శనలూ, సామూహిక "జనగణమన" లూ కానిచ్చేశారు.

మా ఆకివీడులో అయితే, లయన్స్ వగైరా క్లబ్బులవాళ్లు, యథాశక్తి, 100 అడుగుల పొడుగు జండాని వూరేగించి, 14 వేలకి పైగా పిల్లలతో, 37 సార్లో యెన్నో ఆ గీతాన్ని పాడించి, "గిన్నిస్" రికార్డు సాధించారట! యెందుకు అంటే, ఆకివీడు పేరు ఆ పుస్తకంలో కనిపించాలనే తాపత్రయమేనట!

వుదయం 8-00 నుంచీ చుట్టుప్రక్కల వూళ్లనుంచి స్కూలు పిల్లలని పోగేసి, (వాళ్లని యెండలో మాడుస్తూ, ఆకలి దప్పులకి గురిచేస్తూ, కాల కృత్యాలు తీర్చుకునే వెసులుబాటు కూడా లేక వాళ్లని హింసిస్తూ), తీరిగ్గా యే 12-00 గంటలకో "ప్రజా ప్రతినిధులు" జండా యెగరేసి, గీతాలాపన మొదలెట్టి, ఓ గంటో యెంతో సాగించి, మొత్తానికి "రికార్డు"కెక్కేశారు(ట). 

ఇలాంటి వారిమీద మానవహక్కుల కమిషన్లు "సువో మోటో" గా కేసులు బనాయిస్తే బాగుండును.

(మరి ఇవాళ ఆ జండాల పరిస్థితి యేమిటి అని మీడియావాళ్లు ఆరా తీసి, మళ్లీ ఫోటోలూ, వీడియోలూ ప్రచురిస్తే ఇంకా బాగుండును).

ఇంక, ఈ సోకాల్డ్ సేవా సంస్థలు మా "సన్యాసి రావు" నుంచి నేర్చుకోవలసింది యెంతో వుంది అంటే కాదంటారా?    

ఆయనెవరో కవిగారు "కల్లు మానండోయ్, బాబూ కళ్లు తెరవండోయ్" అన్నట్టు, ఇప్పుడు "వెర్రి మానండోయ్" అని పాడాలనిపించడం లేదూ?

Tuesday, December 27, 2011

యాత్రానుభవాలూ.........


........క్షేత్రానుభవాలూ

తిరిగే కాలూ, తిట్టే నోరూ ఊరికే వుండవుట.
ఈ మధ్య ఓ పెద్దాయన, అమెరికాలో పిల్లలదగ్గర సెటిల్ అవుదామని వెళ్లినవాడు, తూర్పుకి తిరిగి ఓ దణ్ణం పెట్టేసి, ఇండియా వచ్చేసి, తన పెరట్లో మొక్కలు పెంచుకోడం అనే హాబీ తీర్చుకోడం మొదలెట్టాడు.
ఆయన చెప్పిన కారణం అదే! అమెరికాలో ఆ రెండూ బంద్ అయిపోతే, యెంత సేపు గదిలో బందీగా పడివుండగలం? అని.
అలా, మేముకూడా వూళ్లు తిరగడం కొనసాగిస్తున్నాము. ఇప్పుడు చెన్నైలో!
మహామల్లపురం అనే మామల్లపురం అనబడిన మహాబలిపురం వగైరాలూ, అరవిందుడి సమాధీ, వాటిని వెనక్కి తోసి వృధ్ధి చెందిన గణేశాలయం, బీచీ వగైరాలు చూసి, యేలగిరి వెళ్లి, బోటింగూ వగైరాలు చేసి, మురుగన్ నీ, పెరుమాళ్ నీ చూసి, అక్కడ రాత్రి బసచేసి, ప్రొద్దున స్వామిమలై వెళదామని, అంతదూరం నడిచి కొండ యెక్కలేక వెనుదిరిగి, జలపాతాలు చూసి, కొంచెం తడిసి, చెన్నై తిరుగు ప్రయాణంలో, పనిలోపని అని శ్రీపురంలో ఓ బంగారు గుడి వుందని అది చూసేద్దామని వెళ్లాము.
ఆ గుడి గురించి జనాలు చెప్పుకొంటున్నది వింతగా అనిపించింది. ఒకాయన తన వ్యాపారాల్లో భాగంగా అనేక అక్రమాలు, హత్యలు చేయడం చేయించడంతో సహా చేసి, బాగా డబ్బుచేశాక, ఓ గురువుగారి ఉపదేశం పొంది, సంపాదించిన డబ్బంతా వినియోగించి పూర్తిగా (కొన్ని క్వింటాళ్ల) బంగారంతో ఓ అమ్మవారి గుడి కట్టించాడట. ఇప్పుడది తిరుపతీ, శబరిమల లెవెల్లో, మరికాస్త సంపాదించి పెడుతోందట ఆయనకి! ఆయన్ని "శ్రీ శక్తి అమ్మ" (మగ దేవత) అంటున్నారు!
మామూలుగా, క్యూలైన్ లో వెళితే, దర్శనం 3 గంటలు పడుతుందని బోర్డు పెట్టారు. ఒక్కోప్పుడు ఇంకా చాలా తక్కువ సమయం పట్టిన దాఖలాలున్నాయట.
అదేమిటో, మేము వెళ్లినరోజు మాత్రం, బస్సులకొద్దీ జనం—ముఖ్యంగా ఆడవాళ్లు—యెర్రరంగు చీరలు పసుపురంగు పూలతో వున్నవీ, పసుపురంగు అంచుమీద వేపాకుల మండలు డిజైన్ గా కలవీ ధరించి, మగాళ్లు యెర్ర పంచే/పేంటూ, యెర్ర చొక్కాలూ ధరించీ క్యూలూ, కంపార్ట్ మెంటులూ నిండిపోయారు…..ఇంకా వస్తూనే వున్నారు!
మేము ఓ కంపార్ట్ మెంట్ దాకా ప్రవేశించి అప్పటికే ఓ రెండు గంటలు కాగా, ఇంకో నాలుగైదు గంటలు పట్టచ్చు అంటే, వోపికలు నశించి, సెక్యూరిటీ వాడినడిగి, బయటికి వచ్చేశాము.
బయట రోడ్డు మీదనుంచి మూసేసిన ద్వారంలోంచి కనిపిస్తున్న ఆ బంగారు గుడిని చూసేసి, చక్కావచ్చాము.
ఈ సందర్భంలో, నాకు కొన్ని అవిడియాలు మెరిశాయి. అవి మీతో పంచుకోవాలని……ఇలా.
మొన్న త్రిదండి శ్రీమన్నారాయణ చిన జీయర్ స్వామి అననే అన్నాడు—తిరుమలకి వెళ్లేవాళ్లు ఓ క్లబ్బుకి వెళ్లినట్టు వెళుతున్నారు. అందుకే అక్కడ భక్తి భావం లోపిస్తోంది—అని.
అసలు కిటుకు అక్కడే వుంది.
ఈ మధ్య, స్వామి అయ్యప్ప పుణ్యమా అని, భక్తి మాటెలా వున్నా, ప్రతీ దేవుడికీ, దేవతకీ, కుల మత ప్రసక్తి లేకుండా, విచక్షణ లేకుండా, “దీక్షలు” పట్టడం, దీక్ష విరమణకి ఫలానా కొండకో, పుణ్యక్షేత్రానికో వెళ్లడం బాగా యెక్కువైపోయింది.
అందుకని, ఇలాంటి దీక్షలు పట్టేవాళ్లకి నామినల్ గా ఓ 100 రూపాయల టిక్కెట్టు పెట్టేస్తే సరి.
వృధ్ధులూ, వికలాంగులూ వగైరాలు, మళ్లీ రాగలమో లేదో, వచ్చినా యెప్పటికి మళ్లీ వస్తామో అనుకుంటూ వస్తారు. కాబట్టి, వారికి “ఫ్రీ” దర్శనాలకి వేరే క్యూ పెట్టాలి.
క్రొత్తగా పెళ్లయినవాళ్లూ, మ్రొక్కులు తీర్చుకోడానికి వచ్చేవాళ్లూ అనేక ఆశలతో వస్తారు కాబట్టి, వాళ్లకి నామినల్ గా ఓ రూ. 200 టిక్కెట్టు పెట్టొచ్చు.
ఇంక, పర్యాటకం కోసం వచ్చి, పనిలో పనిగా దేవుణ్నో, దేవతనో చూసేద్దామనుకొనేవాళ్లకి నామినల్ గా ఓ రూ.500 టిక్కెట్టు పెట్టొచ్చు.
ఆలాగే, దర్శనం ముఖ్యం కాకపోయినా, ఫలానా గుడినీ, ప్రాంతాన్నీ చూసి వచ్చాము అని చెప్పుకోవాలనుకొనే వాళ్లక్కూడా అదే టిక్కెట్టు పెట్టొచ్చు.
ఇంక, రానాలకీ, వీఐపీలకీ, వీవీఐపీలకీ, వాళ్ల హోదాలని బట్టి, ఒక లక్షనుంచి, పది లక్షల వరకూ టిక్కెట్లు పెట్టి, వాళ్ల తైనాతీలకి కూడా ఓ పది నుంచి ఇరవైమందికి ప్రత్యేక దర్శనాలు ప్రవేశపెట్టొచ్చు.
ఇంకా, గర్భగుళ్లో తోచినంతసేపు ధ్యానం చేసుకొంటామనే కాంట్రాక్టర్లూ, లిక్కర్ మహరాజులూ వగైరాలకి ఓ కోటి రూపాయలు నించి పది కోట్లవరకూ టిక్కెట్టు పెట్టొచ్చు.
మొదటి ప్రింటు సమర్పించే సినీ నిర్మాతలకీ, సినిమా హిట్ అవ్వాలనో, హిట్ అయ్యిందనో, దర్శనాలకి వచ్చే సినిమా వాళ్లకి మధ్యేమార్గంగా, ఓ 50 వేలో యెంతో టిక్కెట్టు పెట్టొచ్చు.
ఇలా చేస్తే, యే గుళ్లోనూ, యే క్షేత్రంలోనూ కూడా తొడతొక్కిడి లేకుండా, అందరూ కొన్ని నిమిషాల్లోనే దర్శనాలూ, పూజలూ చేయించేసుకోవచ్చు.
(నేను చెప్పిన రేట్లన్నీ కోటీశ్వర దేవుళ్లూ దేవతల ఆలయాలకి మాత్రమే. చిన్న చిన్న ఆలయాలకి అనుపాతంగా తగ్గించుకోవచ్చు. ఇంకా ఇలాంటి “దర్శనాల” అవిడియాలు యెవరికైనా వస్తే వ్రాయండి).
బుఱ్ఱపెట్టి ఆలోచించేవాళ్లెవరైనా అవి అమలు చేస్తారేమో చూద్దాము.

Saturday, November 12, 2011

"పం పంగ నామాలు"



ఆరొకట్లు

11.11.11--మళ్లీ  వందేళ్ల వరకూ రాదట. అదియొక వింత!

మొన్నోరోజున, ప్రపంచంలో 700 కోట్లవ శిశువు జన్మించిందన్నారు మన దేశంలోనే! అది నిజంగా ప్రపంచమంతా తెలుసుకోవలసిన అద్భుతమైన వింత.

మరి ఈ ఆరొకట్ల మాటో? 

మామూలుగా మూడొకట్లని "పంగనామాలు"గా వ్యవహరిస్తారు. మోసపోయినవాడిని "ఇంకేముంది! నీకు మిగిలింది......" అంటూ చేతి బొటన, చిటికెన వ్రేళ్లు మడిచి, నుదుటిమీద పైజుంచి క్రిందకి గీస్తున్నట్టుగా అభినయిస్తారు! 

ఆరొకట్లు కాబట్టి, రెండు పంగనామాలు. ఆ మాటలు కలిస్తే "ఆమ్రేడిత సంధి" అవుతుందోలేదో నాకు తెలీదు. కానీ, మా మేష్టారు--కవిశేఖర, కవిభూషణ, కవితావతంస శిష్ట్లా వెంకట సుబ్బయ్యగారు, "అందరూ మిట్ట మధ్యాహ్నం అంటారు. అది తప్పు. మధ్య+మధ్యాహ్నము=మట్ట మధ్యాహ్నము అవుతుంది"--అని చెప్పేవారు. 

అదే సూత్రాన్ని వుపయోగించి, "పం పంగ నామాలు" 'కాయిన్' చేశానన్నమాట! (ఇంగ్లీషులో క్రొత్త పదాలని, ప్రయోగాలని కనిపెడితే, దాన్ని కాయిన్ చెయ్యడం అంటారు. తెలుగులో అలాంటి మాట గుర్తుకురాక ఇలాగే వ్రాసేశాను.)

ఈ వేవె యెక్కడివరకూ వెళ్ళిందంటే, పేపర్లనిండా అవే వార్తలు--ఆరోజున 11గంటల 11 నిమిషాలకి, ఇంకా 11సెకన్లకి 'పుట్టిన శిశువులు' అంటూ ఫోటోలూ, వార్తలూ. 

కొంతమంది ఆ అంకెలు వ్రాసిన అట్టనో, కాయితాన్నో నిలువుగా వుంచి చూస్తే, "శివనామాలు" కనిపిస్తాయంటున్నారు. 

మా జిల్లా కలెక్టరైతే, అదేదో ట్రస్టుని ఆ రోజు, 11.11.11 (గం. ని. సె) కే "రిజిస్టరు" చేయించారట! (ఇలాంటి వాటిగురించి మరోసారి వ్రాస్తాను.) 

ఇంకా వింతేమిటంటే, స్కూలు పిల్లలు, వీపుమీద ఆరు అంకెలూ కనిపించేలా, ఆరు జడలు అల్లుకొని స్కూళ్లకి వెళ్లడం! (మధ్యలో చుక్కలకి కుర్తాలమీద ఆ రెండేసి జడల మధ్యలో యే నల్లింకుతోనూ చుక్కలు పెట్టుకోలేదు!)

ఇప్పటికి ఈ వేవె లు పరాకాష్టకి చేరాయంటారా? ఒక వేళ చేరితే, "పెరుగుట విరుగుటకొరకే" అనే సూత్రమ్మీద తగ్గుతాయంటారా? 

యేమో.......మన ఆహార, తదితర ద్రవ్యోల్బణాలమీద కూడా అలాంటి పిచ్చి ఆశతోనే బ్రతుకుతున్నాం ఇప్పుడు.

చూద్దాం. 

Friday, October 7, 2011

నాయకులూ.......



......పేదరికం

"గాంధీ" అనే మాట చెవిని పడగానే, "ఓ! ఆ అర్థనగ్న ఫకీరోడా!" అంటూ, తన చుట్టకాల్చిన శ్లేష్మంసహిత దగ్గుతో...."హె హె హ్హె!" అన్నాడట ఓ మ్లేఛ్ఛుడు. (మ్లేఛ్ఛుడు అంటే అర్థం యేమిటో......బ్రౌణ్యం నో, పాణినీయం నో, సూర్యారాయాంధ్రం నో శరణుకోరండి) 

"వాణ్ణి ఫకీరుగా వుంచడానికి రోజుకి ఓ 30 రూపాయలుపైగా ఖర్చు అవుతున్నాయి మాకు" అని వాపోయిందొకావిడ..... ఆవిడే--నైటింగేల్ ఆఫ్ ఇండియా--సరోజినీనాయుడు! 

(సరోజిని మాతృభాష తెలుగు. ఆవిడ ఆంగ్లంలో కవితలు కూడా వ్రాసింది. ఆంగ్లంలో 'హీ, షీ, ఇట్, దే' లకి తెలుగులో అతడు లేక వాడు, ఆమె లేక అది, అది, వారు అనే అనువదించింది. కొంతమంది అన్నోన్ వెధవలు--అన్నోన్లందరూ వెధవలు కారు, వెధవలందరూ అన్నోన్లు కారు--ఈ సూక్ష్మాలు తెలుసుకుంటే యెంతబాగుండునో!)   

యెందుకంటే, ఆయనకి యెక్కడో దూ....రం నుంచి, మేకపాలూ, బాదం పప్పులూ, వేరుశెనగపప్పులూ వగైరాలూ, కిరసనాయిలూ (ఆయన రాత్రిపూట దోమలు తనని కుట్టకుండా వొళ్లంతా కిరసనాయిలు పూసుకొనేవాడట!) తేవలసి వస్తూంది! అందట ఆవిడ. 

(ఆ యుధ్ధం రోజుల్లో, మొట్టమొదట రేషన్ విధించింది 'కిరసనాయిలుకే'నట. తరవాతే తిండిగింజలూ వగైరాలు!) 

ఆ రోజుల్లో (ఓ 70 యేళ్ల క్రితం) మహాత్ముడికి రోజుకి 30 రూపాయల ఖర్చంటే, ఈరోజుల్లో ఓ మూడువేలన్నమాట. మరి మన ప్రణాళికా సంఘంవాళ్లు ఈరోజుల్లో "తలా" ఒకరికీ 32 రూపాయిలో యెంతో అంటే, అప్పటికి దారిద్ర్యరేఖ క్రిందనున్న మహాత్ముడి తో సమానంగా మీరు వున్నారు అని చెప్పడమే కదా? 

మరి చెట్టుపేరుచెప్పుకొని కాయలమ్ముకుంటున్న కాంగీలు యేమి సాధించినట్టు? 

సరే! "ఆవిడకి 6 కోట్ల కారా?" అని యెద్దేవా చేశాడట--రాష్ట్రపతినుద్దేశించి--ఫిరోజ్ వరుణ్ గాంధీ. (వాడికీ జడ్ కేటగరీ భద్రతా అవీ వున్నాయనుకుంటా! తనకి ఓ 60 లక్షలో యెంతో పెట్టి, ఓ బులెట్ ప్రూఫ్ కారు కొనివ్వలేదని వాడి బాధేమో!)

వందకోట్లో ఇంకా యెక్కువో వున్న భారతీయులందరికీ రాజ్యాంగబధ్ధ నాయకురాలు కి ఆ మాత్రం భద్రత అవసరం లేదా?

అమెరికా ప్రెసిడెంట్ భద్రతకి కొన్ని బిలియన్ డాలర్లతో ప్రత్యేక బడ్జెట్ కేటాయిస్తారు. "ఎయిర్ ఫోర్స్-1" మెయింటెనెన్స్ కీ, సిబ్బందికీ, దాని ప్రత్యేక రక్షకదళానికీ, 24 గంటలూ దాన్ని సంసిధ్ధంగా వుంచడానికీ, ఒకవేళ దాన్ని వాడడంలో యేదైనా ఇబ్బంది యెదురైతే వాడడానికి మళ్లీ ఇంకో "ఎయిర్ ఫోర్స్-1" ని "స్టాండ్ బై" గా అదే సంసిధ్ధతతో వుంచడానికీ--అన్ని బిలియన్ డాలర్లు ఖర్చు చేస్తున్నారు అని తెలుసా?

మనకంత సీనులేకపోవచ్చుగానీ, మరీ కారుకూడా వద్దంటే యెలాగ?