haaram logo

Monday, March 3, 2014

విసుర్లు........


............తగిలేనా?!

మొన్నో రోజు పేపర్లో, ఒకాయన ఆధ్యాత్మిక వ్యాసం వ్రాస్తూ, రామకృష్ణ పరమహంస గా ప్రసిధ్ధి చెందినాయన, కాళికాలయం లో పూజారిగా పనిచేస్తూ, ఓ రోజున ఓ యోగి ఆకాశ మార్గాన ప్రయాణించడం, అయన వెనకే ఓ హంస యెగురుతూ వెళ్లడం చూసి, తాను కూడా అలా యెగిరి వెళ్లిపోతే బాగుంటుందనుకున్నాడట అనీ, తరువాత ఓ రోజు, కాళికామాత పాదాల దగ్గర ఆ హంసని చూసి ఆశ్చర్య పోయాడనీ, అక్కణ్నించి "పరమ హంస" అనే పేరు "తనకి తానే" పెట్టుకున్నాడనీ సెలవిచ్చారు. (నిజానిజాలేమిటో నాకు తెలీదు కానీ, ఆయన ఆధ్యాత్మిక పాండిత్యానికి అందరూ సంతోషించాలి.) 

ఇంతకు ముందు, ఓ సారి, విష్ణుచిత్తుడికి ఓ పాప దొరికితే, "శూడిక్కుడుత్త నాచ్చియర్" అని పేరు పెట్టుకొని పెంచాడని వ్రాసిందీ ఈ మహాను భావుడే. 

పత్రికవాళ్లు వీటిని ప్రచురించడం మాత్రం అత్యంత ముదావహం. 

ముదావహం అంటే గుర్తొచ్చింది..........

మా మునిసిపల్ ఛైర్మన్‌ ఒకాయన వుండేవారు. ఆయన ఉపన్యాసాలలో పదాలని వాడడం లో నిరంకుశుడు. (నిరంకుశాః కవయః అన్నారు).

ఘంటసాల కి సన్మానం చేస్తూ, ఆ సభాధ్యక్షుడిగా ఈయన "ఈయనెవరనుకున్నారు? మన సినిమాల్లో నాగేశ్వర్రావూ, రామారావూ పాటలు బలే పాడేస్తున్నారని మీరనుకుంటారు. కానీ వాళ్లతోపాటు యస్వీ రంగారావుకీ, సావిత్రీ వాళ్లక్కూడా పాటలు పాడేది ఈయనే!" అనెయ్యగానే, తరువాత మాట్లాడినాయన, "నిజమే, మాయాబజార్ లో సావిత్రిక్కూడా పాడారు" అని సమర్థించవలసి వచ్చింది. హాస్యం మాత్రం బాగా పండిందనుకోండి. 

ఆయనే పోలీసుకాల్పుల్లో ఓ వ్యక్తి మరణించినప్పుడు ఆవేశంగా 'తుపాకీ' వారి 'సీ ఆర్ పీ గుళ్లకి' నా ప్రజలు ఇలా బలై పోవడం చాలా 'ముదావహం'.......ఇలాంటి ముదావహాలు ఇకముందు జరిగితే యేమాత్రం సహించడానికి 'సంకోచించం' అంటూ, "పావుగంటలో 16 ముదావహాలు వేశాడు" అన్నాడు మా కృష్ణమాచారి. (ఈ కృష్ణమాచారి కృష్ణం రాజు సినిమా కృష్ణవేణి లో ఓ మంచి పాత్ర వేసి, డ్యాన్‌సుల్లో కూడా పాల్గొన్నాడు). 

అలా వుంటాయి.

మా భాషా, సాహిత్య, చరిత్ర నిపుణుడైన  మిత్రుడికి యే విషయమైనా మూలాల్లోకి వెళ్లి శోధించి, దాని వ్యుత్పత్తి యెలా జరిగిందో కనిపెట్టి, అందరికీ చెప్పడం ఓ సరదా. (ఈ విషయం లో మోడీ కన్నా తనకి కొంచెం యెక్కువే తెలుసు అని చెప్పుకుంటున్నాడీ మధ్య).

ప్రపంచ ప్రఖ్యాత రష్యన్‌ నాయకుడు లెనిన్‌ పూర్తి పేరు, అసలు పేరు, దాని అర్థం యేమిటో తెలుసా అని ప్రశ్నించి, యెవరూ సాహసం చెయ్యకపోవడంతో తనే చెప్పాడిలా--పూర్తి పేరు వ్లాడిమిర్ ఇల్ ఇచ్ లెనిన్‌. అసలు పేరు వ్లాడిమిర్ ఇల్ ఇచ్ ఉల్యనోవ్. అంటే అర్థం--వాళ్ల భాషలో వ్లాడ్ అంటే గోక్కోవడం. వ్లాడి అంటే గోక్కోవలసిన. మిర్ అంటే బాగా. వ్లాడిమిర్ అంటే బాగా గోక్కోవలసిన. ఇల్ అంటే చెడ్డదైన ఇచ్ అంటే దురద. ఉల్యనోవ్  అంటే ఉద్దీపింప చేసేవాడు అని. అంటే పూర్తిగా, బాగా గోక్కోవలసిన చెడ్డ  దురదని ఉద్దీపింప చేసేవాడు. అంటే, బాగా పెంచేవాడు. లేదా విజృంభింప చేసేవాడు అని. 

చూశారా యెంత చక్కటి పాండిత్యమో!

Wednesday, February 26, 2014

మన ప్రభుత్వం.............


...........ఆర్థిక స్థితీ 

మొన్న (24-02-2014) ఈనాడులో ఎస్ ఎస్ తారాపోర్ (ఈయన ఒక రినౌన్‌డ్ బ్యాంకర్. ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ఉన్నతపదవులు నిర్వహించిన విశ్రాంతుడు. మామూలు 'బ్యాంకింగ్ రంగ నిపుణుడు' కాదు!) వ్రాసిన కొత్త సర్కారుకు "ముందు నుయ్యి - వెనుక గొయ్యి" వ్యాసం చదివితే నేను నా బ్లాగుల్లో వ్రాస్తున్న ఆర్థిక విషయాలు (బ్యాంకులూ, ఇన్‌ఫ్లేషన్‌ వగైరాలు) యెంత నిజాలో మీకూ తెలుస్తుంది. ఈ క్రింది విషయాలు గమనించండి.

".........2013-14 కు సవరించిన అంచనాల ప్రకారం  కేంద్రానికి వివిధ ప్రభుత్వ  రంగ సంస్థల నుంచి లాభాలు, డివిడెండ్ రూపం లో వచ్చిన మొత్తం 2012-13 లో వాస్తవంగా ఇలా అందిన మొత్తం కన్నా 64 శాతం ఎక్కువ. దీన్నిబట్టి చూస్తే ఏమనిపిస్తోంది. ప్రభుత్వం తాను గీసుకున్న లక్ష్మణరేఖ (ద్రవ్య లోటును జీడీపీలో 4.8 శాతం లోపు ఉండేలా చూడడం) దాటాల్సిన అవసరం లేకుండా పోయింది. అర్థ్హం చేసుకుంటే ఇదంతా లెక్కల గిమ్మిక్కు మహత్యమేనని తెలియదూ!"

".........మొన్నటి మధ్యంతర బడ్జెట్లో.........ముఖ్యంగా వాహన పరిశ్రమకు ఊరట లభించింది. అయితే పెద్ద కార్ల విషయం లో గణనీయంగా తగ్గింపు ప్రకటించడం రాజకీయ ఒత్తిళ్లు ఎంతగా పనిచేశాయన్నదానికి అద్దం పడుతోంది..................సామాన్యుడికి మాత్రం ఒరిగేది ఏమీ లేదనే చెప్పుకోవాలి."  

"ప్రభుత్వ రంగ బ్యాంకులకు మూలధన సాయం రూపం లో రూ.11,200 కోట్లు అందించనున్నట్లు ఆర్థిక మంత్రి...........బ్యాంకుల స్వరూప స్వభావాలు జాతీయకరణ సమయం లో ఎలా ఉన్నాయో ఇప్పుడు కూడా అలాగే ఉన్నాయి. గత 45 యేళ్లలో బ్యాంకుల చరిత్ర తిరగేస్తే.....జబ్బుపడ్డ గుర్రాలకు రక్తమార్పిడి చేయడం, స్టెరాయిడ్లు ఎక్కించడం ద్వారా వాటిని పందెం గుర్రాలుగా తీర్చిదిద్దుతున్న ప్రయత్నం కనిపిస్తుంది...........జబ్బు తిరగబెట్టి మళ్లీ మళ్లీ.......మూలధన సాయం అవసరమౌతూ........మళ్లీ చతికిలపడిపోతూ......... చివరకు......నిలదొక్కుకోలేని విధానాల తాలూకు భారాన్ని మోయవలసింది మాత్రం సగటు వ్యక్తేనన్నది తోసిపుచ్చలేని వాస్తవం."    

"............ప్రధాన పారిశ్రామిక దేశాలతోపాటు భారత్ లోనూ ద్రవ్యోల్బణ రేటు పెరుగుతూ వస్తోంది...........రూపాయి విలువ పడిపోవడం అత్యంత సహజం. కానీ, మన రాజకీయవేత్తలు ఊరుకోరుగా...అరచి గగ్గోలు చేస్తారు..........ఆర్ బీ ఐ సరైన లక్ష్యాలనే నిర్దేశించింది.........ఆర్థిక మంత్రి మరింత బలపరచడమో, లేదా కనీసం సమర్ధించడమో చేయాలని ఎవరైనా ఆశిస్తారు. కానీ.........ప్రభుత్వా వైఖరి.....ఆర్ బీ ఐ..........కఠినతర ద్రవ్య విధానాలని వదలి వేసేటట్లుగా........ఒత్తిడిని పెంచనుంది........ప్రముఖ ఆర్థికవేత్త ఆచార్య పి.ఆర్.బ్రహ్మానందం మాటలలో చెప్పాలంటే 'ద్రవ్యోల్బణాన్ని పట్టించుకోకపోవడం ప్రాణాలు వదలిన, తీవ్రగాయాలతో మరణానికి దగ్గరగా ఉన్న, క్షతగాత్రులైన వారిని గురించి పట్టించుకోకుండా సమరానికి వెళ్ళడం లాంటిదే'. రానున్న నెలల్లో సామాన్యుడికి మరింత వేదనే మిగలనుంది."

వచ్చే ప్రభుత్వం తప్పులని సవరించి, సామాన్యుడికి న్యాయం చేస్తుందని ఆశిద్దాం.

Sunday, February 23, 2014

మన బ్యాంకులూ........2


.........నిరర్ధక ఆస్తులూ

బ్యాంకు ఉద్యోగుల యూనియాన్లు మొదటినుంచీ ఆ విధానాలని వ్యతిరేకిస్తున్నాయి. కోట్లాది రూపాయలు బకాయి పడ్డవాళ్లని ఒదిలేసి, ప్రభుత్వమే వివిధ పథకాల క్రింద ఇప్పించిన చిన్న చిన్న ఋణాలమీద ప్రతాపం చూపించమనడం, వాళ్ల మీద చర్యలు తీసుకోవడం ఏమిటి అని ప్రశ్నిస్తూనే ఉన్నాయి. విత్త మంత్రిగారేమో బ్యాంకుల లాభాలన్నీ ఉద్యోగుల జీతాలకే పోవాలా అంటున్నాడు. పెద్ద మొత్తాలలో ప్రభుత్వం వాటా డివిడెండ్ చెల్లించాలని బ్యాంకులని ఒత్తిడి చెయ్యడం, బ్యాంకులు బ్యాలెన్స్ షీట్లని మసిపూసి మారేడు కాయ చెయ్య్డడం , మళ్లీ వాటి కేపిటల్ కోసం పెద్ద యెత్తున నిధులు విడుదల చేస్తున్నామని చెప్పుకోవడం--ఇదంతా ఓ పెద్ద విష వలయం.

ఫినకిల్ సాఫ్ట్ వేర్ లో లోపాలు ఉన్నాయని యునైటెడ్ బ్యాంకు చేసిన ఆరోపణలని వెనక్కి తీసుకున్నారని చదివాము. బహుశా ఇన్‌ఫోసిస్ వాళ్లు అదేమీ లేదు అని చెప్పారు కాబట్టీ, అన్ని బ్యాంకులూ అదే సాఫ్ట్ వేర్ వాడుతున్నారు కాబట్టీ కావచ్చు. కానీ, ఆ సిస్టమ్ లో నిరర్ధక ఆస్తుల గుర్తింపు కోసం అనేక పరామితులు (పెరామీటర్స్) నిర్దేశించడంతో ఆ ప్రక్రియ సంక్లిష్టంగా మారింది. ఉదాహరణకి రాబోయే కాలం లో NPA లుగామారే ఆస్కారం వున్న ఖాతాలని చూపించమంటే, ఆ Potential NPA రిపోర్టు (PNPA అంటారు) తయారవడానికే కొన్ని గంటల సమయం పడుతుంది. ప్రింటు పేజీలతరబడి వస్తూనేవుంటుంది. ఆ బ్రాంచి (ఫినకిల్ లో సోల్--Service Outlet) లో ఉన్న అన్ని ఋణ ఖాతాలనీ చూపిస్తుంది. ఆ రిపోర్టు ఆథారంగా యే ఖాతా యెందుకు NPA గా మారుతుందో తెలుసుకొని, తగిన చర్య తీసుకోవడం యే మానవ మాత్రుడికీ సాధ్యం కాదు. కనీస యేఖాతాలో యెంత వసూలు చేస్తే ప్రమాదం తప్పుతుందో కూడా చూపించదు. ఓ ఖాతాలో 10 కోట్లు బాకీ వుంటే, అంతా చూపిస్తుంది. కనీసం యేతేదీ నుంచి అది NPAగా మారుతుందో చూపించదు. ఇంకా ఋణ ఖాతాల వైవిధ్యం ప్రకారం అయినా (టెర్మ్ లోన్లు వేరే, గోల్డ్ లోన్లు వేరే.....ఇలా) చూపిస్తే, చాలా వెసులుబాటుగా వుంటుంది. (ఇప్పుడు ఇవి యేమైనా మార్చారో లేదో నాకు తెలియదు కానీ, మేనేజర్లు తమ కష్టం యేమీ తగ్గక పోగా పెరుగుతోంది అని వాపోతున్నారు).

మళ్లీ కొత్త బ్యాంకులు స్థాపిస్తామంటారు. ముత్తూట్ వగైరాలు కూడా వైట్ లేబెల్ ఏటీఎం లు ప్రారంభిస్తామంటారు. ఓ పక్క యెక్కువ లావాదేవీలు జరగని ఏటీఎం లని మూసేస్తామంటున్నాయి బ్యాంకులు. (వాటికి కూడా పనిచేయు వేళలు అని బోర్డులు తగిలిస్తారనుకొంటా!) ప్రభుత్వమేమో ఆథార్ కోసం మరిన్ని చోట్ల మరిన్ని ఏటీఎం లు తెరవాలి అంటుంది. ఇదంతా ప్రగతి లో భాగమేనేమో!

దానికన్నా బ్యాంకులని డీ నేషనలైజ్ చేస్తే యెలా వుంటుదో ఆలోచించాలి మేధావులు.


Saturday, February 22, 2014

మన బ్యాంకులూ........




.........నిరర్ధక ఆస్తులూ

యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిరర్ధక ఆస్తులు 3 నెలల్లో ఒకేసారి యెక్కువగా పెరిగినట్టు "చూపించడం" తో ఆ బ్యాంకు సీ ఎం డీ బలి కావాలసి వచ్చింది. 

అసలు ఈ నిరర్ధక ఆస్తుల గుర్తింపే ఓ గందరగోళం. పైగా వాటివల్ల యెవరికీ ఏ ఉపయోగం లేదు--బ్యాంకుల షేర్ హోల్డర్లనీ, రిజర్వ్ బ్యాంకునీ, స్టాక్ మార్కెట్ నీ మోసం చెయ్యడం తప్ప. యెందుకంటే..........

అసలు వాటి గుర్తింపు, తగిన జాగ్రతా చర్యలు తీసుకోవడం, అవి వసూలు కాకపోతే బ్యాంకు లాభ నష్టాల ఖాతాలో తగిన "ప్రావిజన్" లు పెట్టడం విషయం లో ఓ విధానమంటూ మొదలయ్యాక, దాని కోసం ప్రతీ బ్యాంకూ వాళ్లిష్టం వచ్చినట్టు వ్యవహరించడం మొదలెట్టాయి. అప్పట్లో వివిధ స్థాయిల అధికార్లకీ ఈ నిరర్ధ్హక ఆస్తులు యెంత తక్కువగా చూపిస్తే, అంత గొప్ప. దాంతో, నానా కష్టాలూ పడి, సం వత్సరాంతం లో జరిగే "ఆడిట్" కి వచ్చే ఆడిటర్లని మేనేజ్ చేసుకొని, వీలైనన్ని నిరర్ధక ఆస్తులని చాపక్రింద తోసేసేవారు. 

ఓ ఐదారు యేళ్లుగా రిజర్వ్ బ్యాంకు కొద్దిగా కళ్లెర్రజేయడంతో, వీటిని పెంచి చూపించడం మొదలెట్టారు. అదీ దశలవారీగా. కానీ యెన్నాళ్లు దాగుతాయి? 

బ్యాంకులు సంక్షోభం యెదుర్కోకుండా అందించిన అస్త్రం రీ షెడ్యూల్ మెంట్. అంటే, ఋణం ఇచ్చేటప్పుడు యెన్ని వాయిదాలలో తిరిగి చెల్లించాలి, వడ్డీ యెలాకట్టాలి, అపరాధ వడ్డీ యెంత? లాంటి నిబంధనలు విధిస్తారు కదా? అలా చెల్లించలేని ఖాతాలు నిరర్ధక ఆస్తులు అయిపోతాయి. అందుకని, నిబంధనలు మార్పు చేసి, చెల్లించవలసిన వాయిదాలని పెంచడం, మొదటి వాయిదా చెల్లింపుని వీలైనంత దూరం జరపడం, అపరాధ వడ్డీ ముదరా.....ఇలా చేసి, హమ్మయ్య! ఇది నిరర్ధక ఆస్తి కాదు అని నిట్టూర్చడం!

రికార్డుల కోసం ఋణగ్రహీతలకి నోటీసులు ఇచ్చినట్టూ, వారి అంగీకారంతోనే నిబంధనలు మార్చి, ఋణాన్ని రీ షెడ్యూలు చేసినట్టూ పుస్తకాల్లో వ్రాసేస్తారు. ఆక్కడనుంచీ, 10 వేల రూపాయల చిన్న ఋణం నుంచీ కోట్ల రూపాయల ఋణాల వరకూ (వీటిని టెరమ్ లోన్లు అంటారు) రీషెడ్యూల్ చేసేస్తారు. అలా యెన్నాళ్లు? ఆడిటర్లు ఒప్పుకొన్నన్నాళ్లూ! 

ఇంకో నిబంధన యేమిటంటే, ఓ ఋణ గ్రహీత కి అనేక లిమిట్ లు ఉండొచ్చు. (ఓపెన్ లోన్, కీలోన్, టెరమ్ లోన్, బిల్ డిస్కవుంట్ లిమిట్, లెటర్ ఆఫ్ క్రెడిట్, గోల్డ్ లోన్, గ్యారంటీలు--ఇలా) వాటిలో యే ఖాతా నిరర్ధక ఆస్తి గా మారే అవకాశం వున్నా, అప్పుడు ఆ ఆస్తిలో ఈ అన్ని లిమిట్ ఖాతాల లోనూ చెల్లించవలసిన నిలవలనీ కూడా నిరర్ధక ఆస్తులుగానే ప్రకటించాలి. 

దీనికోసం బ్యాంకులు అనుసరించే పాధ్ధ్హతి--బ్యాంకులో యే ఖాతా తెరవాలన్నా, ఖాతాదారు వివరాలతో ఓ కోడ్ ఎలాట్ అవుతుంది కంప్యూటర్లో. అందుకని, వేరే వేరా ఖాతాలకి అవే వివరాలతో వేరే వేరే కోడ్ లు సృష్టించడం. దాంతో, ఫలానా కోడ్ తో వున్న ఖాతాలు చూపించమంటే, ఒక్క ఖాతానే చూపిస్తుంది కంప్యూటర్ మరి! మరి పై నిబంధనని తుంగలో తొక్కినట్టే కదా?

కొన్నేళ్ల క్రితం కొద్దిగా మార్పు వచ్చింది. కొత్తగా వచ్చిన సీ ఎం డీ నిరర్ధక ఆస్తులని యెక్కువగా చూపించి, ఆయన హయాం లో అవి తగ్గిపోయినట్టు చెప్పి, షేర్ వాల్యూ ని పెంచుకున్నారు. ఇంకా తరవాత రిజర్వ్ బ్యాంక్ సంకేతాలతో, స్టేట్ బ్యాంక్ సీ ఎం డీ, నిరర్ధక ఆస్తులని వీలైనంతవరకూ దాపరికం లేకుండా ప్రకటించాలని ఆదేశించడంతో, అవి విపరీతంగా పెరిగాయి. (ఆయన అదృష్టం కొద్దీ బలి అవలేదు). ఇతర బ్యాంకులు కూడా కొంత మారాయి. ఇప్పుడు యునైటెడ్ బ్యాంకు పరిస్థ్హితి చూస్తే, వాళ్లు మారలేదు అని తెలుస్తోంది. ఫలితమే ఆవిడ రాజీనామా!

మిగతా మరోసారి.......

Tuesday, January 14, 2014

నేటి జర్నలిజం


వార్తలూ, విశేషాలూ

13-01-2014, ఈనాడు జిల్లా ఎడిషన్ లో, శాస్త్రవేత్త ఎ.సూర్యతేజ్ "......తన అనుభవాలను..... పంచుకున్నారు...... ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే......." అంటూ.......

"జీ ఎస్ ఎల్ వీ-డీ5.......ప్రయోగంలో 'లిక్విడ్ ఇంజిన్ మెకానికల్ సిస్టం 'పై పనిచేసి........గర్వకారణం....... గతంలో పీ ఎస్ ఎల్ వీ ప్రయోగం ద్వారా 1.6 టన్నుల క్రయోజెనిక్ ఇంజిన్ ను కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. జీ ఎస్ ఎల్ వీ-డీ5 ప్రయోగం ద్వారా దాదాపు 2 టన్నుల బరువుతో కూడిన క్రయోజెనిక్ ఇంజిన్ ను కక్ష్యలోకి ప్రవేశ పెట్టడం ద్వారా.......ఘన విజయమనే చెప్పాలి"

అని ప్రచురించారు. (అండర్ లైన్ చేసింది నేను)

మరి ఆ విలేకరే అలా వ్రాశాడో, సబ్ ఎడిటర్ పట్టించుకోలేదో! ఇంకా ఇలాంటివాళ్లని యెన్నాళ్లు భరిస్తారో?
     
అసలే జర్నలిస్టులూ, సబ్ ఎడిటర్లూ దొరక్క మేమేడుస్తూంటే ఈ గోల యేమిటీ అంటారేమో!

Sunday, November 11, 2012

మనదేశం……



………కంప్యూటర్లూ

“సర్కారీ పెద్దలకి కావలసిన పెద్ద మనిషొకడు వచ్చి, ‘అయ్యా….బ్రతకడానికో దారి చూపండి‘ అంటూ ప్రాధేయపడితే, ‘సరే! ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలని కంప్యూటరీకరిస్తూ బ్రతుకు’ అన్నాడటా సర్కారీ పెద్ద. 2008 నుంచీ ‘అలా బ్రతికేస్తున్నాడు‘ వాడు! ఇప్పుడు కోట్లాది రూపాయల కుంభకోణాలు బయట పడుతున్నాయి. అయినా కంప్యూటరీకరణ యెక్కడ వేసిన గొంగళీ అక్కడే అన్నట్టుంది.”—ఇదీ ఓ ప్రముఖ వార్త!

అంతకు ముందెప్పుడో చంద్రబాబు చేసిన తప్పేమిటయ్యా అంటే, విజన్ 2020 పేరుతో, ప్రభుత్వ కార్యకలాపాలన్నీ కంప్యూటరైజ్ చెయ్యాలనుకోవడం. (అప్పట్లో ఆయన అందజేసిన కంప్యూటర్లని ‘కర్మచారులు‘ గొడ్డళ్లతో నరికేశారు—పని చెయ్యాల్సొస్తుందనీ, చేస్తే తమ గుట్లు బయటపడతాయనీ!) అదే ‘అయాచిత వరం‘ అయ్యింది తరవాతవాళ్లకి.

రెవెన్యూ ఆఫీసుల మధ్య అనుసంధానం, రిజిస్ట్రేషన్ ఆఫీసుల అనుసంధానం, వాటికీ వీటికీ అనుసంధానం, వీటన్నింటినీ హైదరాబాదుతో అనుసంధానం, మళ్లీ అన్నీ ‘మీ సేవ‘ కేంద్రాలతో అనుసంధానం……ఇలా నిరంతరం కొనసాగుతూ వస్తోంది. (యెవరికీ ఒక్క పైసా ప్రయోజనం లేదింతవరకూ. పైగా అనేక కష్టాల పాలవుతున్నారు సామాన్య ప్రజలు. దానికి తోడు వరదలూ గట్రా వచ్చి, కార్యాలయాలు నీట మునిగితే, మళ్లీ కంప్యూటరు వాళ్ల పంట పండినట్లే!)

ఇక, కేంద్రంలో అయితే—ఆథార్ కోసం, జనాభా రిజిస్టర్ కోసం, ప్రభుత్వ పథకాల కోసం, ‘పైలట్ ప్రాజెక్టుల‘ కోసం, వాటి అనుసంధానం కోసం—ఇలా కొనసాగుతూనే వున్నాయి. 

ఇప్పుడు తాజాగా ‘నగదు బదిలీలు!’.

నేనిదివరకే వ్రాశాను—కంప్యూటర్లు మనదేశానికి వచ్చినప్పటినుంచీ మనదేశం లో వాటిపేరుతో యెంత ఖర్చుపెట్టారో, దానిలో యెంత వృధా అయ్యిందో దర్యాప్తు చేస్తే, అది మన జనాలు విదేశీ బ్యాంకుల్లో దాచుకున్న నల్ల ధనం కన్నా, మన కరెంటు ఖాతా లోటు కన్నా, మన ప్రభుత్వాలు ‘ఆమ్ అద్మీ’ కి ఇస్తున్న సబ్సిడీలకన్నా—కొన్నిరెట్లు వుంటుందని.

అసలు వీళ్లని సబ్సిడీలెవరు ఇవ్వమన్నారు?

దేశంలో మొదటిసారిగా 1962 లో చైనా యుధ్ధం మొదలైనప్పుడు ‘రేషన్ విధానం‘ పుట్టుకొచ్చింది—సైన్యావసరాలకి పోను మిగతా ఆహార పదార్థాలూ, కిరొసిన్ వంటి వాటిని ప్రజలకి కొద్ది నియంత్రణతో మాత్రమే అందించాలనే వుద్దేశ్యంతో. (ఆ కాలంలోనే వ్యాపారులు అక్రమ నిల్వలు చెయ్యడం, బ్లాక్ మార్కెట్ అనే వ్యవస్థా పుట్టాయి. నెహ్రూగారు ‘బ్లాక్ మర్కెట్ చేసేవాళ్లని దగ్గరలోని దీపస్థంభానికి వురితీయాలి‘ అని అక్రోశించిందప్పుడే).

తరవాత 1965 పాకిస్థాన్ యుధ్ధం సమయంలో మళ్లీ రేషన్ విధించాల్సిన అవసరం వచ్చింది. ఇదేకాకుండా, లాల్ బహదూర్ శాస్త్రి దేశ ప్రజలందరూ ‘వారానికి ఒక పూట భోజనం మానేసి, దానికయ్యే ఖర్చు దేశ రక్షణ నిధికి ఇవ్వండి‘ అని విజ్ఞప్తి చేశారు! (అప్పటికే దేవుళ్లపేరుతో—ముఖ్యంగా వెంకటేశ్వర స్వామికి శనివారాలు ఒంటిపూట భోజనాలు చేస్తున్నవాళ్లు కూడా ఇంకో పూట దేశంకోసం మానేశారు!)

మరి ఈ పచ్చ కార్డులూ, గులాబీ కార్డులూ, తెల్ల కార్డులూ, పసుపు కార్డులూ, గొడవా యెప్పుడు మొదలయ్యింది?

…….(మరోసారి)  

Tuesday, October 16, 2012

శబ్దకాలుష్యం..........



.........ప్రవచనాలూ

"వినదగునెవ్వరు చెప్పిన......" అన్నారు. అది ఇక్కడ సరిపోదుగానీ, ప్రవచనాలు మాత్రం నిజంగా అందరూ వినవలసిందే.......వంటపట్టించుకోవలసిందే. 

నిజంగా ఈ ప్రవచనాలు చెప్పేవాళ్లు "పుంభావ సరస్వతులు". వాళ్లకి నా నమోవాకాలు.

మొదట చెప్పుకోవలసింది "ధారణా రాక్షసుడు" అని బిరుదు పొందిన మాష్టారి గురించి. అలవోకగా పురాణాల్లోంచీ, ఇతిహాసాల్లోంచీ, ప్రసిధ్ధ కవులనుంచీ, అవధానాల నుంచీ సమర్థనలు ఇస్తూ, మధ్యలో చక్కని జోకులూ, కొండొకచో చురకలూ వేస్తూ గంటలతరబడి చెప్పేస్తూ వుంటారు. టీవీ ఛానెళ్లలో కూడా సుమారు గత పదేళ్లుగా తరచూ వినిపిస్తూంటుంది ఈయన గొంతు. చెప్పుకోవలసిందేమిటంటే, స్పుటమైన స్వరంతో, తక్కువ శబ్దంతో విన్నా, స్పష్టంగా అర్థమౌతాయి ఈయన ప్రవచనాలు.

మొన్నీమధ్య అమెరికాలో సభలకి వెళ్లినప్పుడు, ఆయనకి అందరూ ఇచ్చిన పంచెలూ, శాలువాలూ (ఆయన మరిచిపోయారనుకుని) ఓ ప్యాకెట్ తయారుచేసి, పార్థ రామరాజుగారు అనే ఆయన ఎయిర్ పోర్టుకి తెచ్చి ఆయనకి ఇవ్వబోయారట. నిజానికి ఆయన అవన్నీ వదిలెయ్యాలనే వదిలేసి వచ్చారట. (ఈ విషయం బలభద్రపాత్రుని రమణి కౌముదిలో వ్రాశారు.) 

సన్మానాలు పేరుచెప్పి, ఓ బొకే ఇచ్చి, ఓ మాల (కొండొకచో గజమాల) వేసి, ఓ శాలువా కప్పి, ఓ జ్ఞాపిక అందించడం, ఫోటోలూ, వీడియోలూ తీయించుకోడం, పేపర్లలోనూ, టీవీల్లోనూ అవి వచ్చేలా చూసుకోవడం! నిజంగా "సన్మానితుడికి" వాటివల్ల వుపయోగం యేమైనా వుందా? నిజంగా ఆయన్ని వాటితో గౌరవించినట్టేనా? అని యెవరూ ఆలోచించరు. 

మొన్నీమధ్య మావూళ్లో గురు సహస్రావధానిగారికి సన్మానం చేస్తే, ఒకే రోజున 29 శాలువాలు కప్పారు! (ఆయన అవన్నీ యేమిచేసుకొన్నాడో?)

మొన్న "పబ్లిసిటీ ఈశ్వర్" కి "నంది" బహుమతి వస్తే, ఆయనకొచ్చిన జ్ఞాపికలన్ని ఓ గోడలా పేర్చి, ముందు ఆయన్ని కూర్చోపెట్టి, ఫోటో తీసి పేపర్లలో వేశారు. (ఇన్నాళ్లూ ఆయన ఒక్కసారైనా ఆ జ్ఞాపికలన్నీ చూసుకొని, యేది యెప్పుడు వచ్చిందో తలుచుకొని, ఆనందించాడనుకోను.)

సరే......ఇవన్నీ అలా వుంటే, ఇంకో పెద్దాయన సుమారు ఓ మూడునాలుగేళ్లుగా--పురాణేతిహాసాలనుంచి - విద్యార్థుల వ్యక్తిత్వ వికాసం వరకూ, సాయిబాబా నుంచి - పుంతలో ముసలమ్మ వరకూ--అనర్గళంగా ప్రవచనాలు చెపుతున్నారు. ఉదయం నుంచీ అర్థరాత్రివరకూ యేదో ఓ టీవీ ఛానెల్లో ఈయన ప్రవచనాలు వినిపిస్తూనే వుంటున్నాయి.

అసలే ఆయనది "ఉచ్చైస్వరం". మైకూ స్పీకర్లూ లేకపోయినా చివరకూర్చున్నవాళ్లక్కూడా వినిపిస్తుంది ఆయన గొంతు. కానీ టీవీల్లో, ఆయన అసలే చాలా వేగంగా మాట్లాడడంతో, స్పష్టతలోపించి, కాస్త యెక్కువ సౌండ్ పెడితేగానీ సరిగ్గా అర్థం అవదనుకుంటా. ఉదయం, సాయంత్రం "వాకింగు" కి వెళుతూండేవాళ్లకి వీధులోకి గట్టిగా ప్రతీ ఇంట్లోంచీ ఆయన గొంతు వినిపిస్తూనే వుంటుంది.

పాపం ఆయన యేవిధమైన ప్రతిఫలం పుచ్చుకోరట. తన స్వంత వాహనంలో, స్వంత ఖర్చులతోనే వెళ్లి ప్రవచిస్తారట. 

అంతవరకూ బాగానే వుంది. ఇప్పుడు ఆయన ప్రవచనాలని సీడీల్లో, డీవీడీల్లో రికార్డు చేసి, వీధి గుళ్లలో వుదయం, సాయంత్రం వాయించేస్తున్నారు! మరి దానికి ఆయన అనుమతి యేమైనా వుంటుందని నేననుకోను.

అదృష్టవశాత్తూ, మనకన్నీ "పవిత్రమైన" మాసాలూ, "పవిత్రమైన" రోజులూ వుండడంతో ఆ గుళ్లలో ప్రతీరోజూ రెండు పూటలా ఘంటసాల భగవద్గీతో, ఎం ఎస్ రామారావు సుందరకాండో, పాత ఘంటసాల సినిమా భక్తి పాటలో, తరవాత అన్నమయ్యా, రామదాసూ, రామరాజ్యం సినిమా పాటలో వాయిస్తూ వుండేవారు. ఇప్పుడు లేటెస్ట్ ఈ ప్రవచనాలు.

ఆ చుట్టుప్రక్కల ఇళ్లలో వయో వృధ్ధులూ, బీపీ, హార్ట్ పేషెంట్లూ వుంటే వాళ్ల తాలూకువాళ్లు వెళ్లి కాస్త సౌండ్ తగ్గించమని వేడుకొంటే, వెంటనే తగ్గిస్తారు గుడివారు. కానీ మరో ఐదునిమిషాల్లోనే యెవరో "భక్తుడు" వాళ్లని తిట్టేస్తాడు.......వెంటనే సౌండ్ పెంచేస్తాడు!

మరి ఈ శబ్దకాలుష్యాన్ని అరికట్టేది యెవరో? జీవ వైవిధ్యాన్ని, పర్యావరణాన్నీ కాపాడేది యెలాగో? యెవరైనా ఆలోచిస్తున్నారా?

శుభం భూయాత్.