haaram logo

Thursday, September 24, 2015

శ్రవణ హింస-3

"భ్రష్ట భయంకర" సంగీతం-3

ఈ చవితి పందిళ్లకి అనుమతులు ఇచ్చేవాళ్లూ, తీసుకునే వాళ్లూ ఒకలాగే వున్నారు. 

స్కూళ్లకి సెలవలు ఇచ్చిన రోజుల్లో పగలూ రాత్రీ కూడా ఈ గోల తప్పలేదు. స్కూళ్లు తెరిచాక కూడా, మా వీధి పందిట్లో అంత సౌండ్ తోనూ పాటలు వేస్తూంటే, ఓ పోలీసాయన వచ్చాడు. వాళ్లు పాటలు ఆపేసి, "పూజలు ప్రారంభం అవబోతున్నాయి" అంటూ అనౌన్స్ చేశారు! ఆ పోలీసు, పెర్మిషన్ చెక్ చేసినట్టున్నాడు....."పూజలకి  మైక్ వాడొచ్చు" అని వుందేమో.....వెళ్లిపోయాడు. 

మరి మంత్రాలు అంత గట్టిగా వినిపించినా, స్కూళ్లకి యేమీ ఫరవాలేదు అని వాళ్ల భావమేమో! ఇంకా విచిత్రమేమిటంటే, పూజ అయిపోయాక మళ్లీ వెకిలిపాటల ప్రారంభం! స్కూళ్ల దారి స్కూళ్లదే.....!

ఇదివరకు ఇళ్లలో పూజ చేసుకునేవాళ్లు, ఆ సాయంత్రమే ఉద్వాసన చెప్పేసేవారు. పందిళ్లలో, నవరాత్రులూ అయ్యాక చేశేవారు. నిమజ్జనాలు లేవు. 

ఇప్పుడు యే శాస్త్రం లోంచి పట్టుకొచ్చారోగానీ, 11 రోజులు వుంచి, ఆ తరువాత నిమజ్జనం ట!

మా వీధి వాళ్లకి చందాలు తగ్గాయో, కాళ్లు చల్లబడ్డాయో గానీ, నాలుగో రోజునే నిమజ్జనం చేసేశారు. 

దాంతో బయటపడ్డాం......ఈ శ్రవణ హింస నుంచి!

జై జై వినాయక!
 
(.....మరో సారి)  

10 comments:

  1. శాస్త్రమా! ఏమి శాస్త్రం!! అంతా రౌడీ శాస్త్రం అంతే.

    ReplyDelete
  2. "రౌడీశాస్త్రం". ఈ కాలానికి సరిపోయే పదం coin చేసారు శివరామప్రసాదు గారు.
    ఈ వేలంవెర్రి నగరాల నుంచి కోస్తా లోని ఊళ్ళకి కూడా వ్యాపించిందన్నమాట? ఆశ్చర్యం లేదులెండి, ఇటువంటివి త్వరగానే వ్యాపిస్తాయి; వ్యాపారాలకి, రౌడీలకి, ఛోటామోటా రాజకీయ నాయకులకి ఆదాయం తెచ్చిపెట్టే వ్యవ్యహారాలు కదా. ఈ శబ్దహింస మధ్యలో చిక్కుకుపోయి పాత సినిమాల్లో సుత్తి వీరభద్రరావు లాగా చొక్కాలు చింపుకోవాలనిపించే పరిస్ధితి.

    ReplyDelete
  3. యేకీభవించినందుకు చాలా సంతోషం శివ గారూ! మనలో మన మాట, ఇలాంటి శాస్త్రాలని ప్రవేశపెడుతున్న పురోహితులూ వగైరాలని కూడా రౌడీలే అందామా?

    ReplyDelete
    Replies
    1. తప్పు చేసేవారిని ఎవరినైనా సరే నిందించాలిసిందే. పురోహితుల్లోనూ రౌడీ పురోహితులు ఎందుకు లేరు. ఒకసారి అలహాబాదు త్రివేణీ సంగమం కానీ, కాశీ గంగా ఘాట్లు కానీ చూసిన వాళ్ళకి తెలుస్తుంది.

      ఇంతటి అపభ్రంశంపు పూజలు, పూజలపెరిట జరుగుతుంటే, మన మఠాధిపతులు, స్వామీజీలు, వగైరా ఏమి చేసుతున్నారో తెలియదు. మినపగారెలు తింటూ, అపానవాయుభ్రమణం, శబ్ద వైచిత్రి, వాయు కల్మష రీతులు మీద పరిశోధనలు చేస్తూ తమ తమ విధులను మరిచారని నా ఆరోపణ.మన మాట నాయకులుగా ఉన్న ఈ మఠాదిపతులు మేల్కొని, జాతిని జాగురూకులను చేసి జరుగుతున్నా చెత్త పనులకు స్వస్థి చెప్పాల్సిన సమయం ఎప్పుడో అయిపోయింది.ఇంకా చూస్తూ ఊరుకుంటే, ఉన్న పేరు ఏమైనా మిగిలి ఉంటే గింటే ఆవిరి అయిపోతుంది.

      Delete
    2. పై వ్యాఖ్యలో మాట ను "మత" గా చదువుకోమని ప్రార్ధన.
      అలాగే, జరుగుతున్నా ను "జరుగుతున్న" గా చదువగలరు.

      Delete
    3. శివ గారూ! పూరీ లోనూ.....అలాంటి పూజారుల మీద కథలే వున్నాయి. ఇంక మఠాధిపతుల్లో.......ఇదివరకు లాంటి వాళ్లు యెవరు మిగిలారు? యెక్కడో గరికిపాటి వారి లాంటి వాళ్లు తప్ప, వాటిని కనీసం ప్రస్తావించే సాహసం కూడా చెయ్యడం లేదు. ఇంక కాస్త చదువుకున్న వాళ్లే, ఇలాంటి వాటిని మార్చడానికి ప్రయత్నించాలి. ముఖ్యంగా.....మీడియా లో వున్నవాళ్లు.

      మీ స్పందనకి హృదయ పూర్వక ధన్యవాదాలు.

      Delete
  4. కొన్ని సంవత్సరాల క్రితమే వ్యాపించేసి, వ్రేళ్లూనుకుంది విన్నకోట వారూ! ఇప్పుడు క్రొత్త వేలం వెర్రి.....కిలోల కొద్దీ లడ్డూలూ,వాటి వేలం!

    ReplyDelete
  5. అవునవును లడ్డూ ట్రెండ్ ఒకటుంది కదా. ఈ ఏడు హైదరాబాదులో ఓ చోట 6000 కిలోల లడ్డూ వినాయకుడి చేతిలో పెట్టారట. ఆరువేల కిలోలంటే ఆరు మెట్రిక్ టన్నులు !! ఎటు పోతున్నామో తెలియడం లేదు :(

    ReplyDelete
    Replies
    1. ....ఆ లడ్డూల్ని ఆత్రేయపురం నుంచో మరెక్కడి నుంచో రవాణాకి భారీ వాహనాలూ, వాటిని పైకెత్తి చేతిలో పెట్టటానికి భారీ క్రేన్లూ, అవి తడిసిపోకుండా ప్రత్యేక పాత్రలూ, వీటి ఖర్చూ వగైరాలు ప్రక్కన వుంచితే, అంత బరువు మోసే చేతికి యెంత బలమైన ఇనుప వూచలూ, సిమెంటు వగైరాలు వాడుతున్నారో? యెన్ని లక్షల మంది మట్టి వినాయకులని వాడితే, వాటి నిమజ్జనాలతో వీటి నష్టం భర్తీ అవుతుందో? నిమజ్జనాలకేమో, ప్రభుత్వం ఖర్చుతో మళ్ళీ భారీ క్రేన్లూ, పోలీసులూ, అనేక ఎలక్ట్రానిక్ ఉపకరణాలూ! వీటిని బ్యాన్ చేసే వాళ్లకే ఓట్లేస్తామని హైదరాబాదీలు యెప్పుడు చెపుతారో, అప్పుడే.....

      Delete
    2. మీరిదివరలో అన్నట్లు "జాతీయ దుబారా". మరో మాట లేదు.

      Delete